గాల్వాన్ లోయపై చైనా షాకింగ్ ప్రకటన.. టార్గెట్ అక్సాయ్ చిన్.. 1962 స్ట్రాటజీ.. భారత్ కింకర్తవ్యం?
వాస్తవ నియంత్రణ రేఖ్(ఎల్ఏసీ) వెంబడి దశాబ్దాలుగా కొనసాగుతోన్న శాంతి ఒప్పందాలను విచ్ఛిన్నం చేస్తూ భారత బలగాలను అతి కిరాతకంగా చంపేసిన చైనా.. తన వైపు ఎంత మంది చనిపోయారనేది మాత్రం బయటపెట్టలేదు. తాజా హింసకు సంబంధించి వాస్తవాలు వెలుగులోకి రాకముందే డ్రాగన్ మరో సంచలన చర్యకు పాల్పడింది. తూర్పూలదాక్ లోని గాల్వాన్ లోయ తమదేనంటూ సార్వభౌమత్వాన్ని ప్రకటించుకుంది. చైనా సైన్యాధికారులు బుధవారం ఈ మేరకు అధికారిక ప్రకటన చేశారు. చరిత్ర పొడవునా అసలు వివాదమే లేని గాల్వాన్ లోయను చైనా సడెన్ గా ఆక్రమించుకోవడం వెనుక పెద్ద మతలబే ఉంది..

అటు చావులు.. ఇటు చర్చలు..
సైనిక, రాజకీయ కారణాల నేపథ్యంలో గడిచిన రెండు నెలలుగా చైనా.. భారత సరిహద్దులో భారీగా బలగాలను మోహరించి కవ్వింపులకు దిగడం, తూర్పు లదాక్ లో కీలకమైన స్థావరాలుగా భావించే గాల్వాన్ లోయ, హాట్ స్ప్రింగ్స్, పాంగాంగ్ సరస్సును కబ్జా చేసేందుకు ప్రయత్నించడం, దాన్ని భారత్ బలంగా తిప్పికొడుతుండటం తెలిసిందే. జూన్ 6నాటి చర్చల ఫలితంగా సరిహద్దుల నుంచి సైన్యాల ఉపసంహరణ(డీఎస్కలేషన్) ప్రక్రియ మొదలుకాగా.. గాల్వాన్ లోయ నుంచి వెనక్కెళ్లేందుకు చైనా నిరాకరించింది. ఈ క్రమంలో సోమవారం(15న) రాత్రి రెండు ఇరు పక్షాల సైనికులు భయానకరీతిలో రాళ్లు, తుపాకి మడమలు, ఇనుపకంచెలతో కొట్లాడుకున్నారు. మనవైపు 20మందికిపైగా సైనికులు చనిపోగా, అటువైపు కూడా ప్రాణనష్టం జరిగినట్లు తెలుస్తోంది. ఇంత జరిగిన తర్వాత కూడా పరిస్థితి మరింత దిగజారకుండా మేజర్ జనరల్స్ స్థాయిలో చర్చలు కొనసాగుతూనే ఉన్నాయి.

గాల్వాన్ లోయనే ఎందుకు?
భారత్, చైనా సరిహద్దుల్లోని మిగతా ప్రాంతాలకు భిన్నంగా గాల్వాన్ లోయ దాదాపు ప్రశాంతంగా ఉండేది. దోక్లాం, దేమ్ చోక్ తరదితర పాయింట్ల మాదిరిగా రెండు వైపులా సైన్యాలు ఎదురుపడటం, బాహాబాహీకి దిగడం లాంటి దృశ్యాలేవీ అక్కడ చోటుచేసుకోలేదు. అదీగాక, చైనా ఏనాడూ గాల్వాన్ ను తనదిగా చెప్పుకోవడంగానీ, ఆమేరకు మ్యాపులు గట్రా రూపొందించడంగానీ చేయలేదు. అలాంటి వివాదరహిత ప్రాంతంలోకి (మే మొదటి వారంలో)ఒక్కసారిగా వేలాది బలగాలను దింపిన చైనా.. ఇండియాకు దాదాపుగా షాకిచ్చింది. ఈ చర్య ఆశ్చర్యకరమేనని భారత సైనిక, విదేశాంగ విభాగాలు తమ అధికారిక ప్రకటనల్లోనూ పేర్కొనడం గమనార్హం. గతానికి భిన్నంగా ఈసారి గొడవలు గాల్వాన్ లోయలో ఎందుకు జరుగుతున్నట్లు?

1962 యుద్ధ కేంద్రం..
తాజా వివాదం కొనసాగుతోన్న గాల్వాన్ లోయ.. 1962 నాటి యుద్ధంలోనూ కేంద్రబిందువుగా ఉండింది. భారత్ పై దురాక్రమణక నిర్ణయించుకున్న చైనా మొట్టమొదట దాడి చేసింది గాల్వాన్ లోయలోనే. ముందుగా ఆ భూభాగాన్ని ఆక్రమించి, క్రమంగా ముందుకు చొరబడింది. అయితే యుద్ధం ముగిసిన తర్వాత డ్రాగన్ బలగాలు వెనక్కి తగ్గగా.. గాల్వాన్ లోయను సరిహద్దుగా రెండు దేశాలూ అంగీకరించాయి. మళ్లీ ఇన్ని దశాబ్దాల తర్వాత చైనా అదే గాల్వాన్ లోయను తిరిగి ఆక్రమించి.. అది తన భూభాగమేనని ప్రకటించడం ద్వారా 1962 స్ట్రాటజీని ఫాలో అవుతున్నట్లు స్పస్టమవుతోంది. దీని అర్థం యుద్ధమా? ఇంకొకటా? అనేది మరికొద్ది రోజుల్లో స్పష్టం కానుంది. గాల్వాన్ కు సంబంధించి మరో ముఖ్యాంశం ఏంటంటే..

