వంద ఏళ్ల నాటి ఆలయాన్ని కూల్చివేసిన పాక్, వానొచ్చి పడిపోయిందట!
పాకిస్థాన్లోని పంజాబ్ ప్రావిన్స్లో వంద ఏళ్లకు పైగా చరిత్ర కలిగిన ఓ ప్రాచీన హిందూ దేవాలయం దారుణంగా నేలమట్టమైంది. స్థానిక కరడుగట్టిన మతాధిపతులు, భూ బకాసురులు కుట్ర పూరితంగానే ఈ ఆలయాన్ని ధ్వంసం చేశారని స్థానిక హిందువులు, మైనారిటీ సంఘాలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. పక్కనే ఉన్న మదర్సా విస్తరణ కోసమే ఆలయ భూమిని కబ్జా చేయడానికి ఈ దురాగతానికి ఒడిగట్టారని ఆరోపిస్తున్నారు. అయితే, తమ దేశంలో మైనారిటీల ఆస్తులకు రక్షణ లేదనే నిజం బయటపడకుండా ఉండేందుకు పాక్ ప్రభుత్వం మాత్రం ఈ ఘటనపై కవర్ డ్రైవ్లు ఇస్తోంది. భారీ వర్షాల వల్లే శతాబ్దాల నాటి పాత భవనం కూలిపోయిందంటూ కథనాలు అల్లుతోంది.
లాహోర్కు దాదాపు 130 కిలోమీటర్ల దూరంలో ఉన్న నారోవాల్ జిల్లా, సిరాజ్ గ్రామంలో 100 నుంచి 125 ఏళ్ల చరిత్ర కలిగిన ఓ ప్రాచీన హిందూ దేవాలయం ఉంది. దాదాపు వెయ్యి చదరపు మీటర్ల విస్తీర్ణంలో ఉన్న ఈ ఆలయాన్ని గత నెల ఆగస్టు 21న కొందరు తీవ్రవాద భావజాలం ఉన్న వ్యక్తులు కావాలనే కూల్చివేశారని పాకిస్థాన్ మసీహా మిల్లత్ పార్టీ (PMMP) ప్రతినిధులు, స్థానిక హిందూ నాయకులు తెలిపారు. ఆలయాన్ని నేలమట్టం చేయడమే కాకుండా.. దాని ప్రాంగణంలోని ఇటుకలు, గోడలు, శికరంపై ఉన్న ఖరీదైన లోహపు రాడ్లు, సామగ్రిని సైతం దోచుకెళ్లారని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

మదర్సా కోసం కబ్జా ప్లాన్.. అక్రమార్కుల గుప్పిట భూములు!
ఈ దారుణం వెనుక నిషేధిత తీహ్రిక్-ఇ-లబ్బైక్ పాకిస్థాన్ (TLP) స్థానిక నాయకుల ప్రమేయం ఉందనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఆలయానికి ఆనుకుని ఉన్న స్థలాన్ని గతంలో ఒక మదర్సా కోసం 'ఎవాక్యూ ట్రస్ట్ ప్రాపర్టీ బోర్డ్' (ETPB) లీజుకు ఇచ్చింది. అయితే, ఏళ్లకు ఏళ్లు అద్దె చెల్లించకపోవడం, లీజు నిబంధనలను ఉల్లంఘించడంతో సదరు లీజును అధికారులు రద్దు చేశారు. అయినా సరే, అక్రమార్కులు ఆ స్థలాన్ని ఖాళీ చేయకపోగా, నెమ్మదిగా ఆలయానికి సంబంధించిన గదులను, మిగతా భూమిని కూడా కబ్జా చేశారు. చివరకు గుడిని పూర్తిగా తుడిచిపెట్టేసి ఆ భూమిని కూడా మదర్సాలో కలిపేసుకునేందుకు ఈ కూల్చివేతకు పాల్పడ్డారని స్థానిక నాయకుడు అస్లాం పర్వేజ్ సాహోత వెల్లడించారు.
ప్రభుత్వం చెప్పేవన్నీ అబద్ధాలే!
పాకిస్థాన్ మైనారిటీ ప్రతినిధులు భద్రత కల్పించాలని మొరపెట్టుకుంటున్నా, అక్కడి పంజాబ్ హోమ్ శాఖ గానీ, ఈటీపీబీ అధికారులు గానీ పట్టించుకోవడం లేదు. ఆలయం కూలిపోవడానికి వానలే కారణమని ఈటీపీబీ సీనియర్ అధికారి రాణా ఇఫ్తికార్ చెబుతుండటం వారి నిర్లక్ష్యానికి అద్దం పడుతోంది. పైగా తమ రికార్డుల్లో ఆ దేవాలయానికి పేరే లేదని చెబుతూ బాధ్యతల నుంచి తప్పుకునే ప్రయత్నం చేస్తున్నారు. లీజు రద్దు చేసి, ఆక్రమణదారులను ఖాళీ చేయించాలని ఈ ఏడాది జనవరిలోనే ఆదేశాలు వచ్చినా అధికారులు అమలు చేయలేదని, ఏప్రిల్లోనే పోలీసులకు ముప్పు పొంచి ఉందనే నివేదికలు ఇచ్చినా రక్షణ కల్పించలేదని తెలుస్తోంది.
భయ గుప్పిట్లో స్థానిక హిందువులు!
పాకిస్థాన్లో రోజురోజుకూ మైనారిటీల పట్ల పెరుగుతున్న వేధింపులకు ఈ ఘటన ప్రత్యక్ష నిదర్శనంగా నిలిచింది. తమ పవిత్ర స్థలాన్ని కళ్లముందే నాశనం చేసినా ఏమీ చేయలేని నిస్సహాయ స్థితిలో అక్కడి హిందువులు ఉన్నారు. ఆక్రమణదారులు దర్జాగా మదర్సా నడుపుతూ బెదిరింపులకు దిగుతుండటంతో, కూలిపోయిన గుడి వైపు వెళ్లడానికి కూడా భయపడుతున్నామని నారోవాల్ జిల్లా శాంతి కమిటీ సభ్యుడు రతన్ లాల్ ఆవేదన వ్యక్తం చేశారు. తక్షణమే ఈ ఘటనపై నిష్పాక్షిక విచారణ జరిపి, బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని, ధ్వంసమైన చారిత్రక దేవాలయాన్ని ప్రభుత్వం సొంత ఖర్చులతో పునర్నిర్మించాలని స్థానిక మైనారిటీ సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి.














Click it and Unblock the Notifications