ప్రశ్నే!ఆ బెత్తం ఒత్తిడి మోడీ తట్టుకుంటారా: సచిన్ సెటైర్
న్యూఢిల్లీ: లోకసభ ఎన్నికల్లో బిజెపి విజయానికి ఆర్ఎస్ఎస్ కారణమని, అయితే నాగ్పూర్ (ఆర్ఎస్ఎస్) నుంచి ఎదురయ్యే వత్తిళ్లను ప్రధాని నరేంద్ర మోడీ ఎంతకాలం పాటు తట్టుకోగలుగుతారనేది, పెద్దన్న పాత్ర పోషిస్తూ బిజెపిపై పెత్తనం చెలాయిస్తున్న ఆర్ఎస్ఎస్ నరేంద్ర మోడీకి ఎంతకాలం అండగా ఉంటుందనేది ప్రశ్నార్థకమేనని కాంగ్రెస్ నాయకుడు సచిన్ పైలట్ సోమవారం అన్నారు.
కాంగ్రెస్ పార్టీ నుంచి దేశానికి విముక్తి కల్పించాలన్న బిజెపి నినాదంపై ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. బిజెపి నేతృత్వంలోని ఎన్డీయే ప్రభుత్వం పెత్తనం చెలాయిస్తోందనడం ఎవరూ కాదనలేని వాస్తవమన్నారు. బిజెపి నుంచి గానీ, జనతాదళ్ నుంచి గానీ దేశానికి విముక్తి కల్పించాలని తాము ఎన్నడూ చెప్పలేదన్నారు.
కాంగ్రెస్ పార్టీ నుంచి దేశానికి విముక్తి కల్పించాలని బిజెపి నినదించడం ప్రస్తుతం దేశాన్ని పరిపాలిస్తున్న వారి అతివాద ధోరణులను ప్రతిబింబిస్తోందన్నారు.
దేశంలోని మహిళలు ఎటువంటి దుస్తులు ధరించాలో, ఎటువంటి దుస్తులు ధరించకూడదో కొన్ని సంస్థలే నిర్ధేశిస్తూ గోవా మంత్రుల ద్వారా చెప్పిస్తున్నాయని సచిన్ పైలట్ ధ్వజమెత్తారు. రాజ్యాంగానికి బద్ధుడనై పరిపాలన సాగిస్తానని ప్రమాణం చేసిన నరేంద్ర మోడీ ఆర్ఎస్ఎస్ నుంచి ఎదురయ్యే వత్తిడులను ఎంతకాలం తట్టుకోగలరో అర్థం కావడం లేదన్నారు.
ఆర్ఎస్ఎస్ బెత్తం చాలా పెద్దది, పొడవైందని, రాజ్యాంగాన్ని అనుసరిస్తానని వాగ్దానం చేసిన మోడీ, ఆ బెత్తాన్ని ఎంత కాలం తట్టుకుని నిలుస్తారో చూడాలన్నారు. మోడీ నాయకత్వాన్ని వ్యతిరేకిస్తూ పార్టీకీ, పదవులకూ రాజీనామ చేసిన అద్వానీ ఆ తర్వాత మనసు మర్చుకోవడం వెనకున్నది ఎవరో అందరికీ తెలుసునన్నారు.