ఒక్కరోజులో ఫేస్బుక్ సీఈఓ సంపద 40వేల కోట్లు
న్యూఢిల్లీ: సామాజిక మాధ్యమమైన ఫేస్బుక్ సహా వ్యవస్థాపకుడు, సీఈఓ మార్క్ జూకర్స్ బర్గ్ సంపద ఒక్క రోజులోనే సుమారు 40వేల కోట్ల రూపాయల మేరకు పెరిగింది. దీంతో ప్రపంచ కుబేరుల జాబితాలో మార్క్ జూకర్స్బర్గ్... ఆయిల్ మేగ్నట్స్ చార్లెస్, డేవిడ్ కోచ్లను వెనక్కి నెట్టి 6వ స్ధానంలో నిలిచారు.
గురువారం ఫేస్బుక్ కంపెనీ షేర్ల విలువ 13 శాతం పెరగడంతో ఆయన సంపద విలువ అమాంతం పెరిగిపోయింది. దీంతో కంపెనీ నాలుగో త్రైమాసిక అమ్మకాలు 52 శాతం మేరక పెరిగినట్టు ఫేస్బుక్ వెల్లడించింది. తాజాగా పెరిగిన సంపదతో కలిపి జూకర్స్ బర్గ్ ఆస్తి విలువ 3.22 లక్షల కోట్ల రూపాయలకు చేరుకుంది.
ప్రపంచంలోని 50 మంది కుబేరుల జాబితాలో మైక్రోసాప్ట్ అధినేత బిల్ గేట్స్ మొదటి స్థానంలో ఉన్నారు. ఆయన సంపద విలువ సంపద విలువ 8740 కోట్ల డాలర్లు. తర్వాతి స్థానంలో స్పానిష్ వ్యాపారవేత్త అమన్సియో ఒర్టెగా (6,680 కోట్ల డాలర్లు) నిలిచారు. మూడోస్థానంలో వారెన్ బఫెట్ (సంపద 6,070 కోట్లడాలర్లు) ఉన్నారు.
అంతర్జాతీయ ఈ కామర్స్ దిగ్గజ వెబ్సైట్ అమెజాన్కు చెందిన జెఫ్రీ బెజోస్ 5,660 కోట్ల డాలర్ల సంపదతో నాలుగో స్థానంలో ఉన్నారు. అమెరికాకు చెందిన మరో వ్యాపార దిగ్గజం డేవిడ్ కోచ్కు ఐదో స్థానం దక్కింది. ఆయన వ్యక్తిగత ఆస్తి 4,740 కోట్ల డాలర్లు. ఇది ఇలా ఉంటే ఈ జాబితాలో భారత్ నుంచి ముగ్గురికి చోటు దక్కింది.
భారత్కు చెందిన పారిశ్రామికవేత్తలు రిలయన్స్ ఇండస్ట్రీస్ చైర్మన్ ముకేశ్ అంబానీ, విప్రో అధినేత అజీమ్ ప్రేమ్జీ, సన్ఫార్మా చీఫ్ దిలీప్ సంఘ్వీలు ఈ జాబితాలో ఉన్నారు. 2,480 కోట్ల డాలర్ల సంపద కలిగిన ముకేష్ అంబానీ 27వ స్థానంలో, 1,650 కోట్ల డాలర్ల నికర విలువ కలిగిన అజీమ్ ప్రేమ్జీ 43వ స్థానంలో, 1,640 కోట్ల డాలర్ల సంపద కలిగిన దిలీప్ సంఘ్వి 44వ స్థానంలో నిలిచారు.