తీర్పు కోరండి: విభజనపై జగన్ కాంగ్రెసుకు సవాల్
చెన్నై: రాష్ట్ర విభజనపై వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్ కాంగ్రెసు అధిష్టానానికి సవాల్ విసిరారు. రాష్ట్ర విభజనకు వ్యతిరేకంగా మద్దతును కూడగట్టే కార్యక్రమంలో భాగంగా ఆయన బుధవారం తమిళనాడు ముఖ్యమంత్రి జయలలితను, డిఎంకె అగ్రనేత కరుణానిధిని కలిశారు వారిద్దరు తాను చెప్పిన విషయాలను విన్నారని, ఇది ముఖ్యమైన అంశమని వారు గుర్తించారని ఆయన చెప్పారు. ఇరువురు నేతలతో భేటీ తర్వాత జగన్ మీడియాతో మాట్లాడారు. కాంగ్రెసుకు నమ్మకం ఉంటే ప్రజల తీర్పు కోరాలని ఆయన కాంగ్రెసుకు సూచించారు.
2014 ఎన్నికలను రెఫరెండంగా భావించాలని ఆయన కాంగ్రెసు పార్టీకి సూచించారు. విభజనకు ముందు ఎన్నికలు నిర్వహించాలని, తాము సమైక్య నినాదంతో ఎన్నికలకు వెళ్తామని, తమ పార్టీ వైఖరి అదేనని, తమకు 30 లోకసభ స్థానాలు వస్తాయనే విశ్వాసం ఉందని, కాంగ్రెసుకు ఎక్కువ సీట్లు గెలుస్తామని విశ్వాసం ఉంటే ఎన్నికలు నిర్వహించాలని ఆయన అన్నారు. ఆంధ్రప్రదేశ్ ప్రజలు తన సమైక్యవాదాన్ని బలపరుస్తారనే నమ్మకం తనకు ఉందని ఆయన అన్నారు
రాష్ట్ర విభజనపై ఢిల్లీలో వారేం చేస్తున్నారో వారికే తెలియదని ఆయన అన్నారు. రెండు రోజుల క్రితం రాయల తెలంగాణ ప్రతిపాదన ముందుకు తెచ్చారని, శాసనసభలో ముసాయిదా బిల్లును సాధారణ మెజారిటీతో గెలిపించుకునే వ్యూహంలో బాగంగా రాయలసీమకు చెందిన రెండు జిల్లాలను కలపాలని అనుకుంటున్నారని ఆయన అన్నారు. ఇప్పుడు రాయలసీమను కూడా చీలుస్తారట అని ఆయన అన్నారు. రెండు జిల్లాలు మాత్రమే కాకుండా సీమాంధ్ర మొత్తాన్ని కలిపి రాష్ట్రానికి తెలంగాణ పేరు పెట్టాలని ఆయన సూచించారు.

రాష్ట్ర విభజనను అడ్డుకోకపోతే తీర్మానం లేకుండా విభజనకు గురైన తొలి రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ అవుతుందని, అది జరిగితే ఆ రాష్ట్రంతోనే ఆగిపోదని ఆయన అన్నారు. తీర్మానం లేకుండా రాష్ట్రాన్ని విభజించినప్పుడు మౌనంగా ఉంటే ప్రజాస్వామ్యానికి ఆరోగ్యకరం కాదని ఆయన అన్నారు. ప్రజాస్వామ్యం కోసం గొంతెత్తే ప్రతి ఒక్కరూ తనతో కలిసి రావాలని ఆయన కోరారు. ప్రధాని చెప్పినా, కాంగ్రెసు చెప్పినా విభజనను పార్లమెంటు మాత్రమే నిర్ణయించాలని ఆయన అన్నారు. ఓట్ల కోసం సీట్ల కోసం రాష్ట్రాన్ని విభజిస్తున్నారని, అందుకే విభజనను వ్యతిరేకిస్తున్నామని, తాను కూడా సాధారణ వ్యక్తినే అని, అందుకే అందరి సహకారం కోరుతున్నానని ఆయన అన్నారు.
పార్లమెంటులో తమకు ముగ్గురు సభ్యులు మాత్రమే ఉన్నారని, వాస్తవాన్ని అంగీకరించాలని, అందుకే విభజన బిల్లును అడ్డుకోవడానికి ఇతర పార్టీల సహకారం కోరుతున్నానని ఆయన చెప్పారు.












Click it and Unblock the Notifications