యుద్ధం కావాలా..? భారత్ కు పాకిస్థాన్ సంచలన వార్నింగ్..!
భారత్ కు సరిహద్దు దేశమైన పాకిస్థాన్ తో ఎప్పుడూ ప్రమాదం పొంచి ఉంటూనే ఉంది. దశాబ్దాలుగా భారత్ పై పాకిస్థాన్ దాడులు, కుట్రలు చేస్తూనే ఉంది. గతేడాది ఏప్రిల్ 22న జమ్మూకాశ్మీర్ లో జరిగిన పహల్గామ్ ఉగ్రదాడిలో 26 మంది టూరిస్టులు ప్రాణాలు కోల్పోయిన విషయం తెలిసిందే. ఈ దాడి వెనక ఉన్నది పాకిస్థాన్ అని తేలిన నేపథ్యంలో ఆ దేశంపై భారత్ ఆపరేషన్ సింధూర్ చేపట్టింది. మే 7 నుంచి 10 మధ్య జరిగిన ఈ ఆపరేషన్ సింధూర్ లో భాగంగా పాకిస్థాన్, పాకిస్థాన్ ఆక్రమిత కాశ్మీర్ లో 9 కీలక ఉగ్రవాద స్థావరాలను భారత సైన్యం ధ్వంసం చేసింది. వందలాది మంది ఉగ్రవాదులను హతమార్చింది. దాంతోపాటు దౌత్య పరంగా, ఆర్థిక పరంగా అత్యంత కఠినమైన వ్యూహాత్మక నిర్ణయాలను తీసుకుంది.
అందులో కీలకమైనది.. 1960 నాటి సింధూ నది జలాల ఒప్పందాన్ని తాత్కాలికంగా నిలిపివేయడం ఒకటి. రక్తం, నీరు కలిసి ప్రవహించలేవు అని భారత్ ఆ సందర్భంలో స్పష్టం చేసింది. అయితే తాజాగా ఇదే వివాదంపై కేంద్ర జలశక్తి శాఖ మంత్రి సీఆర్ పాటిల్ షాకింగ్ కామెంట్స్ చేసిన విషయం తెలిసిందే. రాబోయే రోజుల్లో పాకిస్థాన్ కు సింధూ నది వ్యవస్థ నుంచి ఒక్క చుక్క నీరు కూడా వెళ్లకుండా చేస్తామని పేర్కొన్నారు. అయితే ఇదే వ్యవహారంపై తాజాగా పాకిస్థాన్ భారత్ కు మరోసారి వార్నింగ్ ఇచ్చింది. తమకు రావాల్సిన నీటిని భారత్ అడ్డుకోవాలని చూస్తే అది దక్షిణాసియాలో శాంతికి తీవ్ర ముప్పుగా మారుతుందని హెచ్చరించింది. ఈ మేరకు భారత్ పై పాకిస్థాన్ విదేశాంగ ప్రతినిధి తాహిర్ అంధ్రాబీ భారత్ కు హెచ్చరికలు జారీ చేశారు.

లక్షల మందికి జీవనాధారమైన సింధూ నదీ జలాలను భారత్ నిలిపివేయాలని చూడటం తీవ్ర బాధ్యతారహితమైన చర్య.. ఈ నిర్ణయం వల్ల అంతర్జాతీయ శాంతి భద్రతలకు వాటిల్లే ముప్పునకు భారత్ దే బాధ్యత అని పేర్కొన్నారు. ఐక్యరాజ్యసమితి చార్టర్ లోని ఆర్టికల్ 51 ప్రకారం.. పాకిస్థాన్ జీవనానికి అత్యంత అవసరమైన నీటిని ఉద్దేశపూర్వకంగా నిలిపివేస్తే దానిని యుద్ధ చర్యగానే పరిగణిస్తామని ఆయన హెచ్చరించారు. జలవనరులపై పాకిస్థాన్ కు ఉన్న హక్కులు చర్చలకు అతీతమైనవని.. అంతర్జాతీయ చట్టాల ప్రకారం దౌత్య, న్యాయ, ఆర్థిక, రాజకీయ పరంగా తమ హక్కులను కాపాడుకుంటామని స్పష్టం చేశారు. ఈ మేరకు కేంద్ర జలశక్తి శాఖ మంత్రి సీఆర్ పాటిల్ చేసిన వ్యాఖ్యల్ని ఆయన తీవ్రంగా ఖండించారు.












Click it and Unblock the Notifications