తొలిసారి ప్రజల ముందుకు కొత్త సుప్రీం లీడర్.. ప్రపంచ దేశాల్లో ఉత్కంఠ!
ఇరాన్ దేశ అత్యున్నత పదవి 'సుప్రీం లీడర్'గా బాధ్యతలు చేపట్టిన మొజ్తబా ఖమేనీ ఎట్టకేలకు తొలిసారి బాహ్య ప్రపంచానికి దర్శనమివ్వబోతున్నారా? అంటే అవుననే అంటున్నాయి అంతర్జాతీయ నిఘా వర్గాలు. ఫిబ్రవరి చివర్లో అమెరికా-ఇజ్రాయెల్ ఉమ్మడి వైమానిక దాడుల్లో ఇరాన్ మాజీ సుప్రీం లీడర్ అయతుల్లా అలీ ఖమేనీ మరణించిన సంగతి తెలిసిందే. ఆ తర్వాత ఆయన కుమారుడు మొజ్తబా ఖమేనీ దేశ సర్వోన్నత నేతగా బాధ్యతలు స్వీకరించారు. అయితే, బాధ్యతలు చేపట్టిన నాటి నుంచి నేటివరకు ఆయన ఒక్కసారి కూడా బహిరంగంగా ప్రజల ముందుకు రాలేదు.
ఇటీవల ఇరాన్ చరిత్రలోనే అత్యంత భారీ స్థాయిలో జరిగిన అయతుల్లా అలీ ఖమేనీ అంత్యక్రియల్లో మొజ్తబా ఖమేనీ కనిపించకపోవడం ప్రపంచవ్యాప్తంగా తీవ్ర చర్చకు దారితీసింది. టెహ్రాన్ లోని గ్రాండ్ మొసల్లా వేదికగా జరిగిన ఈ అంతిమయాత్రలో అలీ ఖమేనీ ఇతర ముగ్గురు కుమారులు (ముస్తఫా, మేసమ్, మసౌద్) పాల్గొని ప్రార్థనలు చేశారు. కానీ, వారసత్వంగా సుప్రీం లీడర్ పదవిని దక్కించుకున్న మొజ్తబా మాత్రం ఎక్కడా కనిపించలేదు.

తండ్రితో పాటు మరణించిన తన సోదరి, కూతురు, కోడలు, 14 నెలల మనవరాలి శవపేటికల వద్ద కూడా ఆయన రాకపోవడంపై ఇరాన్ అధికార యంత్రాంగం ఎలాంటి వివరణ ఇవ్వలేదు. అప్పట్లో జరిగిన దాడిలో మొజ్తబా కూడా గాయపడ్డారని కొందరు, రక్షణ కారణాల దృష్ట్యా ఆయన్ను రహస్య ప్రాంతంలో ఉంచారని మరికొందరు విశ్లేషించారు.
అధికారిక ప్రకటన విడుదల.. ముజ్తబా ఆధ్వర్యంలోనే సభ!
ఇరాన్ ప్రభుత్వ వర్గాల సమాచారం ప్రకారం.. జూలై 23న టెహ్రాన్లో సాయంత్రం 5 గంటల నుంచి రాత్రి 7 గంటల వరకు అయతుల్లా అలీ ఖమేనీ స్మారక సభ జరగనుంది. ఈ మేరకు విడుదలైన అధికారిక నోటీసులో.. అమెరికా-ఇజ్రాయెల్ సంయుక్త వైమానిక దాడుల్లో ప్రాణాలు కోల్పోయిన అలీ ఖమేనీని "అమరవీరుడు, ముజాహిద్ ఇమామ్" అని ఇరాన్ అభివర్ణించింది. ఈ సభ మొత్తం ప్రస్తుత సుప్రీం లీడర్ ముజ్తబా ఖమేనీ పర్యవేక్షణలోనే జరుగుతుందని స్పష్టం చేశారు.












Click it and Unblock the Notifications