రాజస్థాన్ను వణికిస్తున్న జికా వైరస్... దోమల మందు మార్చాల్సిందిగా కేంద్రం ఆదేశం
Recommended Video
ఓ వైపు రాజస్థాన్లో ఎన్నికల సందడి నెలకొనగా మరో వైపు ఆ రాష్ట్రాన్ని జికా వైరస్ వణికిస్తోంది. ఇప్పటి వరకు 100 జికా వైరస్ కేసులు నమోదైనట్లు అధికారులు తెలిపారు. పరిస్థితి ఆందోళనకరంగా మారుతుండటంతో కేంద్రం ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ టీమ్ను ఆగమేఘాలపై రాజస్థాన్కు తరలించింది. వెంటనే తగు జాగ్రత్త చర్యలు తీసుకోవాల్సిందిగా వారికి సూచించింది. మొత్తం 100 మందికి జికా వైరస్ లక్షణాలు కనిపించగా అందులో 23 మంది గర్భిణిలు ఉన్నట్లు ఢిల్లీ ఆరోగ్యశాఖ తెలిపింది. బుధవారం 20 కేసులు బయటపడగా అవన్నీ జైపూర్లోనే బయటపడ్డట్లు ఆరోగ్యశాఖ వెల్లడించింది.
జైపూరుకు కేంద్రం పంపిన ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ అధికారులు చేరుకున్నారు. అక్కడ దోమలను చంపేందుకు వాడుతున్న మందును వారు మార్చారు. దోమల నుంచే జికా వైరస్, డెంగ్యూ, చికన్గున్యా లాంటి ప్రమాదకర వైరస్లు సోకుతుండటంతో వాటిని చంపేందుకు ఇంకా నాణ్యమైన మందును సరఫరా చేయనుంది. సింధి క్యాంపు, జనసాంద్రత ఎక్కువగా ఉన్న శాస్త్రి నగర్ నుంచి దోమల శాంపుల్స్ సేకరించగా వాటిలో జికా వైరస్ గుర్తించారు.
ప్రస్తుతం చికిత్స అందించాకా జికా వైరస్ పేషెంట్లు ఆరోగ్యంగా ఉన్నట్లు అధికారులు వెల్లడించారు. ట్రీట్మెంట్ పొందిన వారిలో జికా వైరస్ లక్షణాలు కనిపించలేదని తెలిపారు. ఎక్కువగా జికా కేసులు శాస్త్రినగర్ ప్రాంతంలో గుర్తించినట్లు అధికారులు తెలిపారు. ఇప్పటి వరకు శాస్త్రినగర్లో లక్ష గృహాల్లో ఉన్న వారికి పరీక్షలు నిర్వహించామని ఇందుకోసం 330 టీమ్లు పనిచేశాయని వెల్లడించారు.జికా వైరస్ను సమీక్షించేందుకు కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి జేపీ నడ్డా ఉన్నత స్థాయి సమావేశం నిర్వహించారు.