బీహార్లో అవినీతిని సహించను: లాలూ కొడుకు తేజస్వి
పాట్నా: తనను ఉప ముఖ్యమంత్రి పదవిలో కూర్చుండబెట్టడంపై వస్తున్న విమర్శల పైన ఆర్జేడీ చీఫ్ లాలూ ప్రసాద్ యాదవ్ తనయుడు తేజస్వి యాదవ్ సోమవారం నాడు స్పందించారు. తాను రాష్ట్ర అభివృద్ధి కోసమే పాటుపడుతానని ప్రామిస్ చేశారు.
అంతేకాదు, అవినీతిని ఎట్టి పరిస్థితుల్లోను సహించేది లేదని చెప్పారు. ఆయన తండ్రి లాలూ ప్రసాద్ యాదవ్ పైన తీవ్ర అవినీతి ఆరోపణలు ఉన్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో తాను అవినీతిని సహించేది లేదని తేజస్వి యాదవ్ చెప్పారు.
సోమవారం నాడు తేజస్వి యాదవ్ మంత్రిగా బాధ్యతలను స్వీకరించారు. ఈ సందర్భంగా మాట్లాడారు. రాష్ట్రంలో రోడ్లు, మౌలిక సదుపాయాలు అభివృద్ధి చేయవలసి ఉందని చెప్పారు. ప్రతి ఊరికి రహదారి తన లక్ష్యమని చెప్పారు.
గత నితీష్ ప్రభుత్వ హయాంలో రహదారులను వేగంగా అభివృద్ధి చేశారని కితాబిచ్చారు. తాను దానిని మరింత ముందుకు తీసుకు వెళ్తానని చెప్పారు. అవినీతిని తాను ఎట్టి పరిస్థితుల్లోను సహించేది లేదని చెప్పారు.
కాగా, గడ్డి కుంభకోణం నేపథ్యంలో లాలూ ప్రసాద్ పైన ఆరేళ్ల పాటు ఏ ఎన్నికల్లో పోటీ చేయకుండా వేటు పడిన విషయం తెలిసిందే.
అంతేకాదు, మూడు రోజుల క్రితం బీహార్ కెబినెట్ ప్రమాణ స్వీకారం సందర్భంగా.. అవినీతి రహిత రాజకీయాలు అంటూ ఢిల్లీ ముఖ్యమంత్రి అయిన అరవింద్ కేజ్రీవాల్, లాలూ కౌగిలించుకోవడంపై సెటైర్లు వచ్చాయి. దీనిపై కేజ్రీవాల్ వివరణ కూడా ఇచ్చుకోవాల్సి వచ్చింది.
మద్యపానం నిషేధం దిశగా బీహార
సంపూర్ణ మద్యపాన నిషేధం దిశగా బీహార్ ప్రభుత్వం అడుగులు వేస్తోంది. గత జూలైలో తాను మళ్లీ ఎన్నికల్లో గెలిస్తే సంపూర్ణ మద్య నిషేధం విధిస్తానని ముఖ్యమంత్రి నితీష్ ప్రకటించారు. తాజా ఎన్నికల్లో ఆయన మళ్లీ గెలిచి ముఖ్యమంత్రి పీఠం ఎక్కారు.
దీంతో కొత్త ప్రభుత్వం మద్యపాన నిషేధం దిశగా ఆలోచిస్తోందని ఆ రాష్ట్ర ఎక్సైజ్ మంత్రి అబ్దుల్ జలీల్ మస్తాన్ తెలిపారు. పాట్నాలో ఆయన మాట్లాడారు. నిషేధం విషయమై ఆలోచిస్తున్నామని, అందుకు అవసరమైన ముందస్తు చర్యలను చేపట్టామన్నారు. రానున్న ఆరు నెలల్లో దీనిపై స్పష్టమైన ప్రకటన వెలువరుస్తామన్నారు.