చైనా పక్కలో బల్లెం: అందుకే తాలిబన్లకు ఫండింగ్: ఏం జరుగుతుందో వేచి చూద్దాం: జో బైడెన్
వాషింగ్టన్: కరడు గట్టిన మత ఛాందసవాదులుగా ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు పొందిన తాలిబన్ల చేతిలో దురాక్రమణకు గురైన అప్ఘనిస్తాన్లో కొత్త ప్రభుత్వం ఏర్పాటు కానుంది. దీనికి సంబంధించిన పదవుల పంపకాలు కూడా పూర్తయ్యాయి. ఈ నెల 11వ తేదీన ఆప్ఘనిస్తాన్లో తాలిబన్ల ప్రభుత్వం ఏర్పాటు కానుంది. అమెరికా తన సైనిక బలగాలను పూర్తిగా ఉపసంహరించుకున్న అతి కొద్దిరోజుల్లోనే ఈ కీలక పరిణామం చోటు చేసుకుంది. తాలిబాన్లు తమ తాత్కాలిక కేబినెట్ను ప్రకటించారు.
Recommended Video
ప్రధానిగా..
తాలిబాన్ల అధికార ప్రతినిధి జబియుల్లా ముజాహిద్ మంత్రివర్గ వివరాలను వెల్లడించారు. కొత్త ప్రభుత్వంలో ముజాహిద్కు సమాచార మంత్రి పోర్ట్ఫోలియో దక్కింది. ముల్లా మహమ్మద్ హసన్ అఖుంద్ ఆఫ్ఘనిస్తాన్ ప్రధానిగా నియమితులయ్యారు. ముల్లా అబ్దుల్ ఘనీ బరాదర్ ఉప ప్రధానిగా, సిరాజుద్దీన్ హక్కానీ కుడిభుజం.. హక్కాని నెట్వర్క్ చెందిన అబ్దుల్ సలామ్ హనీఫ్ మరో ఉప ప్రధానిగా నామినేట్ అయ్యారు. మరో 30 మందితో కూడిన కేబినెట్ మంత్రులు, సహాయ మంత్రులు, ఇంటెలిజెన్స్, సెంట్రల్ బ్యాంక్ చీఫ్ల జాబితాను విడుదల చేశారు.
కొత్త ప్రభుత్వంపై స్పందించిన బైడెన్
ఆఫ్ఘనిస్తాన్లో పదవుల పంపకాలు పూర్తయిన కొన్ని గంటలకే అగ్రరాజ్యం అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ స్పందించారు. తాలిబన్లతోనే చైనాకు అసలు సమస్య పొంచివుందని ఆయన వ్యాఖ్యానించారు. తాలిబన్లు ఎప్పటికైనా చైనాకు పక్కలో బల్లెంలా మారుతారని ఆయన చెప్పారు. ఈ కారణంతోనే తాలిబన్లతో చైనా కొన్ని లోపాయకారి ఒప్పందాలను కుదర్చుకోవడానికి చైనా ఖచ్చితంగా ప్రయత్నాలు సాగిస్తుందని అన్నారు. సాకిస్తాన్, రష్యా, ఇరాన్ తరహాలోనే చైనా కూడా కొన్ని అరెంజ్మెంట్స్ చేసుకుంటుందని తేల్చి చెప్పారు.
తాలిబన్లతో చైనా భేటీ..
