కరోనా ప్రకంపనలు: జర్మనీలో ఆర్థిక మంత్రి ఆత్మహత్య
బెర్లిన్: కరోనావైరస్ ప్రపంచ దేశాలను వణికిస్తున్న విషయం తెలిసిందే. ఇప్పటికే 30వేల మంది ప్రాణాలను తీసింది. కాగా, కరోనావైరస్ వల్ల భవిష్యత్లో సంభవించబోయే ఆర్థిక సంక్షోభాన్ని ఎలా ఎదుర్కోవాలోనన్న ఆందోళనలతో జర్మనీలోని హెస్సీ రాష్ట్ర ఆర్థిక మంత్రి థామస్ షాఫెర్(54) ఆత్మహత్యకు పాల్పడ్డారు.
ఈ విషయాన్ని ఆ రాష్ట్ర మినిస్టర్ ప్రెసిడెంట్ వోల్కర్ బౌఫియర్ వెల్లడించారు. రైల్వే ట్రాక్ సమీపంలో శనివారం థామస్ మృతదేహం గుర్తించారు. ఆయన ఆత్మహత్య చేసుకున్నట్లు అధికారికంగా ధృవీకరించారు.

వోల్కర్ మాట్లాడుతూ.. థామస్ ఆత్మహత్య తమను దిగ్భ్రాంతికి గురిచేసిందన్నారు. ఇది చాలా బాధాకరమైన విషయమన్నారు. హెస్సీ ఆర్థిక మంత్రిగా థామస్ 10ఏళ్లు పనిచేస్తున్నారని తెలిపారు. కరోనా మహమ్మారి ధాటికి ఏర్పడిన ఆర్థిక పరిస్థితులను ఎదుర్కోవడానికి.. కంపెనీలు, కార్మికులకు అండగా నిలవడానికి ఆయన తీవ్రంగా శ్రమించారని తెలిపారు. ఈ కష్ట సమయంలో ఆయన తమకు దూరం కావడం తీరని లోటని అన్నారు.
ఇక ప్రపంచ వ్యాప్తంగా కూడా కరోనా మరణాల సంఖ్య భారీగానే పెరుగుతోంది. 31,737 మరణాలు సంభవించగా.. 6,77,683 మంది కరోనా బారిన పడి ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు. 1,46,310 మంది కరోనావైరస్ బారినపడి కోలుకున్నారు. ఇక భారతదేశంలో ఇప్పటి వరకు సుమారు 980కిపైగా కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. 27 మంది ప్రాణాలు కోల్పోయారు.












Click it and Unblock the Notifications