విరుచుకుపడుతున్న ఇజ్రాయెల్- డజన్ల కొద్దీ రాకెట్లతో దాడి
Israel and Hezbollah: మధ్య- తూర్పు ఆసియా దేశాల్లో మరోసారి ఉద్రిక్త పరిస్థితులు తలెత్తాయి. యుద్ధ వాతావరణం నెలకొంది. దాడులు- ప్రతిదాడులు సాగుతున్నాయి. లెబనాన్కు చెందిన మిలిటెంట్ గ్రూప్ హెజ్బొల్లాపై ఇజ్రాయెల్ విరుచుకుపడుతోంది. భారీగా రాకెట్లను సంధిస్తోంది.
మొన్నటివరకు దాడులతో అట్టుడికిందీ ప్రాంతం. దాదాపు 14 నెలలుగా మధ్య- తూర్పు దేశాలు అగ్నిగుండంగా మారుతూ వచ్చింది. ఇజ్రాయెల్, గాజా, లెబనాన్ రోజూ పరస్పర దాడులకు దిగేవి. గాజాలో హమాస్, లెబనాన్లో హెజ్బొల్లా మిలిటెంట్ గ్రూపులను లక్ష్యంగా చేసుకుని ఇజ్రాయెల్ మిస్సైళ్లు, రాకెట్లను సంధిస్తూ వచ్చింది.

ఈ దాడుల్లో ఈ రెండు గ్రూప్లకు చెందిన అధినేతలు, కమాండర్లు హతం అయ్యారు. హసన్ నస్రల్లా, యాహ్యా సిన్వర్, ఇస్మాయిల్ హనియె, సమీ తాలెబ్ అబ్దల్లా, ఫతా షరీఫ్, మర్వాన్ ఇసా, ఇబ్రహిం వకీల్, అహ్మద్ వహ్బీ.. వంటి సీనియర్లు దుర్మరణం పాలయ్యారు.
రోజురోజుకూ భీకర యుద్ధం కొనసాగుతున్న నేపథ్యంలో ఐక్యరాజ్య సమితి జోక్యం చేసుకుంది. కాల్పుల విరమణ ఒప్పందాలను ప్రకటించింది. ఐరాస భద్రతా మండలి 1701 తీర్మానాన్ని ఆమోదించింది. దీనిపై ఇజ్రాయెల్, లెబనాన్తో శాంతి కుదిర్చే బాధ్యతను అమెరికా, ఫ్రాన్స్ తీసుకున్నాయి.
శాంతియుత వాతావరణం నెలకొనడానికి మధ్యవర్తిత్వం వహించాయి. ఈ ఒప్పందాలపై ఇజ్రాయెల్, లెబనాన్ దేశాల ప్రతినిధులతో శాంతిచర్చలు జరిపాయి. రెండు వారాలుగా కొనసాగుతూ వస్తోన్న ఈ శాంతి చర్చలు కొలిక్కి వచ్చాయి. కాల్పుల విరమణకు అంగీకరించాయి. ఈ మేరకు కిందటి నెల 27వ తేదీన కాల్పుల విరమణను ప్రకటించాయి కూడా.

సరిగ్గా వారం రోజులు కూడా గడవకముందే ఈ కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘించింది ఇజ్రాయెల్. లెబనాన్పై రాకెట్లను సంధించింది. హెజ్బొల్లా స్థావరాలపై డజన్ల కొద్దీ లాంచర్లను ప్రయోగించింది. ప్రత్యేకించి- లెబనాన్ దక్షిణ ప్రాంతంలోని బెర్ఘౌస్పై భీకర దాడులు చేసింది.
ఈ విషయాన్ని ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్స్ నిర్ధారించింది. తమ భూభాగంపై గల మౌండ్ డోవ్పై హెజ్బొల్లా రెండు రాకెట్లను సంధించిందని, దీనికి ప్రతిగా తాము దాడులకు దిగాల్సి వచ్చిందని, కాల్పుల విరమణ ఒప్పందానికి తూట్లు పొడించిందని వివరించింది. ఇప్పటికీ కాల్పుల విరమణకు తాము కట్టుబడి ఉన్నామని పేర్కొంది.












Click it and Unblock the Notifications