బ్యాంకాక్ పేలుళ్ల నిందితుడు ఢిల్లీలో గడిపాడు
బ్యాంకాక్: థాయ్లాండ్లోని బ్యాంకాక్లో బ్రహ్మ ఆలయం బయట గతనెలలో సంభవించిన పేలుళ్లకు బాధ్యుడిగా అనుమానిస్తున్న చైనా వ్యక్తి అబుదుసతేర్ అబుదురెహ్మాన్ అలియాస్ ఇషాన్(27)ఆగస్టులో కొన్ని గంటలపాటు ఢిల్లీలో ఉన్నట్లు వెల్లడైంది.
పేలుళ్లకు ఒక రోజు ముందుగా(ఆగస్టు 16న) థాయిలాండ్ నుంచి బయలుదేరి చైనా వెళ్లి... అక్కడి నుంచి ఇషాన్ బంగ్లాకు వెళ్లినట్లు తెలిసింది.
అదే నెల 30న ఢాకా నుంచి అబుదాబీకి బయలుదేరిన ఇషాన్.. ఢిల్లీలోని ఇందిరాగాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో విమానం మారడం కోసం కొన్ని గంటలు వేచి ఉన్నట్లు అధికారిక వర్గాల సమాచారం.కాగా, బ్రహ్మదేవాలయం వద్ద జరిగిన పేలుళ్లలో 20 మంది మృతి చెందగా, పదుల సంఖ్యలో ప్రజలు గాయాలపాలయ్యారు.
పేలుళ్ల కేసులో ఆరుగురి అరెస్ట్
బ్యాంకాక్ హిందూ దేవాలయంపై జరిగిన బాంబు దాడి కేసులో ఒక పాకిస్థానీయుడు, ముగ్గురు మహిళలు సహా ఆరుగురు వ్యక్తులను మలేషియా, థాయిలాండ్ పోలీసులు అరెస్ట్ చేశారు. ఒక పాకిస్థానీయుడు, ఇద్దరు మలేషియన్లను కొన్ని రోజుల క్రితం అరెస్ట్ చేశామని మలేషియా ఇన్స్పెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ (ఐజీపీ) ఖాలిద్ అబుబాకర్ సోమవారం మీడియాకు చెప్పారు.
ఈ కేసు దర్యాప్తులో థాయిలాండ్కు సహకరిస్తున్నామన్నారు. ఇప్పటికిప్పుడు వారిని థాయిలాండ్ పోలీసులకు అప్పగించేదేమీ లేదని అబుబాకర్ తెలిపారు. మరోవైపు థాయిలాండ్లోని డిన్డైంగ్ జిల్లాలో ముగ్గురు మహిళలను పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు బ్యాంకాక్ మెట్రోపాలిటన్ పోలీస్ బ్యూరో చీఫ్ శ్రీవారా రంగీసిప్రమానకుల్ వెల్లడించారు.