Liz Truss: మూర్తి గారి అల్లుడికి మొండిచెయ్యి: బ్రిటన్ ప్రధాని రేసులో మహిళ
లండన్: రాజకీయ సంక్షోభంలో ఉన్న బ్రిటన్కు కొత్త ప్రధానమంత్రి రాబోతోన్నారు. ఈ దిశగా అక్కడ చకచకా పావులు కదులుతున్నాయి. ప్రధానిగా పని చేసిన బోరిస్ జాన్సన్పై చెలరేగిన అసంతృప్తి దీనికి కారణమైంది. ఆయన పదవి నుంచి వైదొలగడానికి దారి తీసింది. బోరిస్ జాన్సన్ కేబినెట్ సహచరులందరూ తమ పదవులకు గుడ్బై చెప్పడంతో అక్కడి ప్రభుత్వం కూలిపోయే దశకు చేరుకుంది. దీన్ని నివారించడానికి బోరిస్ జాన్సన్ రాజీనామా అనివార్యమైంది.

రిషి సునక్తో మొదలు..
భారత టెక్ దిగ్గజం ఇన్ఫోసిస్ వ్యవస్థాపకుడు నారాయణ మూర్తి అల్లుడు రిషి సునక్తో మొదలైన ఈ రాజీనామాలు.. బ్రిటన్ ప్రభుత్వాన్ని కుప్పకూల్చేంత స్థాయికి వెళ్లాయి. బోరిస్ జాన్సన్ తక్షణ నివారణ చర్యలు తీసుకున్నప్పటికీ.. ఎలాంటి ఫలితం కనిపించలేదు. ఒకరి తరువాత ఒకరు మంత్రులు తమ పదవుల నుంచి తప్పుకొన్నారు. సాజిద్ జావిద్, విల్ క్విన్స్, లారా ట్రాట్, లిజ్ ట్రస్.. ఇలా 58 మంత్రులు కేబినెట్ నుంచి వైదొలిగారు.

కేబినెట్ ఖాళీ..
రాజీనామాలు చేసిన మంత్రుల స్థానంలో బోరిస్ జాన్సన్ ఎప్పటికప్పుడు కొత్త వారిని అపాయింట్ చేస్తూ వచ్చారు గానీ.. దాని అంతం లేకుండా పోయింది. మంత్రులతో పాటు ఆయా శాఖలకు చెందిన 30 మంది ఉన్నతాధికారులు, సలహాదారులు సైతం తప్పుకోవడంతో ఆయనపై ఒత్తిడి పెరిగింది. అటు బకింగ్హామ్ ప్యాలెస్ నుంచి కూడా కీలక సందేశాలు అందినట్లు అప్పట్లో వార్తలొచ్చాయి. దీనితో బోరిస్ జాన్సన్ ప్రధానిగా తప్పుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది.

రేసులో..
ప్రస్తుతం బ్రిటన్లో ఆపద్ధర్మ ప్రభుత్వం ఉంది. కొత్త ప్రధాని నియమితుడయ్యేంత వరకూ బోరిస్ జాన్సన్ పదవిలో కొనసాగుతారు. కాగా- ప్రధాని రేసులో మాజీ మంత్రుల పేర్లు తెర మీదికి వచ్చాయి. బ్రిటన్ కొత్త ప్రధాన మంత్రిగా బోరిస్ జాన్సన్ వారసుడి అన్వేషణ ప్రస్తుతం కొనసాగుతోంది. అందరికంటే ముందుగా- నారాయణ మూర్తి అల్లుడు రిషి సునక్..తన పేరును ప్రకటించుకున్నారు. కొత్త ప్రధాని రేసులో నిల్చున్నట్లు తెలిపారు.

విదేశాంగ మంత్రి..
ఇప్పుడు తాజాగా మరో పేరు వెలుగులోకి వచ్చింది. బ్రిటన్ విదేశాంగ శాఖ మంత్రి లిజ్ ట్రస్ పేరు వినిపిస్తోంది. తాను ప్రధాని రేసులో నిల్చున్నట్లు ఆమె ప్రకటించారు. ఈ పదవి కోసం తాను పోటీలో ఉన్నట్లు కొద్దిసేపటి కిందటే ఓ ప్రకటన విడుదల చేశారు. దీన్ని తన అధికారిక మైక్రోబ్లాగింగ్ ప్లాట్ఫామ్ ట్విట్టర్లో పోస్ట్ చేశారు. దీని కోసం ఆమె తన ఇండోనేషియా పర్యటనను సైతం కుదించుకున్నారు. లండన్కు తిరిగివచ్చారు.

ఇండోనేషియా ట్రిప్..
ఈ ఏడాది చివర్లో ఇండోనేషియాలో జీ20 దేశాల శిఖరాగ్ర సదస్సు ఏర్పాటు కానుంది. దీనికి సన్నాహకంగా ఆయా దేశాల విదేశాంగ మంత్రులు అక్కడ సమావేశం అయ్యారు. భారత విదేశాంగ మంత్రి సుబ్రహ్మణ్యం జైశంకర్ ఇందులో పాల్గొన్నారు. ఇదే సమావేశంలో పాల్గొన్న లిజ్ ట్రస్.. స్వదేశానికి తిరిగి వచ్చారు. ఆ కొద్దిసేపటికే తాను ప్రధానమంత్రి రేసులో ఉన్నట్లు ప్రకటించారు. దీనితో ఇప్పటివరకు ఈ రేసులో నిల్చున్న వారి సంఖ్య 11కు చేరింది.












Click it and Unblock the Notifications