ట్రంప్ ఎఫెక్ట్, హఫీజ్ సయీద్ సంస్థలకు డబ్బిస్తే జైలు శిక్ష: పాకిస్తాన్
వాషింగ్టన్/కరాచీ: పాకిస్తాన్ను ఎలా డీల్ చేయాలో తమకు తెలుసునని అమెరికా అధ్యక్షులు డొనాల్డ్ ట్రంప్ అన్నారు. పాక్ను డీల్ చేయడానికి అన్ని రకాల మార్గాలు టేబుల్ పైన సిద్ధంగా ఉన్నాయని చెప్పారు. అమెరికా అధ్యక్ష నివాసం శ్వేతసౌధం వెల్లడించింది.
తాలిబన్లు, హక్కాని నెట్ వర్క్ ఉగ్రవాదులపై తగిన చర్యలు తీసుకోకపోతే ఏం చెయ్యాలో తమకు తెలుసునని హెచ్చరించింది. ఉగ్రవాదులకు పాకిస్తాన్ స్వర్గధామంలో ఉంటోందని ఆరోపిస్తూ ట్రంప్ ఆగ్రహం వ్యక్తం చేస్తోన్న విషయం తెలిసిందే.
పాకిస్తాన్కు దాదాపు 2 బిలియన్ డాలర్ల సహాయాన్ని నిలిపివేసిన అనంతరం మరోసారి అమెరికా.. పాక్కు హెచ్చరికలు జారీ చేసింది.
అమెరికా - పాక్ల మధ్య ఈ పరిస్థితిని పరిష్కరించే విషయమై ఎలాంటి అనుమానం అవసరం లేదని, అందుకు అన్ని మార్గాలు టేబుల్ పైన సిద్ధంగా ఉన్నాయని వైట్ హైస్ అధికారి తెలిపారు. ప్రస్తుతం పాక్పై తీసుకునే చర్యల గురించి కచ్చితమైన వివరాలు వెల్లడించలేమన్నారు. కానీ పరిష్కారం అవుతుందన్నారు.
ఆఫ్గనిస్తాన్ సరిహద్దులో ఉగ్రస్థావరాలపై పాకిస్తాన్ దాడులు జరపాలని అమెరికా కోరుకుంటోందన్నారు. అలాగే ఉగ్రవాదులపై చర్యలు తీసుకోవాలని భావిస్తున్నట్లు తెలిపారు. అలా జరిగితేనే ఇరు దేశాల మధ్య సానుకూల పరిస్థితులు ఏర్పడతాయన్నారు.
అమెరికా హెచ్చరికల నేపథ్యంలో పాకిస్తాన్ హెచ్చరికలు జారీ చేసింది. ముంబై మాస్టర్ మైండ్ హఫీజ్ సయీద్ సంస్థలకు ఎవరైనా డబ్బులు ఇస్తే పదేళ్ల జైలు శిక్ష, భారీ జరిమానా విధించనున్నట్లు హెచ్చరించింది.