ర్యాంకుల ఎఫెక్ట్: చీపురు పట్టిన యోగి ఆదిత్యనాథ్, ‘యూపీ ఇక భద్రం’
స్వచ్ఛ ఉత్తరప్రదేశ్ కోసం ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ స్వయంగా రంగంలోకి దిగారు. పరిశుభ్రతలో ఉత్తరప్రదేశ్ రాష్ట్రం అట్టడుగు స్థానంలో ఉండటంతో స్వచ్ఛ యూపీకి నడుంబిగించారు.
లక్నో: స్వచ్ఛ ఉత్తరప్రదేశ్ కోసం ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ స్వయంగా రంగంలోకి దిగారు. పరిశుభ్రతలో ఉత్తరప్రదేశ్ రాష్ట్రం అట్టడుగు స్థానంలో ఉండటంతో స్వచ్ఛ యూపీకి నడుంబిగించారు. తన చేతులతోనే స్వయంగా ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. మంత్రులతో కలిసి చీపురు పట్టి లక్నో వీధులను శుభ్రం చేశారు.
ఇటీవల కేంద్ర ప్రభుత్వం వెల్లడించిన స్వచ్ఛ సర్వేక్షణ్ ర్యాంకుల జాబితాలో ఉత్తరప్రదేశ్ చివరి స్థానంలో ఉన్న విషయం తెలిసిందే. ఒక్క వారణాశి మినహా దాదాపు 50 పట్టణాలు 300 కంటే కింది స్థానాలు దక్కించుకున్నాయి. వారణాశి 32వ ర్యాంకులో నిలిచింది. దీంతో ఈ విషయాన్ని సీరియస్గా తీసుకున్న యూపీ సీఎం ఆదిత్యనాథ్.. రాష్ట్రంలో పరిశుభ్రతపై ప్రత్యేక దృష్టి సారించారు.
శనివారం ఉదయం చీపురు చేతబట్టి లక్నోని బాలు అడ్డా కాలనీలో రోడ్డు వూడ్చారు. ఆయనతో పాటు సీనియర్ కేబినెట్ మంత్రి సురేశ్ కన్నా, పలువురు మంత్రులు, ప్రజాప్రతినిధులు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. అయితే యోగి ఆశయానికి పలువురు మద్దతివ్వగా.. మున్సిపల్ సిబ్బంది మాత్రం భిన్నాభిప్రాయలు వ్యక్తం చేశారు. కాగా, ప్రజలకు తమతోపాటు తమ పరిసరాలు శుభ్రంగా ఉండాలనే ఆలోచన వస్తే తప్ప పరిస్థితిలో మార్పు రాదని స్థానిక మున్సిపల్ సిబ్బంది చెబుతుండటం గమనార్హం.
రాష్ట్రంలో వివక్షకు తావులేదు
తమ పాలనలో వివక్షకు తావులేదని సీఎం యోగి ఆదిత్యనాథ్ స్పష్టం చేశారు. ఎలాంటి వ్యత్సాసం లేకుండా సమాజంలోని అన్ని వర్గాలకు తమ ప్రభుత్వం న్యాయం చేస్తుందని అన్నారు. యూపీ ఇక జంగిల్ రాజ్యంగా ఎంతమాత్రమూ ఉండబోదని తేల్చి చెప్పారు. అన్ని వర్గాలకు రాష్ట్రంలో భద్రత ఉంటుందని చెప్పారు. తమ రాష్ట్రంలోని ప్రతి సోదరి, కూతురు సురక్షితంగా ఉన్నామని భావించాలని అన్నారు.
టోపీకి, బొట్టుకూ తేడా లేదు
తనకు అన్ని మతాలు ఒకటేనని, యూపీలో ఉన్న ప్రతి ఒక్కరికి రక్షణ కల్పించడమే తమ ప్రభుత్వ లక్ష్యమని ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ తెలిపారు. తనకు టోపీకి (ముస్లిం), బొట్టుకు (హిందూ) తేడా లేదని స్పష్టం చేశారు. ఓ జాతీయ చానల్ తో మాట్లాడిన సందర్భంగా ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. తాను స్థాపించిన హిందూ యువవాహిని సంస్థ అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడుతోందన్న నివేదికల గురించి ప్రశ్నించగా... ఆయన తీవ్ర స్థాయిలో స్పందించారు.
మెడలో కాషాయ కండువాలు వేసుకున్న వారు జాగ్రత్తగా ఉండాలని, లేకపోతే వాళ్లపై కఠిన చర్యలు తీసుకుంటానని హెచ్చరించారు. అంతేకాదు, బీజేపీని కాని లేదా దీనికి సంబంధించిన ఏ ఇతర సంస్థ పేరునైనా పాడుచేద్దామని ఎవరైనా ప్రయత్నిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని చెప్పారు.