కరోనా వైరస్ : కుట్ర కోణాలపై సంచలనాత్మక కథనాలు.. బయోలాజికల్ వెపన్గా వైరస్?
కరోనా వైరస్.. ప్రస్తుతం ప్రపంచాన్ని వణికిస్తోన్న ప్రాణాంతక వైరస్. చైనాలోని వుహాన్ అనే పట్టణంలోని సముద్రపు ఆహార మార్కెట్ నుంచి ఈ వైరస్ వ్యాప్తి చెందినట్టుగా అనుమానిస్తున్నారు. అదే సమయంలో గబ్బిలం వంటి పక్షి నుంచి ఈ వైరస్ వ్యాప్తి చెందిందన్న కథనాలు కూడా ప్రచారంలో ఉన్నాయి. ఈ నేపథ్యంలో కరోనా వైరస్ సహజంగానే పుట్టుకొచ్చిందా.. లేక చైనానే బయో వెపన్(జీవాయుధం)గా దీన్ని తయారుచేసిందా..? అన్న అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నాయి. వాషింగ్టన్ టైమ్స్ దీనిపై సంచలనాత్మక కథనాన్ని ప్రచురించింది. అలాగే ఫేస్బుక్,వాట్సాప్ ఇతరత్రా సోషల్ మీడియాలోనూ కరోనాపై అనేక రకాల కథనాలు ప్రచారంలో ఉన్నాయి.
Recommended Video

ల్యాబ్ నుంచి లీకైన వైరస్..?
ఇజ్రాయెల్కు చెందిన ఓ ఇంటలిజెన్స్ అధికారి కరోనా వైరస్పై చేసిన వ్యాఖ్యలను వాషింగ్టన్ టైమ్స్ ప్రచురించింది. కరోనా వైరస్ ఓ బయోలాజికల్ వెపన్ అని ఆయన అభిప్రాయపడ్డారు. వుహాన్ పుట్టణంలోని 'వుహాన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ వైరాలజీ' అనే ల్యాబ్ నుంచి ఆ వైరస్ లీక్ అయినట్టు ఆయన చెప్పారు. ఆ ల్యాబ్లో చైనా చాలాకాలంగా సీక్రెట్ బయోలాజికల్ వెపన్ను తయారుచేస్తున్నట్టుగా తెలిపారు. చైనా మిలటరీ కోసమే దీన్ని తయారుచేస్తున్నట్టు పేర్కొన్నారు. కరోనా వైరస్ పుట్టుకొచ్చిన ప్రదేశంగా భావిస్తున్న వుహాన్లోని సీ ఫుడ్ మార్కెట్కు ఈ వైరాలజీ ల్యాబ్ 25-30కి.మీ దూరంలోనే ఉండటం కూడా అనుమానాలకు తావిస్తోంది. అయితే ఇప్పటివరకు ఏ ఆరోగ్య సంస్థ దీన్ని ధ్రువీకరించలేదు.

ప్రచారంలో మరో కథనం..
కరోనా వ్యాప్తిపై సోషల్ మీడియాలో మరో ఆసక్తికర కథనం కూడా ప్రచారంలో ఉంది. దాని ప్రకారం.. చైనాకు చెందిన ఓ సైంటిస్ట్ జంట కెనడాలోని విన్నిపెగ్లోని మైక్రోబయాలజీ ల్యాబ్లో చాలాకాలంగా పరిశోధనలు జరుపుతోంది. అయితే గతేడాది నిబంధనల ఉల్లంఘన కారణంగా ఆ జంటతో పాటు వారి స్టూడెంట్స్ను అక్కడి నుంచి పంపించేశారు. దీంతో ఆ సైంటిస్ట్ జంట అక్కడి ల్యాబ్లో వారు తయారుచేస్తున్న కరోనా వైరస్ను చైనాలోని వుహాన్ పట్టణంలో ఉన్న ల్యాబ్కి పంపించారని చెబుతున్నారు. అయితే వుహాన్ వైరాలజీ ల్యాబ్లో పనిచేస్తున్న సైంటిస్టులకు ఆ వైరస్ను ఎలా డీల్ చేయాలో తెలియకపోవడంతో.. అది బయటకు లీకైందని అంటున్నారు.

ఫార్మా కుట్ర దాగుందా..?
కరోనా వైరస్ వ్యాప్తి వెనుక ఫార్మా కుట్ర కూడా దాగుందనే ప్రచారం జరుగుతోంది. 2015లో కరోనా వైరస్ ట్రీట్మెంట్కు సంబంధించి శ్యాసకోశ సమస్యలను నివారించేందుకు ఇంగ్లాండ్లోని పిర్బ్రైట్ ఇనిస్టిట్యూట్లో పేటెంట్ దాఖలు చేయబడిందని చెబుతున్నారు. తదనుగుణంగానే ఇప్పుడు కరోనా వైరస్ వ్యాప్తి చెందేలా చేసి.. తద్వారా లబ్ది పొందేందుకు ఫార్మా కంపెనీలు కుట్ర చేశాయన్న వాదనలు కూడా వినిపిస్తున్నాయి.

నర్సు బయటపెట్టిన సంచలన విషయాలు..
చైనాలో కరోనా వైరస్ కారణంగా ఇప్పటివరకు 132 మంది చనిపోయినట్టు అధికారిక డేటా చెబుతోంది. అలాగే 5974 మందికి కరోనా సోకినట్టు,మరో 9329 అనుమానిత కేసులు నమోదైనట్టు చైనా వర్గాలు చెబుతున్నాయి. కానీ వాస్తవం మాత్రం మరోలా ఉందని వుహాన్కి చెందిన ఓ నర్సు సోషల్ మీడియా ద్వారా వెల్లడించారు. చైనాలో ఇప్పటివరకు దాదాపుగా 90వేల మందికి కరోనా వైరస్ సోకినట్టుగా ఆమె తెలిపారు. కరోనా వైరస్ సోకిన వ్యక్తిని తక్షణం ప్రత్యేక ప్రదేశానికి తరలించి చికిత్స అందించాలని, లేదంటే ఒక్కో పేషెంట్ ద్వారా అది 14మందికి వ్యాప్తి చెందుతుందని వెల్లడించారు.
హెచ్చరించిన చైనీస్ నర్సు..
ప్రస్తుతం చైనాలో చైనీస్ న్యూ ఇయర్ వేడుకలు జరుపుకుంటున్నారని.. ఏడాదికి ఒకసారి జరుపుకునే ఈ వేడుకల కోసం చాలామంది చైనీయులు తమ సొంత పట్టణాలకు వెళ్తుంటారని సదరు నర్సు తెలిపారు. అయితే కరోనా కారణంగా ఈసారి చైనీయులు తమ ప్రయాణాలను వాయిదా వేసుకుంటే మంచిదని సూచించారు. ఆరోగ్యంగా ఉంటే వచ్చే ఏడాదైనా తమవాళ్లతో కలిసి చైనీస్ న్యూ ఇయర్ వేడుకలు జరుపుకోవచ్చన్నారు. అలాగే బయటి ఫుడ్ ఎట్టి పరిస్థితుల్లోనూ తీసుకోవద్దని హెచ్చరించారు. ప్రభుత్వం చెబుతున్న లెక్కలతో సంబంధం లేకుండా సోషల్ మీడియా ద్వారా వాస్తవాలను తాము చేరవేస్తామన్నారు. ప్రస్తుతం మనమంతా మృత్యువు ముందు నిలుచుని ఉన్నామని హెచ్చరించారు.












Click it and Unblock the Notifications