యువకుడు మృతి చెందాడని కిమ్స్ లో పోస్టుమార్టుం, ప్రాణాలతో, 20 నిమిషాలకు !
బెంగళూరు: రోడ్డు ప్రమాదంలో గాయాలైన యువకుడిని ఆసుపత్రికి తరలించారు. ప్రాణాలతో ఉన్న యువకుడు చనిపోయాడని అనుకున్న హుబ్బళిలోని కిమ్స్ ఆసుపత్రి వైద్యులు పోస్టుమార్టం గదికి తరలించారు. 7 గంటల తరువాత పోస్టుమార్టం చెయ్యడానికి ప్రయత్నించిన సమయంలో యువకుడు ప్రాణాలతో ఉన్న విషయం బయట పడింది. అయితే అప్పటికే ఆలస్యం కావడంతో 20 నిమిషాల్లో యువకుడు మరణించాడు.
హుబ్బళిలోని ఆనంద నగర్ లో ప్రవీణ్ మూళే (23) అనే యువకుడు నివాసం ఉంటున్నాడు. ఆదివారం రాత్రి 7 గంటల సమయంలో జరిగిన కారు ప్రమాదంలో ప్రవీణ్ కు తీవ్రగాయాలైనాయి. రాత్రి 8 గంటల సమయంలో కుటుంబ సభ్యులు ప్రవీణ్ ను హుబ్బళిలోని కిమ్స్ ఆసుపత్రికి తరలించారు.
సోమవారం వేకువ జామున 3 గంటల సమయంలో ప్రవీణ్ మరణించాడని పోస్టుమార్టం గదికి తరలించారు. సోమవారం ఉదయం 10 గంటల సమయంలో పోస్టుమార్టుం చెయ్యడానికి వైద్యులు వెళ్లిన సమయంలో ప్రవీణ్ ప్రాణాలతో ఉన్న విషయం వెలుగు చూసింది.
వెంటనే కుటుంబ సభ్యులు హుబ్బళిలోని ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. అయితే 20 నిమిషాల క్రితం ప్రవీణ్ మరణించాడని ప్రైవేటు ఆసుపత్రి వైద్యులు దృవీకరించారు. హుబ్బళి కిమ్స్ వైద్యుల నిర్లక్షానికి అమాయకుడి ప్రాణాలు పోయాయని ప్రవీణ్ కుటుంబ సభ్యులు, అతని స్నేహితులు కిమ్స్ ఆసుపత్రి ముందు ఆందోళన చెయ్యడంతో పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేస్తున్నారు.