భర్తను చంపేసి ప్రియుడితో పరారైన మహిళ
భోపాల్: ఓ మహిళ తన భర్తను గొంతు కోసి చంపి, ప్రియుడితో పారిపోయిన సంఘటన మధ్యప్రదేశ్ రాష్ట్రంలో చోటు చేసుకుంది. మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని కోత్వాలీ పోలీసు స్టేషన్ పరిధిలో జరిగిన ఆ సంఘటన కాస్తా ఆలస్యంగా వెలుగు చూసింది.
కోత్వాలీ పోలీసు స్టేషన్ ఇంచార్జీ సునీల్ ఖేమారియా కథనం ప్రకారం - అశోక్ సింగ్ (34) తన భార్య అంజన, ముగ్గురు పిల్లలతో కలిసి బైంద్లో నివాసం ఉంటున్నాడు. ఈ క్రమంలో వారం రోజుల నుంచి వీరి ఇంటికి తాళం వేసి ఉంది. ఈ విషయాన్ని గమనించిన అశోక్ తల్లి ఉషా కోత్వాలీ పోలీసులను ఆశ్రయించింది.
గత ఏడు రోడులుగా కుమారుడి కుటుంబం గురించి తెలియడం లేదని, వారి ఇంటికి తాళం వేసి ఉందని గురువారం ఫిర్యాదు చేసింది. అశోక్ ఇంటికి చేరుకున్న పోలీసులు తాళాలు బద్దలు కొట్టి ఇంట్లోకి ప్రవేశించారు. అశోక్ రక్తం మడుగులో పడి ఉండడాన్ని చూశారు. ఓ పదునైన ఆయుధంతో అతని గొంతు కోసినట్లు గుర్తించారు.
మృతుడి భార్య అంజన, ముగ్గురు పిల్లల గురించి తెలుసుకునేందుకు పోలీసులు దర్యాప్తు చేపట్టారు. అశోక్ భార్యకు ఆశీష్ చౌదరి అనే వ్యక్తితో వివాహేతర సంబంధం ఉందని, తమకు అడ్డుగా ఉన్నాడని భావించి ప్రియుడితో కలిసి హత్య చేసి ఉండవచ్చునని పోలీసులు అనుమానించారు.
ప్రియుడు ఆశీష్ చౌదరితో పాటు అంజన, ముగ్గురు పిల్లలు పరారీలో ఉన్నట్లు పోలీసులు తెలిపారు. మృతుడి తల్లి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు సాగిస్తున్నారు.