ప్రాణాలతో ఉన్నానంటే భారత సైన్యమే కారణం: ఈజిప్టు యువతి ప్రశంసలు
కైరో/యెమన్: అంతర్యుద్ధంలో చిక్కుకున్న యెమన్ నుంచి భారతీయులతోపాటు విదేశీయులను రక్షించడంలో భారత సైన్యం చూపిన మానత్వాన్ని ప్రశంసించకుండా ఉండలేకపోతున్నానని ఈజిప్టు యువతి ఆల్యా గబెర్ భారత సైన్యంపై ప్రశంసలు కురిపించింది. తాను ప్రాణాలతో ఉన్నానంటే అందుకు భారత సైన్యమే కారణమని పేర్కొంది.
‘ఇప్పుడు నేను ప్రాణాలతో ఉన్నానంటే అది భారత సైన్యం వల్లే' అని ఆ యువతి ఫేస్బుక్లో వ్యాఖ్యానించింది. కాగా, ఈ వ్యాఖ్యలు సామాజిక మాధ్యమంలో హల్చల్ చేస్తున్నాయి. ఇటీవల యెమన్ నుంచి భారతీయులతోపాటు విదేశీయులను కూడా భారత సైన్యం కాపాడింది.
అందులో ఈ 20ఏళ్ల ఆల్యా గబెర్ అనే ఈజిప్టు యువతి కూడా ఉంది. తమకు భోజనం, మందులతో పాటు సకల సౌకర్యాలు కల్పించిందని ఆల్యా పేర్కొంది. కాగా, ఆల్యా పేర్కొన్న కథనాన్ని ఈజిప్టు మీడియా ప్రముఖంగా ప్రచురించడం విశేషం.
స్వదేశానికి ఆరు రోజుల చిన్నారి
కొచ్చి: యెమెన్లోని భారతీయులను భారత ప్రభుత్వం స్వదేశానికి తీసుకువస్తున్న క్రమంలో శుక్రవారం ఇక్కడికి వచ్చిన వారిలో ఆరు రోజుల పాప ఉండటం అందరినీ సంభ్రమాశ్చర్యాలకు గురిచేసింది. ఇక్కడి అంతర్జాతీయ విమానాశ్రయంలో విమానం నుంచి దిగిన వారితో పాటు ఇంక్యుబేటర్లో పార్వతి అనే పసిపాప కూడా ఉంది.
ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్న ఈ పసిపాప వెంట ఒక డాక్టర్ కూడా ఉన్నారు. విమానం ఇక్కడ ల్యాండింగ్ అయిన వెంటనే ఈ పసిపాపను, ఆమె తల్లిని నగరంలోని అమృత ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైనె్సస్ ఆసుపత్రికి తరలించినట్లు అధికారులు చెప్పారు. ఈ పసిపాపను, ఆమె తల్లిదండ్రులు రాజి, శశిలను యుద్ధపీడిత ప్రాంతమైన సానా నగరం నుంచి నిన్న ఎయిర్ ఇండియా ప్రత్యేక విమానంలో డిజిబౌటికి తరలించారు.
డిజిబౌటిలోని భారత అధికారులు ఈరోజు ఉమా నంబియార్ అనే డాక్టర్ను వీరివెంట కొచ్చికి పంపించారు. యెమెన్ నుంచి సురక్షితంగా స్వదేశానికి వచ్చిన భారతీయుల్లో అతి చిన్న వయస్కురాలు పార్వతియే. ఇదిలా ఉండగా, భారత ప్రభుత్వం తాజాగా 630 మందిని సానా నుంచి తరలించింది. దీంతో యెమెన్ నుంచి స్వదేశానికి వచ్చిన వారి సంఖ్య 4,640కి చేరింది.