బెడిసికొట్టిన కర్ణాటక నిర్ణయం.. పార్కుల వద్ద ఇదీ పరిస్థితి..
లాక్ డౌన్ సడలింపుల్లో భాగంగా ప్రతీరోజూ ఉదయం 2 గంటల పాటు పార్కులను కూడా ఓపెన్ చేయాలన్న కర్ణాటక ప్రభుత్వ నిర్ణయం బెడిసికొట్టింది. బెంగళూరులోని లాల్ బాగ్ బొటానికల్ గార్డెన్ ఎంట్రన్స్ వద్ద మంగళవారం ఉదయం భారీ సంఖ్యలో జనం గుమిగూడారు. క్యూ లైన్ ఎక్కువగా ఉన్న కారణంగా థర్మల్ స్క్రీనింగ్ టెస్టుల కోసం చాలామంది అరగంటకు పైగా ఎదురుచూడాల్సి వచ్చింది.
ఒక్క బొటానికల్ గార్డెన్ వద్ద మాత్రమే కాదు.. నగరంలోని చాలా పార్కుల వద్ద ఇదే పరిస్థితి కనిపించింది. ఈ నేపథ్యంలో కర్ణాటక ప్రభుత్వ నిర్ణయంపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. పార్కుల వద్ద ఎవరూ హడావుడి చేయట్లేదని.. అంతా సాఫీగానే సాగుతోందని కొందరు అభిప్రాయపడుతుంటే.. పార్కుల వద్దకు వస్తున్నవారిలో ఎక్కువమంది 65 ఏళ్లు పైబడ్డ వారేనని మరికొందరు చెబుతున్నారు. కరోనా వైరస్ నియంత్రణలో భాగంగా 65 ఏళ్ల పైబడ్డ వారు బయటకు రావద్దని ప్రభుత్వం విజ్ఞప్తి చేసినప్పటికీ.. అవేవీ పట్టించుకోవడం లేదంటున్నారు.
Recommended Video
ప్రభుత్వం కేవలం రెండు గంటల పాటు మాత్రమే పార్కులను ఓపెన్ చేయడం వల్ల ఈ సమస్య తలెత్తుతోందని.. అలా కాకుండా ఎక్కువ గంటలు ఓపెన్ చేసి ఉంచితే ఎంట్రన్స్ గేటు వద్ద జనం ఎక్కువగా గుమిగూడే అవకాశం ఉండదని మరికొందరు సూచిస్తున్నారు. ప్రభుత్వం దీనిపై ఆలోచిస్తుందో లేదో తెలియదు కానీ.. ప్రజా జీవనాన్ని తిరిగి సాధారణ స్థితికి తీసుకువచ్చేందుకే పార్కులు ఓపెన్ చేసినట్టు చెబుతోంది.