ఘోర రైలు ప్రమాదం: 44మంది మృతి, 180మందికి గాయాలు
కైరో: ఈజిప్టులోని అలెగ్జాండ్రియాలో శుక్రవారం ఘోర రైలు ప్రమాదం చోటుచేసుకుంది. రెండు రైళ్లు ఢీకొనడంతో 44 మంది ప్రాణాలు కోల్పోయారు. మరో 180 మందిపైగా గాయపడినట్లు అక్కడి స్థానిక అధికారులు వెల్లడించారు.
వెనుకనుంచి వచ్చి...
కెనాల్ సిటీ నుంచి బయల్దేరిన ఓ రైలు ఖోర్షిద్ ప్రాంతంలోని చిన్న రైల్వేస్టేషన్ వద్ద ఆగింది. ఇంతలో కైరో నుంచి అలెగ్జాండ్రియా వెళ్తున్న మరో రైలు.. ఆగి ఉన్న రైలును వెనుక నుంచి ఢీకొట్టింది.
నుజ్జునుజ్జయిన బోగీలు
రైలు వేగంగా ఢీకొట్టడంతో రెండు రైళ్ల బోగీలు నుజునుజ్జు అయ్యాయి. చాలా మంది ప్రయాణికులు బోగీల శిథిలాల మధ్య చిక్కుకుపోయారు. ఈ ఘటనలో ఇప్పటివరకూ 44 మంది మృతిచెందినట్లు అధికారులు తెలిపారు. మరో 180 మంది వరకూ గాయపడ్డారు.
Recommended Video
మృతుల సంఖ్య పెరిగే అవకాశం
మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశముందని అధికారులు చెబుతున్నారు. రైల్వే అధికారులు, సహాయక సిబ్బంది ఘటనాస్థలానికి చేరుకుని సహాయకచర్యలు చేపట్టారు. బోగీల శిథిలాలను తొలగిస్తూ.. ప్రయాణికులను రక్షించే ప్రయత్నం చేస్తున్నారు.
అధ్యక్షుడి విచారం..
శిథిలాలను పూర్తిగా తొలగిస్తేనే మృతుల సంఖ్యపై స్పష్టత వస్తుందని రైల్వే అధికారులు తెలిపారు. ఈ ప్రమాదంతో కైరో నుంచి అలెగ్జాండ్రియా వెళ్తున్న రైలు డ్రైవర్ పోలీసులకు లొంగిపోయాడు. కాగా, ప్రమాదంపై ఈజిప్టు అధ్యక్షుడు ఎల్ సిసి విచారం వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలియజేశారు.