కరోనావైరస్: కొవిడ్ 19ను ‘మహమ్మారి’గా డిక్లేర్ చేసిన డబ్ల్యూహెచ్ఓ
జెనీవా: కరోనావైరస్(కొవిడ్-19) బారినపడి ప్రపంచం వ్యాప్తంగా వేలాది మంది ప్రాణాలు కోల్పోయిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో మానవాళికి పెనుసవాులగా మారిన కరోనావైరస్ వ్యాప్తిని ప్రపంచ ఆరోగ్య సంస్థ(డబ్ల్యూహెచ్ఓ) 'మహమ్మారి'గా గుర్తించింది. రోజు రోజుకు అనేక దేశాలకు విస్తరిస్తుండటంతో ప్రపంచ ఆరోగ్య సంస్థ డైరెక్టర్ జనరల్ టెడ్రోస్ అథనామ్ కరోనాను బుధవారం మహమ్మారిగా ప్రకటించారు.
Recommended Video
ఈ మహమ్మారిని తేలికగా తీసుకోవద్దని, ఒకవేళ అలసత్వం వహిస్తే తీవ్ర నష్టం కలిగిస్తుందని.. అనేక మరణాలకు కారణమవుతుందని ఆయన హెచ్చరించారు. దీనిపై మనమంతా అనధికారికంగా పోరాటాన్ని ముగించినట్లే అవుతుందని టెడ్రోస్ తెలిపారు. ఈ మహమ్మారి విషయంలో ప్రపంచ ఆరోగ్య సంస్థ దృక్పథం మారదని స్పష్టం చేశారు.
కాగా, కరోనావైరస్ బారిన పడి ప్రపంచ వ్యాప్తంగా ఇప్పటికే 4,300 మంది ప్రాణాలు కోల్పోయారు. లక్షా50వేల మందికిపైగా కరోనా బాధితులు ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు. చైనాలో ఇప్పుడిప్పుడే తగ్గుముఖం పడుతుండగా.. ఇతర దేశాల్లో ఈ వైరస్ ప్రభావం ఎక్కువవుతోంది. ఇటలీ, ఇరాన్, అమెరికా లాంటి దేశాల్లో కరోనా బాధితుల సంఖ్య రోజు రోజుకు పెరిగిపోతోంది.
ప్రస్తుతం ఇటలీలో అత్యవసర పరిస్థితులు నెలకొన్నాయి. అవసరమైతే తప్ప ప్రజలు బయటికి రావొద్దని అక్కడ ప్రభుత్వం హెచ్చరికలు జారీ చేసింది. అమెరికాలోనూ మరణాల సంఖ్య పెరిగిపోతోంది. 31 మంది ప్రాణాలు కోల్పోగా.. 1015 మంది కరోనా బాధితులు ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు.
ఇక మనదేశంలోనూ 62 కరోనా కేసులు నమోదు కావడం గమనార్హం. కర్ణాటకలో కరోనా అనుమానిత లక్షణాలతో ఓ వ్యక్తి మృతి చెందాడు. కరోనావైరస్ వ్యాపిస్తున్న నేపథ్యంలో ఏప్రిల్ 15 వరకు వీసాలను రద్దు చేస్తూ భారత ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.