భారత్ పాక్లపై చైనా వైఖరేంటి..? ఇస్లామాబాదుకు ఆ మంత్రి ఎందుకెళ్లారు..?
బీజింగ్ : భారత్ పాకిస్తాన్ల మధ్య నెలకొన్న యుద్ధ వాతావరణం నేపథ్యంలో చైనా మధ్యవర్తిత్వం చేసేందుకు ముందుకొస్తోందా..? కొద్ది రోజుల క్రితం రెండు దేశాల మధ్య శాంతి నెలకొనాలని ఆకాంక్షించిన చైనా అందుకు ముందడుగు వేసిందా..? ఇందులో భాగంగానే పాకిస్తాన్లో పరిస్థితిని సమీక్షించేందుకు డ్రాగన్ కంట్రీ తమ విదేశాంగా డిప్యూటీ మంత్రిని అక్కడకు పంపిందా...?

ఇస్లామాబాదుకు చైనా మంత్రి కాంగ్ క్సువాన్యూ
పుల్వామా ఉగ్ర దాడులు ఆ తర్వాత భారత్ ప్రతీకార చర్య ఆపై భారత మిలటరీ స్థావరాలపై దాడులు చేసేందుకు పాకిస్తాన్ యత్నం... దీంతో భారత్ పాకిస్తాన్ల మధ్య యుద్ధ వాతావరణం ఆందోళనకర పరిస్థితులు తలెత్తిన నేపథ్యంలో దాయాది దేశం చైనా రంగంలోకి దిగింది. కొద్ది రోజుల క్రితం దక్షిణాసియాలో భారత్ పాకిస్తాన్ రెండు దేశాలు అతి ముఖ్యమైనవని పేర్కొన్న చైనా రెండు దేశాల మధ్య శాంతి నెలకొనాలని ఆకాంక్షించింది. అదే సమయంలో రెండు దేశాల మధ్య శాంతి చర్చల కోసం మధ్యవర్తిత్వం వహించేందుకు కూడా సిద్ధమని వెల్లడించింది. ఈ క్రమంలోనే బుధవారం చైనా ప్రభుత్వం తమ విదేశాంగా డిప్యూటీ మంత్రి కాంగ్ క్సువాన్యూను ఇస్లామాబాదుకు పంపింది. భారత్ పాక్ల మధ్య సంబంధాలకోసం చైనా ఇలా ఒక మంత్రిని చర్చల కోసం పంపడం చాలా అరుదైన ఘటనగా అంతర్జాతీయ విశ్లేషకులు భావిస్తున్నారు.

భారత్ పాక్ మధ్య శాంతిని కోరుకుంటున్న చైనా
పుల్వామాలో ఫిబ్రవరి 14న జైషే ఉగ్రవాద సంస్థ జరిపిన ఆత్మాహుతి దాడిలో 40 మంది భారత జవాన్లు అమరులయ్యారు. ఈ దాడి తామే చేసినట్లుగా జైషే మొహ్మద్ ఉగ్రవాద సంస్థ ప్రకటించింది. ఆ తర్వాత ఫిబ్రవరి 26న భారత వైమానిక దళం పాకిస్తాన్లోని బాలాకోట్లో ఉన్న ఉగ్రవాద శిబిరాలపై మెరుపుదాడి చేసింది. ఫిబ్రవరి 27న పాకిస్తాన్ యుద్ధ విమానాలు భారతగగనతలంలోకి వచ్చి మిలటరీ స్థావరాలపై దాడికి యత్నించగా.. భారత బలగాలు తిప్పికొట్టాయి. ఈ క్రమంలోనే వింగ్ కమాండర్ అభినందన్ కమాండింగ్ చేస్తున్న మిగ్ 21 యుద్ధ విమానంను పాక్ క్షిపణి ఢీకొట్టడంతో మిగ్ -21 కూలిపోయింది. అభినందన్ పాక్ ఆర్మీకి బంధీగా పట్టుబడ్డాడు.

భారత్ పాకిస్తాన్లతో టచ్లో ఉన్నామన్న డ్రాగన్ కంట్రీ
ఈ క్రమంలోనే ఇండియా పాకిస్తాన్ల మధ్య నెలకొన్న ఉద్రిక్తత పరిస్థితులను సమీక్షించి అక్కడి పరిస్థితులను, పాకిస్తాన్ ప్రభుత్వం ఆలోచనను భారత్కు వివరించేందుకు చైనా ఉపక్రమించింది. ఈ చర్చల ద్వారా రెండు దేశాల మధ్య శాంతినెలకొల్పేందుకు ప్రయత్నిస్తామని విదేశాంగా ప్రతినిధి లూకాంగ్ చెప్పారు. అయితే మధ్యవర్తిత్వంలో భాగంగా భారత్కు కూడా డిప్యూటీ మంత్రి వెళతారా అన్న ప్రశ్నకు భారత్తో కూడా చైనా టచ్లో ఉందని లూకాంగ్ చెప్పారు. ఇదిలా చెబుతూనే ఉగ్రవాదాన్ని అణిచివేసేందుకు పాకిస్తాన్ చర్యలు ప్రారంభించిందని వెల్లడించారు. ఉగ్రవాదాన్ని తరిమికొట్టేందుకు పాక్ కొన్ని విధానాలను రూపొందించిందని ఇది అందరం స్వాగతించాలని లూకాంగ్ చెప్పారు.
దక్షిణాసియాలో భారత్ పాకిస్తాన్లు రెండు ప్రాధాన్యత కలిగిన దేశాలని లూకాంగ్ పునరుద్ఘాటించారు. ఇక ఇతర దేశాల సరిహద్దులు, సమగ్రతను దాయాది దేశాలు గౌరవించాల్సిన అవసరం ఉందని చైనా విదేశాంగా మంత్రి వాంగ్ యీ పాకిస్తాన్ విదేశాంగా మంత్రి షా మహ్మూద్ ఖురేషీతో అన్నారు. అంతేకాదు అంతర్జాతీయ సంబంధాలు దెబ్బతినేలా వ్యవహరించడం సరైన పద్ధతి కాదని చైనా మంత్రి చెప్పారు.












Click it and Unblock the Notifications