కొద్దిరోజుల కిందటే చైనా విదేశాంగ శాఖ మంత్రి వాంగ్ యీ.. కాబుల్లో తాలిబన్ పొలిటికల్ కమిషన్ అధినేత ముల్లా అబ్దుల్ బరాదర్తో సమావేశమైన విషయాన్ని జో బైడెన్ పరోక్షంగా ప్రస్తావించారు. ఆ ఇద్దరు నేతలు సమావేశం కావడాన్ని తాలిబన్లు-చైనా మధ్య ఉన్న సత్సంబంధాలను బహిర్గం చేస్తోందని చెప్పారు. రాజధాని కాబుల్ను ఆక్రమించుకోవడానికి ముందే- చైనా ఆఫ్ఘనిస్తాన్లో తాలిబన్ల ప్రభుత్వం ఏర్పాటవుతుందనే నిర్ణయానికి వచ్చిందని, అప్పటి నుంచే వారితో సానుకూలంగా వ్యవహరిస్తోందని ఇదివరకే జో బైడెన్ వ్యఖ్యానించిన విషయం తెలిసిందే.
ఏం జరుగుతుందో వేచి చూద్దాం
చైనా ఒక్కటే కాకుండా.. పాకిస్తాన్, రష్యా, ఇరాన్ వంటి కొన్ని ఇతర దేశాలు కూడా తాలిబన్లతో సత్సంబంధాలను పెట్టుకోవడానికి ప్రయత్నిస్తోన్నాయని జో బైడెన్ స్పష్టం చేశారు. ఏం జరుగుతుందనేది ఇప్పుడే తెలియదని, వేచి చూద్దామని అన్నారు. ఏం జరిగినా.. ఏది జరిగినా.. అది ఆసక్తికరంగా ఉంటుందని వ్యాఖ్యానించారు. తాలిబన్ల మంత్రిత్వ శాఖలను ప్రకటించిన కొన్ని గంటల వ్యవధిలోనే జో బైడెన్ కీలక వ్యాఖ్యలు చేయడం ప్రాధాన్యతను సంతరించుకుంది.
నిక్కీ హేలీ ఆన్లైన్ పిటీషన్..
మరో అమెరికాకు చెందిన ఐక్యరాజ్య సమితి మాజీ రాయబారి నిక్కీ హేలీ.. ఓ ఆన్లైన్ పిటీషన్ను ప్రారంభించారు. తాలిబన్ల ప్రభుత్వాన్ని గుర్తించకూడదనే సారాంశంతో కూడిన ఆన్లైన్ పిటీషన్ అది. దాని ద్వారా పెద్ద ఎత్తున సంతకాలను సేకరించే కార్యక్రమాన్ని ఆమె చేపట్టారు. ఎట్టి పరిస్థితుల్లోనూ అమెరికా.. ఆఫ్ఘనిస్తాన్లో తాలిబన్ల సారథ్యంలో ఏర్పాటు కాబోతోన్న కొత్త ప్రభుత్వాన్ని గుర్తించకూడదని ఆమె డిమాండ్ చేస్తోన్నారు. ఆఫ్ఘనిస్తాన్ కొత్త మంత్రి అమెరికా దర్యాప్తు సంస్థ ఎఫ్బీఐ లిస్ట్లో మోస్ట్ వాంటెడ్ టెర్రరిస్ట్గా ఉన్నాడని అన్నారు.
బగ్రామ్ ఎయిర్బేస్..
ఆప్ఘనిస్తాన్లోని బగ్రామ్ ఎయిర్బే్స్పై చైనా కన్నేసిందంటూ వార్తలు రావడం కలకలం రేపింది. ఆ ఎయిర్బేస్తో పాటు సంబంధిత ప్రదేశాన్ని తాలిబన్లు చైనాకు అప్పగించడానికి అంగీకరించారనే అనుమానాలు వ్యక్తమౌతోన్నాయి. ప్రభుత్వ ఏర్పాటుకు ముందే చైనా.. ఆప్ఘనిస్తాన్లో పాగా వేస్తోందంటూ వార్తలొచ్చాయి. వాటిని చైనా విదేశాంగ ప్రతినిధి వాంగ్ వెంబిన్ తోసిపుచ్చారు. నిరాధారమైన కథనాలుగా పేర్కొన్నారు. అందులో ఎలాంటి వాస్తవం లేదని స్పష్టం చేశారు.