ఆప్ఘానిస్థాన్లో 4.5 తీవ్రతతో భూకంపం: భయంతో పరుగులు తీసిన జనం
కాబూల్: ఇప్పటికే ఆప్ఘనిస్థాన్ అరాచక తాలిబన్ల చేతుల్లోకి వెళ్లిందని ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని జీవిస్తున్నారు ఆ దేశ ప్రజలు. తాజాగా, ఆప్ఘనిస్థాన్లో భూకంపం అక్కడి ప్రజలను భయాందోళనలకు గురిచేసింది. మంగళవారం ఉదయం 6.08 గంటలకు రిక్టారు స్కేలుపై 4.5 తీవ్రతతో భూకంపం సంభవించింది.
ఫైజాబాద్కు ఈశాన్యంలో 83 కిలోమీటర్ల పరిధిలో ఈ భూకంపం చోటు చేసుకుంది. ఇండియన్ నేషనల్ సెంటర్ ఫర్ సిస్మోలజీ ఈ మేరకు వివరాలను ట్విట్టర్ వేదికగా వెల్లడించింది. కాగా, ఒక్కసారిగా భూమి కంపించడంతో ప్రజలంతా ప్రాణాలు కాపాడుకోవడం కోసం తమ నివాసాల నుంచి బయటికి పరుగులు తీశారు. అయితే, ఈ భూకంపం కారణంగా ఎలాంటి ప్రాణ, ఆస్తి నష్టం జరగలేదు.
ఆప్ఘనిస్థాన్లో మొదలైన తాలిబన్ల రాజ్యం
అమెరికా దళాల ఉపసంహరించిన కొద్ది కాలంలోని రెచ్చిపోయిన తాలిబన్లు రెండ్రోజుల క్రితమే ఆప్ఘనిస్థాన్ను పూర్తిగా తమ ఆధీనంలోకి తీసుకుని తమ పాలనను ప్రారంభించారు. దీంతో ఇక తాము స్వేచ్ఛలేని జీవితాన్ని గడపాల్సి వస్తుందంటూ మహిళలు తీవ్ర మనోవేదనకు గురవుతున్నారు. ఈ నేపథ్యంలో మహిళలు, పురుషులు ప్రాణభయంతో ఆప్ఘాన్ను వీడుతున్నారు. దీంతో కాబూల్ విమానాశ్రయం జనసంద్రంగా మారింది. ఈ క్రమంలో అమెరికా దళాలు కాల్పులు జరపడంతో ఐదుగురు మృతి చెందారు. విమానం చక్రాలకు తమను కట్టివేసుకుని ప్రయాణించిన మరో ఇద్దరు గాలిలోకి ఎగిరిన తర్వాత కిందపడి మరణించారు.
ఈ నేపథ్యంలోనే అమెరికా అధ్యక్షుడు జో బైడెన్పై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఆప్ఘనిస్థాన్పై తాలిబన్లు పైచేయి సాధించడానికి బైడెన్ తీసుకున్న నిర్ణయమే కారణమని ఆరోపిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే వైట్హౌస్ ఎదుట పెద్ద సంఖ్యలో ఆప్ఘాన్ దేశీయులు ఆందోళన చేపట్టారు. ఈ సందర్భంగా జో బైడెన్కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. 'బైడెన్ మీరు మమ్మల్ని మోసం చేశారు', బైడెన్ మీరే బాధ్యులు అంటూ నినాదాలు చేశారు
అమెరికాలోని ఆప్ఘన్ వాసులు. ఆప్ఘాన్ ప్రజలు మళ్లీ తాలిబన్ల బారినపడి ఉండాల్సింది కాదని అన్నారు. ఆప్ఘనిస్థాన్లో ఇక మహిళలకు భవిష్యత్ ఉండదు. తాము మళ్లీ ఆంక్షల మధ్య జీవించాలనుకోవడం లేదు. అది స్వేచ్ఛకాదు అంటూ ఆప్ఘాన్ మహిళలు పెద్దపెట్టున నినాదాలు చేశారు. చాలా మంది ఆప్ఘాన్లో ఉంటున్న తమ కుటుంబసభ్యుల క్షేమ సమాచారంపై ఆందోళన వ్యక్తం చేశారు.
Recommended Video
ఆప్ఘాన్ తాజా పరిస్థితులపై అమెరికా అధ్యక్షుడు బైడెన్ ఇప్పటి వరకు నోరు మెదపకపోవడంపైనా ఆగ్రహ జ్వలాలు వెల్లువెత్తుతున్నాయి. కనీసం సోషల్ మీడియాలో కూడా ఆయన తన స్పందనన తెలియజేయలేదు. కాగా, ఆప్ఘాన్ పరిస్థితులపై అధ్యక్షుడు బైడెన్ ఎలా స్పందించాలనేదానిపై ఇప్పటికే వైట్ హౌస్ సలహాదారులు మేథోమధనం నిర్వహిస్తున్నారు. ఇక మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కూడా జో బైడెన్పై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆప్ఘన్ దుస్థితికి బాధ్యత వహిస్తూ జో బైడెన్ వెంటనే రాజీనామా చేయాలని డిమాండ్ చేశఆరు. ఈ మేరకు ఆదివారం ఆయన ఒక ప్రకటన విడుదల చేశారు. కరోనా కేసులు పెరగడానికి, ఆప్ఘాన్లో పరిస్థితులు దిగజారడానికి, సరిహద్దుల్లో దుస్థితికి, ఆర్థిక వ్యవస్థ దిగజారడానికి బైడెన్ కారణమి దుయ్యబట్టారు.