రఘురామరాజు రియాక్షన్: స్పీకర్కు లేఖ, క్రమశిక్షణ ఉల్లంఘించలేదు..
వైసీపీ ఎంపీ రఘురామ కృష్ణరాజు అనర్హత వేటుకు సంబంధించి లేఖల పరంపర కొనసాగుతోంది. ఇటీవల వైసీపీ స్పీకర్ ఓం బిర్లాకు లేఖ రాసిన సంగతి తెలిసిందే. ఇదివరకే లేఖ రాయగా.. మరోసారి రాశారు. దీనికి రఘురామరాజు స్పందించారు. ఆయన కూడా స్పీకర్ ఓం బిర్లాకు లేఖ రాశారు. తాను చేసిన తప్పేంటి అని అడిగారు. ఏ రోజు పార్టీకి వ్యతిరేకంగా నడుచుకోలేదని స్పష్టంచేశారు.
Recommended Video
లేఖాస్త్రం..
లోక్సభ స్పీకర్ ఓంబిర్లాకు వైసీపీ ఎంపీ రఘురామకృష్ణరాజు లేఖ రాశారు. తనపై అనర్హత వేటు వేయాలని ఎంపీ విజయసాయిరెడ్డి ఇచ్చిన ఫిర్యాదును పట్టించుకోవద్దని కోరారు. పార్టీ క్రమశిక్షణను తాను ఎక్కడా ఉల్లంఘించలేదని తెలిపారు. ప్రభుత్వ వైఫల్యాలను చక్కదిద్దుకోవాలని హితవు చెప్పడం.. పార్టీ వ్యతిరేక కార్యకలాపాల కిందకు రాదని లేఖలో పేర్కొన్నారు. భిన్నాభిప్రాయాన్ని వ్యక్తం చేయడం అసమ్మతి కాదన్నారు. ఈ లేఖతోపాటు గతంలో సుప్రీంకోర్టు తీర్పులను రఘురామ రాజు జతచేశారు. తన ప్రవర్తన పార్టీ ఫిరాయింపుల నిరోధక చట్టం కిందకు రాదని, పార్టీ విప్ను ఎన్నడూ ఉల్లంఘించలేదని లేఖలో రఘురామ తెలిపారు.
చర్యలు తీసుకోండి..
వైసీపీ ఎంపీ రఘురామకృష్ణరాజును సస్పెండ్ చేయాలని లోక్ సభ స్పీకర్ ఓం బిర్లాకు వైసీపీ పార్లమెంటరీ పార్టీ నేత విజయసాయిరెడ్డి లేఖ రాశారు. రఘురామరాజుపై అనర్హత వేటు వేయాలని గతంలోనే వైసీపీ ఎంపీలు ఓం బిర్లాను కలిసి ఫిర్యాదు చేసిన సంగతి తెలిసిందే. ఇదే అంశాన్ని వారు మరోసారి లేఖలో ప్రస్తావించారు. రఘురామరాజుపై అనర్హత వేటు వేయాలని గత ఏడాది జులై 3న ఫిర్యాదు చేశామని... జాప్యం చేస్తున్నారని లేఖలో వారు పేర్కొన్నారు. ఇదే అంశంపై పలుమార్లు కలిసి ఫిర్యాదు చేసినా అనర్హత వేటు వేయకపోవడం దురదృష్టకరమని ఆయన అన్నారు. ఆర్టికల్ 10 ప్రకారం పార్టీకి వ్యతిరేకంగా పనిచేస్తున్న రఘురామరాజును డిస్ క్వాలిఫై చేయాలన్నారు. దీనిపై ఇదివరకే చాలాసార్లు విన్నవించామని లేఖలో గుర్తుచేశారు. ఈ నెల 11వ తేదీన రిమైండర్ పిటిషన్ కూడా ఇచ్చామని వివరించారు.
11 నెలలు గడుస్తోన్నా..
అనర్హత పిటిషన్ ఇచ్చి 11 నెలలు అవుతుందని విజయసాయి రెడ్డి తెలిపారు. దీనిపై సివిల్ ప్రొసిజర్ ప్రకారం వెళుతున్నామని తమకు సమాధానం అందిందని చెప్పారు. ఇదే అంశాన్ని చాలా సార్లు గుర్తుచేశామని.. ఇప్పటికైనా చర్యలు తీసుకోవాలని కోరారు.