పాకిస్తాన్ కూటమికి భారత్ ఝలక్..! ఈజిప్ట్ నిర్ణయం వెనుక ?
భారత్-ఇజ్రాయెల్ సంబంధాలు బలపడుతుండటం, ఇజ్రాయెల్-ఇరాన్ మధ్య వైరం పెరుగుతుండటం వంటి కారణాలతో ప్రాంతీయ భద్రతకు ముప్పు పేరుతో పాకిస్తాన్-సౌదీ అరేబియా-టర్కీ ఈ మధ్య మక్కా రక్షణ ఒప్పందం (Mecca Defence Pact)
చేసుకున్నాయి. దీని ప్రకారం ఈ మూడు దేశాలపై ఏ దేశం దాడి చేసినా, అది మూడు దేశాలపై జరిగిన దాడిగానే భావించి ప్రతీకార దాడులకు దిగుతాయి. ఈ కూటమిలో తొలుత పాకిస్తాన్-సౌదీ అరేబియా మాత్రమే ఉండగా.. ఆ తర్వాత నాటో దేశమైన టర్కీ చేరింది. ఆ తర్వాత ఈజిప్ట్ (EGYPT) చేరుతుందని భావించినా అలా జరగలేదు. అయినా ఈ కూటమిని ట్రంప్ స్వాగతిస్తున్నారు.
ఈ నేపథ్యంలో భారత్ కు (India) భవిష్యత్తులో ప్రమాదకరంగా మారబోతున్న ఈ కూటమిలోకి ఈజిప్ట్ చేరకుండా దూరంగా ఉండిపోవడం వెనుక పలు కీలక కారణాలు ఉన్నాయి. వాటిలో భారత్ కూడా ఒకటి. ఆఫ్రికాలోనే అత్యంత శక్తివంతమైన సైన్యాన్ని కలిగిన ఈజిప్ట్, ఖతార్, కువైట్, జోర్డాన్, అజర్బైజాన్, సిరియాలతో పాటు ఈ కూటమిలో చేరే అవకాశాలు కనిపించాయి. అయితే సౌదీ అరేబియా నుండి ఈ కూటమిలో ఈజిప్ట్ చేరికపై వ్యతిరేకత వచ్చింది. దీనికి కారణం భారతదేశం వంటి దేశాలతో తమ సంబంధాలను దెబ్బతీసుకోవడానికి ఈజిప్ట్ సుముఖంగా లేకపోవడం వంటి కారణాల వల్ల, ప్రస్తుతానికి ఈ ఇస్లామిక్ నాటో కూటమిలో ఈజిప్ట్ సభ్యదేశంగా చేరలేదు.

వాస్తవానికి ఈజిప్ట్ తో భారత్ కు సత్సంబంధాలు ఉన్నాయి. 1956లో బ్రిటిష్-ఫ్రెంచ్ దళాలు సూయజ్ కాలువ వైపు దూసుకుపోతున్నప్పుడు, ఇజ్రాయెల్ సాయుధ దళాలు సినాయ్ మీదుగా ప్రయాణిస్తున్నప్పుడు, ఆంగ్లో-ఫ్రెంచ్-ఇజ్రాయెల్ సైనిక చర్యను భారత్ ఖండించింది. సూయజ్ కాలువపై ఈజిప్ట్ హక్కుకు మద్దతుగా నిలిచింది. ఆ తర్వాత 1961లో భారత దళాలు అప్పటి పోర్చుగీసు కాలనీ అయిన గోవాను విముక్తి చేయడానికి కవాతు చేస్తున్నప్పుడు సూయజ్ కాలువ గుండా పోర్చుగీస్ అదనపు బలగాలు వెళ్లకుండా ఈజిప్ట్ అడ్డుకుంది. తద్వారా భారత్ రుణం తీర్చుకుంది. ఇప్పుడు పాకిస్తాన్ కూటమిలో చేరకపోవడం ద్వారా భారత్ వైపు ఉండాలని ఈజిప్ట్ నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది.














Click it and Unblock the Notifications