పాక్ పర్యటనకు ట్రంప్- భారత్ కంటే టాప్ ప్రయారిటీ?
India US Trade Deal: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇటీవల ప్రకటించిన కొత్త టారిఫ్లు దేశ వాణిజ్యం రంగంపై గణనీయమైన ప్రభావాన్ని చూపనున్నాయి. ప్రత్యేకించి కాపర్, ఫార్మాసూటికల్స్ ఎగుమతులపై ఈ టారిఫ్ భారత్ కు పెను సవాలుగా మారడం ఖాయంగా కనిపిస్తోంది.
ఉక్కు, అల్యూమినియంపై విధించిన టారిఫ్ తర్వాత ఇప్పుడు కాపర్ పై 50 శాతం టారిఫ్ విధించారు డొనాల్డ్ ట్రంప్. 2024-25 ఆర్థిక సంవత్సరంలో ప్రపంచవ్యాప్తంగా రెండు బిలియన్ డాలర్ల విలువైన కాపర్, దాని ఆధారిత ఉత్పత్తులను ఎగుమతి చేసింది భారత్. ఇది రికార్డు.

ఈ ఎగుమతుల్లో అమెరికా వాటా 360 మిలియన్ డాలర్ల పైమాటే. అంటే మొత్తం రాగి ఎగుమతుల్లో ఇది 17 శాతం. అమెరికా భారత్ కు మూడవ అతిపెద్ద కాపర్ ఎగుమతి మార్కెట్. కాపర్ ఎగుమతుల్లో సౌదీ అరేబియా- 26, చైనా- 18 శాతం అమెరికా తర్వాతి స్థానాల్లో ఉన్నాయి.
మౌలిక సదుపాయాలు, ఇంధనం, తయారీ రంగాల్లో కాపర్ వినియోగం విస్తృతంగా ఉంటోంది. అమెరికాలో డిమాండ్ తగ్గినా కూడా దేశీయ కాపర్ పరిశ్రమపై ఆ ప్రభావం పెద్దగా ఉండకపోవచ్చని, ఈ టారిఫ్ గండం నుంచి భారత్ తేలిగ్గానే బయటపడగలదని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.
ఈ పరిణామాల మధ్య డొనాల్డ్ ట్రంప్ త్వరలో పాకిస్తాన్ లో పర్యటించనున్నారు. దీనికి సంబంధించిన తేదీ కూడా వెల్లడైంది. సెప్టెంబర్ 18వ తేదీన ఆయన ఇస్లామాబాద్ కు రానున్నారని పాకిస్తాన్ మీడియా ది డాన్ వెల్లడించింది. ఈ మేరకు ఓ ప్రత్యేక కథనాన్ని ప్రచురించింది.
అమెరికాలోని పాకిస్తాన్ రాయబార కార్యలయం, విదేశాంగ మంత్రిత్వ శాఖ, దౌత్యాధికారులను తన కథనంలో ఉటంకించింది. ఉన్నస్థాయి దౌత్య వర్గాల నుంచి అందిన సమాచారం ప్రకారం.. సెప్టెంబర్ 18వ తేదీన డొనాల్డ్ ట్రంప్.. పాకిస్తాన్ పర్యటనకు రానున్నారని తెలిపిందా కథనం.
ఆసియా దేశాల పర్యటనలో భాగంగా తొలుత పాకిస్తాన్ ను సందర్శించే అవకాశం ఉందని ది డాన్ వెల్లడించింది. ఆ తరువాతే భారత పర్యటన ఉంటుందని అంచనావేసింది. సెప్టెంబర్లో భారత్ క్వాడ్ సభ్యదేశాల శిఖరాగ్ర సమావేశానికి ఆతిథ్యం ఇవ్వనున్న విషయం తెలిసిందే. ఇందులో పాల్గొనడానికి ట్రంప్ భారత్ కు వస్తారని పేర్కొంది.
అంతకంటే ముందు.. లేదా ఆ తరువాత పాకిస్తాన్ ఇస్లామాబాద్ కు వస్తారని మరో పాకిస్తాన్ మీడియా సమా అభిప్రాయపడింది. కాగా.. భారత్- పాకిస్తాన్ మధ్య యుద్ధం తరువాత ఈ రెండు దేశాల్లో ట్రంప్ పర్యటించబోతోండటం ఇదే తొలిసారి అవుతుంది. ఈ యుద్ధాన్ని తానే ఆపానంటూ ఆయన చెప్పుకొంటోన్న విషయం తెలిసిందే.
కాగా- 2006 తరువాత ఓ అమెరికా అధ్యక్షుడు పాకిస్తాన్ లో పర్యటించడం కూడా ఇదే మొదటిసారి. అప్పటి అమెరికా అధ్యక్షుడు జార్జ్ బుష్.. పాకిస్తాన్ లో పర్యటించారు. ట్రంప్ పర్యటనపై అధికారిక ప్రకటన ఇంకా వెలువడాల్సి ఉంది.












Click it and Unblock the Notifications