1945లో తప్పిపోయిన నాజీ బంగారు రైలు దొరికింది..!
న్యూఢిల్లీ: ఏడు దశాబ్దాల క్రితం రెండో ప్రపంచ యుద్ధ సమయంలో తుపాకులు, భారీ బంగారు నిధితో బయల్దేరి మార్గమధ్యంలో మాయమైన నాజీ రైలుని కనుగొన్నామని ఇద్దరు వేటగాళ్లు ప్రకటించారు. 1945లో హంగేరీ నుంచి జర్మనీలోని బెర్లిన్కు ఒక రైలు బయల్దేరింది.
హిట్లర్ నాజీ సైనికులు ఈ రైలులో భారీఎత్తున తుపాకులు, పారిశ్రామిక పరికరాలు, వజ్రాలు, టన్నుల కొద్దీ బంగారం, ఇతర అమూల్యమైన వస్తువులు, చిత్రపటాలు, కళాకండాలు, బంగారు వెండి ఆభరణాలను ఉన్నట్లు చెప్తున్నారు. వీటి విలువ దాదాపు రూ.13 వందల కోట్ల విలువ ఉంటుందని అంచనా.
ఇదంతా నాజీ సైనికులు నాటి తూర్పు జర్మనీ (ప్రస్తుతం పోలెండ్) పట్టణమైన బ్రెస్లాలో దోచుకున్న సొత్తు. సొవియట్ యూనియన్కు చెందిన ఎర్రసైన్యం తరుముకొస్తున్న నేపథ్యంలో దొచుకున్న సొత్తంతా రైలులో జర్మనీకి తరలించారు.
పోలండ్లోని దిగువ సిలేసియన్లో ఓ సొరంగ మార్గంలో ప్రవేశించిన తరువాత రైలు అందులోంచి బయటకు రాలేదని భావిస్తున్నారు. 150 మీటర్ల పొడవున్న ఈ రైలు 1945లో అదృశ్యమైంది. పోలండ్లోని కొన్ని వెబ్సైట్ల కథనం ప్రకారం ఈ రైలులో 300 టన్నుల బంగారం ఉన్నట్లు తెలుస్తోంది.
ఆ సొరంగాన్ని తర్వాత కాలంలో మూసివేశారు. ఇప్పుడు ఆ సొరంగం ఎక్కుడుందో కూడా తెలియదు. ఈ నాజీ రైలుని గుర్తించడానికి ప్రయత్నించిన పోలండ్, జర్మనీలకు చెందిన ఇద్దరు నిధి వేటగాళ్లు సఫలీకృతమయ్యామని, రైలు కొనుగొన్నామని ప్రకటించారు.
తమకు ప్రాతినిధ్యం వహిస్తున్న ఓ న్యాయసంస్థ ద్వారా పోలండ్లోని ఆగ్నేయ జిల్లా వాల్బ్రిక్ అధికారులను సంప్రదించారు. దొరికిన మొత్తంలో 10శాతం తమకు ఇస్తే నిధిని అప్పగిస్తామని వారిద్దరూ డిమాండ్ చేస్తున్నట్లు సమాచారం. అధికారులు ఈ వ్యవహారాన్ని విచారిస్తున్నారు.