అత్తింటి ఆరళ్లు: ఇమ్రాన్ ఖాన్ మాజీ భార్య సంచలనం
లండన్: పాకిస్తాన్ మాజీ క్రికెటర్, రాజకీయవేత్త ఇమ్రాన్ఖాన్ నుంచి విడాకులు తీసుకున్న టీవీ జర్నలిస్టు రెహమ్ ఖాన్ సంచలన వ్యాఖ్యలు చేశారు. తమ వైవాహిక జీవితంలో ప్రతి ఒక్కరూ జోక్యం చేసుకున్నారని, మొత్తంగా పాకిస్థాన్ తనకు ససురాల్ (అత్తిల్లు)లా తయారైందని ఆమె గార్డియన్ పత్రికకు రాసిన ఒక వ్యాసంలో అన్నారు.
దేశంలోకెల్లా శక్తిమంతుడైన వ్యక్తిని పెళ్లాడినా తనకు ఆరళ్లు తప్పలేదని ఆవేదన వ్యక్తం చేశారు. చదువులేని నిరుపేద మహిళ ఎంతో తన పరిస్థితి అంతే అయ్యిందని అన్నారు. ఎవరైనా బురద జల్లొచ్చునని, అడిగే నాథుడు ఉండడని అన్నారు.. అయితే విడాకులు తీసుకోవాలనే నిర్ణయం మాత్రం తమ ఇద్దరిదేనని, ఇందులో ఎవరి ప్రమేయం లేదని రెహమ్ స్పష్టం చేశారు.
ఇమ్రాన్, రెహమ్ విడిపోతున్నట్టు గతనెల 30వ తేదీన ప్రకటించారు. రెహమ్ రాజకీయాల్లో తలదూర్చడం పట్ల ఇమ్రాన్ అభ్యంతరం తెలుపడం వల్లనే ఇద్దరిమధ్య పొరపొచ్చాలు వచ్చాయని వార్తలు వెలువడ్డాయి. ఇమ్రాన్ను పెళ్లి చేసుకుని పాకిస్తాన్కు తాను భాబీ (వదిన) అయ్యానని, దాంతో దేశమంతా అత్తవారిల్లులా మారిందని రెహమ్ వ్యాఖ్యానించారు. ఎవరైనా ఏమైనా అనొచ్చన్నట్టుగా తయారైందని ఆమె తెలిపారు.