జాతి వివక్ష, మానవ హక్కుల ఉల్లంఘన: విద్యార్థుల యూఎస్ వీసాల రద్దుపై చైనా అక్రోశం
బీజింగ్: అమెరికా తాజాగా తీసుకున్న చర్యలపై చైనా తీవ్రంగా స్పందించింది. చైనాకు చెందిన సుమారు వెయ్యి మందికిపైగా విద్యార్థులు, పరిశోధకుల వీసాలను అమెరికా రద్దు చేసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో చైనా విద్యార్థుల వీసాలను రద్దు చేయడం రాజకీయ కక్షతోపాటు జాతి వివక్ష చూపించడమేనని ఆరోపించింది.
వివిధ కారణాలతో చైనా విద్యార్థులపై చర్యలు తీసుకుంటూ.. అమెరికాలో వారిని అణచివేతకు గురిచేయడాన్ని వెంటనే ఆపాలని చైనా విదేశాంగ అధికార ప్రతినిధి ఝావో లిజియాన్ స్పష్టం చేశారు. ఈ చర్యలు చైనా విద్యార్థుల మానవ హక్కులను కాలరాయడమేనని వ్యాఖ్యానించారు.

గూఢచర్యం చేస్తున్నారంటూ వీసాలు రద్దు చేసిన అమెరికా
కాగా, తమ దేశానికి సంబంధించిన కీలక సమాచారాన్ని చైనా మిలటరీకి చేరవేస్తున్నారంటూ సుమారు వెయ్యి మందికిపైగా విద్యార్థుల వీసాలను రద్దు చేసింది. చైనా నుంచి అమెరికాకు వస్తోన్న విద్యార్థులు, పరిశోధకులకు చైనా మిలటరీతో సంబంధాలు కలిగి ఉండి, అమెరికాకు సంబంధించిన సున్నితమైన సమాచారాన్ని డ్రాగన్ ఆర్మీకి చేరవేస్తున్నారనే అనుమానంతో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నట్లు అమెరికా డిపార్ట్మెంట్ ఆఫ్ హోంల్యాండ్ సెక్యూరిటీ చీఫ్ చాడ్ వోల్ఫ్ స్పష్టం చేశారు.
చట్టవ్యతిరేక వ్యాపార పద్ధతులు, గూఢచర్యం పేరుతో అమెరికా మేధో సంపత్తితోపాటు కరోనా పరిశోధనా సమాచారాన్ని తస్కరించేందుకు విద్యార్థి వీసాలను చైనా దుర్వినియోగం చేస్తోందని వాల్ఫ్ ఆరోపించారు. అయితే, ఇలాంటి ప్రమాదం పొంచివున్న విద్యార్థుల సంఖ్య తక్కువేనని, ఇక్కడి చట్టాలకు లోబడి వచ్చే వచ్చే విద్యార్థులు, పరిశోధకులకు అమెరికా ఎప్పుడూ ఆహ్వానం పలుకుతుందని తెలిపారు. కాగా, అమెరికాలో దాదాపు 3.60 లక్షల మంది చైనీయులు విద్యనభ్యసిస్తున్నట్లు గణాంకాలు వెల్లడిస్తున్నాయి.
హాంగ్కాంగ్లో చైనా ఆగడాలను అరికట్టే చర్యల్లో భాగంగా ఇటీవల అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వెలువరించిన ప్రకటన కింద ఈ వీసా రద్దు చర్యలు తీసుకుంటున్నట్లు అమెరికా విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి స్పష్టం చేశారు.
అంతేగాక, వెట్టిచాకిరీతో ఉత్పత్తి చేసిన వస్తువులను ఇకపై తమ దేశ మార్కెట్లోకి రాకుండా అడ్డుకుంటామంటూ.. జిన్జియాంగ్లోని ఉగర్ ముస్లిం పట్ల చైనా అనుసరిస్తున్న వైఖరిని ఈ సందర్భంగా ప్రస్తావించారు.












Click it and Unblock the Notifications