ఎన్ని కుట్రలు చేసినా దేశాన్ని విచ్ఛిన్నం కానివ్వం: ప్రధాని మోడీ
జమ్మూ : సార్వత్రిక ఎన్నికల్లో భాగంగా రెండోదశలో పోలింగ్ జరగనున్న ప్రాంతాలపై ప్రధాని నరేంద్రమోడీ దృష్టి పెట్టారు. జమ్మూకాశ్మీర్ పర్యటనలో భాగంగా కథువాలో ప్రచారం నిర్వహించిన ఆయన ప్రతిపక్షాలపై నిప్పులు చెరిగారు. విపక్షాలు ఎన్ని కుట్రలు చేసినా దేశాన్నివిచ్ఛినం కానివ్వమన్న ఆయన.. వారికి ఓటర్లే బుద్ధి చెప్పాలని కోరారు. ఈసారి ఎన్నికల్లో అఖండ విజయం సాధిస్తామని మోడీ ధీమా వ్యక్తం చేశారు.
దేశాన్ని విచ్ఛిన్నంకానివ్వమన్న మోడీ
ఫరూక్ అబ్దుల్లా, మొహబూబా ముఫ్తీ కుటుంబ రాజకీయాలు జమ్ముకాశ్మీర్ ప్రజల భవిష్యత్తును నాశనం చేశాయని మోడీ ఆరోపించారు. వారి కారణంగా మూడు తరాలు దెబ్బతిన్నాయని అన్నారు. ఆ కుటుంబాల నుంచి వచ్చిన నాయకులకు రాజకీయ విశ్రాంతినిస్తేనే రాష్ట్రానికి మంచిదని మోడీ అభిప్రాయపడ్డారు. ఎన్ని కుయుక్తులు పన్నినా దేశాన్ని విచ్చిన్నం చేయనివ్వమని స్పష్టం చేశారు. కాశ్మీరీ పండితుల సమస్యను పరిష్కరిస్తామన్న మాటకు కట్టుబడి ఉన్నామని మోడీ మరోసారి స్పష్టం చేశారు.
2014 కన్నా ఎక్కువ సీట్లు
గత ఎన్నికల కన్నా ఈసారి బీజేపీ అత్యధిక సీట్లు సాధిస్తుందని ప్రధాని మోడీ ఆశాభావం వ్యక్తంచేశారు. 2014 కన్నా ఇప్పుడు బీజేపీ మరింత బలపడిందన్న ఆయన.. కాంగ్రెస్ కంటే మూడింతలు ఎక్కువ సీట్లు సాధిస్తామని ధీమా వ్యక్తం చేశారు. జమ్మూ, బారాముల్లాలో భారీస్థాయిలో పోలింగ్ జరగడంపై ప్రధాని సంతోషం వ్యక్తం చేశారు. ప్రజలు భారీ సంఖ్యలో ఓటింగ్లో పాల్గొని ఉగ్రవాదులు, అవకాశవాదులకు గట్టిగా సమాధానం చెప్పారని మోడీ అభిప్రాయపడ్డారు.
అమరీందర్పై ఘాటు వ్యాఖ్యలు
జలియన్వాలా బాగ్ ఉదంతానికి 100 సంవత్సరాలు గడిచిన సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమానికి కాంగ్రెస్ నేతలు డుమ్మా కొట్టడంపై మోడీ ఫైర్ అయ్యారు. ప్రభుత్వం నిర్వహించిన కార్యక్రమానికి ఉపరాష్ట్రపతి హాజరైనా పంజాబ్ సీఎం అమరీందర్ సింగ్ మాత్రం రాకపోవడాన్ని ఆయన తప్పుబట్టారు. కాంగ్రెస్ వారసుడితో వెళ్లి నివాళులర్పించిన అమరీందర్.. స్వామి భక్తి చాటుకునేందుకు ప్రభుత్వ కార్యక్రమానికి డుమ్మా కొట్టారని విమర్శించారు. అమరీందర్ దేశభక్తి గురించి తనకు తెలుసన్న మోడీ.. ఆయనపై ఒత్తిడి ఉన్నందునే కార్యక్రమానికి గైర్హాజరై ఉంటారని కాంగ్రెస్పై పరోక్ష విమర్శలు చేశారు.