‘ట్రంప్! భారత్కు జీఎస్పీ హోదా ఇవ్వండి లేదంటే అమెరికాకే భారీ నష్టం’
వాషింగ్టన్: అమెరికన్ చట్టసభలకు చెందిన 44మంది ప్రతినిధులు ప్రాధాన్య వాణిజ్య హోదా(జీఎస్పీ)ను భారత్కు పునరుద్ధరించాలని డొనాల్డ్ ట్రంప్ ప్రభుత్వాన్ని కోరారు. ఈ మేరకు మంగళవారం ట్రంప్ ప్రభుత్వంలోని వాణిజ్య ప్రతినిధి రాబర్ట్ లైట్ హైజర్కు లేఖను అందించారు.
భారత్కు జీఎస్పీని పునరుద్ధరించండి..
అమెరికా పరిశ్రమలకు నష్టం కలగకుండా సత్వరమే చర్యలు చేపట్టాలని అందులో పేర్కొన్నారు. ఈ లేఖపై మొత్తం 26మంది డెమోక్రాట్లు, 18మంది రిపబ్లికన్లు సంతకాలు చేశారు. సెప్టెంబర్ 22న హూస్టన్లో జరగనున్న హోడీ-మౌడీ కార్యక్రమంలో పాల్గొనేందుకు ప్రధాని నరేంద్ర మోడీ త్వరలో అమెరికా పర్యటించనున్న నేపథ్యంలో ఈ పరిణామం చోటు చేసుకోవడం ప్రాధాన్యత సంతరించుకుంది. కాగా, గత జూన్లో జీఎస్పీ లబ్ధిదారుల జాబితా నుంచి భారత్ను అమెరికా తొలగించింది.
సుంకాలు పెంచినా..
భారత్కు జీఎస్పీ హోదా తొలగించడం ద్వారా ఆర్థికంగానేగాక, ఉద్యోగాల విషయంలోనూ అమెరికా నష్టపోతోందని 44మంది అమెరికన్ చట్టసభ్యులు వివరించారు. జీఎస్పీ హోదా తొలగింపుతో అధిక సుంకాలు వేసినప్పటికీ జూన్, జులై నెలల్లో భారత్ నుంచి 40శాతం దిగుమతులు పెరిగినట్లు పేర్కొన్నారు. అంతేగాక, ఇవన్నీ గతంలో జీఎస్పీ అర్హత కలిగిన వస్తువులేనని అన్నారు.
అమెరికాకే భారీ నష్టం
చైనాతో వాణిజ్య విభేదాల నేపథ్యంలో భారత్కు కంపెనీలు తరలిపోవడమే దిగుమతుల పెరుగుదలకు కారణమై ఉంటుందని వారు అంచనా వేస్తున్నారు. అంతేగాక, పెరిగిన సుంకాల కారణంగా అమెరికన్ వ్యాపారవేత్తలు ఒక మిలియన్ డాలర్ల మేరకు భారత ఎగుమతిదారులకు బకాయి పడ్డారని వివరించారు. ఇప్పటికి కూడా భారత్కు జీఎస్పీ హోదా ఇవ్వకుండా అమెరికాకే భారీ నష్టం కలగనుందని స్పష్టం చేశారు.