అక్సాయ్ చిన్ కు ఏకైక మార్గం..
భారత్, చైనా సరిహద్దు వివాదాల్లో అతి పెద్దది, కీలకమైనది ‘అక్సాయ్ చిన్' గ్లేసియర్. చైనా ఆక్రమించుకున్న చాలా భూభాగాల నుంచి.. 1962 యుద్ధం తర్వాత వెనక్కి మళ్లినా.. అక్సాయ్ చిన్ పై పట్టును మాత్రం కొనసాగిస్తున్న సంగతి తెలిసిందే. ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన యుద్ధభూమిగా పేరుపొందిన అక్సాయ్ చిన్ ను చేరుకోడానికి భారత్ వైపు నుంచి ఉన్న ఏకైక మార్గం గాల్వాన్ లోయ ఒక్కటే. అత్యవసరం, తప్పనిసరి అనుకుంటే.. గాల్వాన్ లోయ నుంచి భారత్ తన సైన్యాలను అక్సాయ్ చిన్ కు పంపే వీలుంది. ఆ ఒక్క దారిని పూర్తిగా మూసేయడం ద్వారా అక్సాయ్ చిన్ పై తన ఆక్రమణ కొనసాగించొచ్చన్నది చైనా ఎత్తుగడ. మరి, ఇంత కీలకమైన ప్రాంతాన్ని చైనా ఇన్నేళ్లు ఎందుకు వదిలేసినట్లు? అనే ప్రశ్నకు సమాధానం.. మొత్తం వివాదాన్ని అర్థం చేసుకోడానికి ఉపకరిస్తుంది.

ఆగస్టు ప్రకటనతో ప్రకంపనలు..
1962 యుద్ధం, 1975, 1993.. తదితర సందర్భాల్లో జరిగిన ఒప్పందాల మేరకు రెండు దేశాలూ ‘స్టేటస్ కో' పాటించాలనే నిర్ణయానికి వచ్చాయి. అయితే, గతేడాది భారత పార్లమెంట్ లో జమ్మూకాశ్మీర్ స్వయంప్రతిపత్తికి సంబంధించిన ఆర్టికల్ 370 రద్దు సందర్భంలో.. ఆ రాష్ట్రాన్ని రెండు కేంద్రపాలిత ప్రాంతాలుగా విభజించడం, అదే సందర్భంలో కేంద్ర హోం మంత్రి అమిత్ షా సభలో మాట్లాడుతూ.. రాబోయే రోజుల్లో పాక్ ఆక్రమిత కాశ్మీర్(పీవోకే), అక్సాయ్ చిన్(చైనా ఆక్రమిత కాశ్మీర్)ను సైతం భారత్ స్వాధీనం చేసుకుంటుందని ఘంటాపథంగా చెప్పడం చైనాలో ప్రకంపనలు పుట్టించింది. కాశ్మీర్ ను విభజించాలన్న భారత్ నిర్ణయం.. స్టేటస్ కో నిబంధనకు విరుద్ధం కాబట్టి.. తాము కూడా ప్రతి చోటా రూల్స్ ను బ్రేక్ చేస్తాం అన్న చందంగా డ్రాగన్ వ్యవహరిస్తున్నది. అయితే, తనకు సార్వభౌమాధికారం ఉన్న భూభాగంపై మాత్రమే వ్యవహారాలు నిర్వహిస్తున్నామని భారత్ పదేపదే చెప్పినా చైనా వినిపించుకోవడంలేదు. కవ్వింపుల తీవ్రతను క్రమంగా పెంచుతూ ఇప్పుడేకంగా గాల్వాన్ లోయనే తనదని ప్రకటించుకుంది.
Recommended Video

భారత్ ఏం చేయబోతోంది?
గాల్వాన్ లోయలో భారీ సంఖ్యలో సైనికులు హత్యకు గురికావడంపై దేశవ్యాప్తంగా నిరసనలు వ్యక్తమవుతున్నాయి. సరిహద్దు వివాదాలు, విదేశాంగ విధానంలో మోదీ సర్కారు దారుణంగా ఫెయిలైందంటూ ప్రతిపక్ష పార్టీలు ఏకిపారేస్తున్నాయి. అక్సాయ్ చిన్ మనదే అయినప్పటికీ, రాజకీయ లబ్ది కోసం దానిపై అమిత్ షా చేసిన దూకుడు ప్రకటనల వల్లే పరిస్థితి ఇంతదాకా వచ్చిందని డిఫెన్స్ నిపుణులు అభిప్రాయపడుతున్నారు. వీటన్నింటి నేపథ్యంలో కేంద్రం కింకర్తవ్యం ఏమిటనేది ఇంకా వెల్లడికాలేదు. మంగళవారం నాటి ప్రకటనను బట్టి.. భారత్ మున్ముందు కూడా శాంతి మార్గాన్నే అవలంభిచబోతున్నదని స్పష్టమైపోయింది. అయితే సార్వభౌమత్వం, ప్రాదేశిక సమగ్రతకు భంగం వాటిల్లితే దేనికైనా వెనుకాడబోమనీ చైనాను హెచ్చరించింది. ఈనెల 19న ప్రధాని మోదీ నేతృత్వంలో జరగబోయే అఖిలపక్ష సమావేశం తర్వాత భారత్ తన స్ట్రాటజీని వెల్లడించే అవకాశముంది.












Click it and Unblock the Notifications