ట్విట్టర్ సీఈఓ ఎలాన్ మస్క్ సంచలన నిర్ణయం
వాషింగ్టన్: అపర కుబేరుడు ఎలాన్ మస్క్ కీలక నిర్ణయాన్ని తీసుకున్నారు. మైక్రో బ్లాగింగ్ ప్లాట్ఫామ్ ట్విట్టర్కు గుడ్ బై చెప్పబోతోన్నాడు. ప్రముఖ ఎలక్ట్రిక్ కార్ల తయారీ సంస్థ టెస్లా, ప్రైవేట్ అంతరిక్ష పరిశోధన సంస్థ స్పేస్ ఎక్స్ అధినేతగా తీరిక లేని షెడ్యూల్ను గడుపుతోన్న నేపథ్యంలో ఆయన ఈ నిర్ణయాన్ని తీసుకున్నట్లు తెలుస్తోంది.
ఈ టాప్ సోషల్ మీడియాను ఎలాన్ మస్క్ కొనుగోలు చేసిన విషయం తెలిసిందే. 44 బిలియన్ డాలర్లను ధారపోసి దీన్ని టేకోవర్ చేశారాయన. గత ఏడాది అక్టోబర్ 26వ తేదీన ట్విట్టర్ సీఈఓగా బాధ్యతలను స్వీకరించారు. అమెరికాలోని శాన్ఫ్రాన్సిస్కోలో గల ట్విట్టర్ ఆఫీస్లో ఎలాన్ మస్క్ అడుగు పెట్టిన వెంటనే సీఈఓగా పలు విప్లవాత్మక మార్పులకు శ్రీకారం చుట్టారు. తొలి రోజు నుంచే ఉద్యోగుల తొలగింపు ప్రక్రియను చేపట్టారు.

అప్పటివరకు చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ పని చేసిన పరాగ్ అగర్వాల్, లీగల్ సెల్ చీఫ్ విజయ గద్దెపై వేటు వేశారు. కొన్ని రోజుల పాటు ఉద్యోగుల తొలగింపు ప్రక్రియ కొనసాగింది. ఎలాన్ మస్క్ చేతుల్లోకి వెళ్లే సమయానికి ట్విట్టర్ లో 7,500 మంది ఉద్యోగులు పని చేస్తోండగా, ఆ సంఖ్యను సగానికి తగ్గించారు. డెడ్లైన్ పెట్టి మరీ వేలాదిమంది ఉద్యోగులను తొలగించారు.
సంస్థ ఆదాయాన్ని పెంచుకోవడానికి కొత్త విధానాలను ప్రకటించారు. బ్లూ టిక్ వెరిఫికేషన్ ఉన్న ఖాతాదారుల నుంచి నెలకు ఎనిమిది డాలర్లను వసూలు చేస్తోన్నారు. తొలిదశలో అమెరికా, బ్రిటన్లో ఈ పెయిడ్ బ్లూ టిక్ వెరిఫికేషన్ను అమలు చేశారాయన. ఆ తరువాత భారత్లో ఈ సర్వీస్ అందుబాటులోకి వచ్చింది. భారత్లో ట్విట్టర్ బ్లూ టిక్ వెరిఫికేషన్ ప్రక్రియలో భాగంగా వేర్వేరు రంగులతో గల బ్యాడ్జీలను అమలు చేశారు.
ఈ పరిణామాల తరువాత ఇక ఆయన తప్పుకోనున్నట్లు ప్రకటించారు. త్వరలోనే ట్విట్టర్ సీఈఓగా రాజీనామా చేయబోతోన్నట్లు తాజాగా ప్రకటించారు. మరో ఆరు వారాల్లోగా కొత్త చీఫ్ వస్తారని తెలిపారు. ట్విట్టర్కు కొత్త సీఈఓగా ఓ మహిళను నియమించనున్నట్లు చెప్పారు ఎలాన్ మస్క్. దీనికి సంబంధించిన కొంత సమాచారాన్ని తన అధికారిక ట్విట్టర్ అకౌంట్లో పోస్ట్ చేశారు. ఆమె ఎవరనేది తెలియజేయలేదు.
Excited to announce that I’ve hired a new CEO for X/Twitter. She will be starting in ~6 weeks!
— Elon Musk (@elonmusk) May 11, 2023
My role will transition to being exec chair & CTO, overseeing product, software & sysops.
టెస్లా, స్పేస్ ఎక్స్ కార్యకలాపాలను మరింత విస్తరించాల్సి ఉన్న నేపథ్యంలో ఎలాన్ మస్క్ ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఎలక్ట్రిక్ వాహనాలకు ప్రపంచవ్యాప్తంగా పెద్దఎత్తున డిమాండ్ లభిస్తోన్న నేపథ్యంలో టెస్లా కార్ల తయారీని రెట్టింపు చేస్తామంటూ ఇటీవలే ప్రకటించారు ఎలాన్ మస్క్. భారత్లోనూ ప్లాంట్ పెట్టే దిశగా ఆయన చర్యలు తీసుకుంటోన్న విషయం తెలిసిందే.












Click it and Unblock the Notifications