హార్మూజ్లో యూఏఈ ట్యాంకర్లపై ఇరాన్ దాడి.. భారతీయుడు మృతి
పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు ఏమాత్రం తగ్గడం లేదు. ఇరాన్- అమెరికా మధ్య యుద్ధ వాతావరణం తీవ్రస్థాయికి చేరింది. ప్రపంచ వాణిజ్యానికి కీలకమైన హార్మూజ్ జలసంధి వేదికగా ఇరు దేశాల మధ్య పరస్పరం భీకర దాడులు జరుగుతున్నాయి. తాజాగా యూఏఈకు చెందిన రెండు వాణిజ్య చమురు నౌకలపై ఇరాన్ క్షిపణులతో దాడులకు పాల్పడింది. ఈ దాడుల కారణంగా ఒక భారతీయ సిబ్బంది మృతి చెందాడు. మరో ఎనిమిది మంది తీవ్రంగా గాయపడ్డారు. గాయపడ్డవారిలో ఆరుగురు భారతీయులు, ఇద్దరు ఉక్రెయిన్ పౌరులు ఉన్నారు. ఈ విషయాన్ని యూఏఈ రక్షణశాఖ స్పష్టం చేసింది.
అమెరికా- ఇరాన్ మధ్య మరోసారి ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో హార్మూజ్ జలసంధిని ఇరాన్ మూసివేసింది. ఎవరైనా హార్మూజ్ జలసంధిని దాటే ప్రయత్నం చేస్తే.. దాడి చేస్తామంటూ ఇప్పటికే హెచ్చరికలు జారీ చేసింది ఇరాన్. అయితే ఇరాన్ హెచ్చరికల్ని బేఖాతరు చేస్తూ హార్మూజ్ జలసంధిని దాటేందుకు యూనైటెడ్ అరబ్ ఎమిరేట్స్(UAE) కు చెందిన రెండు ట్యాంకర్స్ ప్రయత్నించగా.. ఇరాన్ క్షిపణులతో దాడులు చేపట్టింది. దాంతో రెండు నౌకల్లోనూ భారీగా మంటలు చెలరేగాయి. వాటిని తిరిగి అదుపులోకి తీసుకొచ్చేందుకు అధికారులు ప్రయత్నాలు చేస్తున్నారు. రెండు నౌకలు దగ్ధమైన నేపథ్యంలో భారీగా ఆస్తి నష్టం వాటిల్లినట్లు పలువురు అంచనా వేస్తున్నారు.
మరోవైపు తమ చమురు ట్యాంకర్లపై దాడిని UAE తీవ్రంగా ఖండించింది. ప్రస్తుత పరిస్థితుల నేపథ్యంలో భద్రతా వ్యవస్థలను అప్రమత్తం చేసినట్లు వెల్లడించింది. ఇరాన్ ఇలా రెచ్చగొట్టే విధంగా చర్యలకు పాల్పడటం మానుకోవాలని హెచ్చరించింది. తమ దేశ భద్రత, ప్రయోజనాల కోసం అవసరమైన చర్యలు తీసుకునే హక్కు తమకు ఉందని పేర్కొంది. ఇదే విషయంపై యూఏఈ విదేశాంగ శాఖ కీలక ప్రకటన చేసింది. మృతి చెందిన భారతీయుడి కుటుంబ సభ్యులకు సానుభూతి తెలిపింది. క్షతగాత్రులు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించింది.

ఈ ఘటనపై భారత్ వెంటనే స్పందించి.. దిల్లీలోని విదేశాంగ శాఖ కార్యాలయంలో అత్యున్నత సమావేశం ఏర్పాటు చేసింది. ఇరాన్ రాయబారుల ప్రతినిధుల బృందం ముందు నిరసన వ్యక్తం చేసింది. అంతర్జాతీయ నౌకల్లో పని చేసే భారత సిబ్బంది భద్రతపై ఆందోళన వ్యక్తం చేసింది. దాడులు మరోసారి పునరావృతం కాకుండా చూడాలని స్పష్టం చేసింది.












Click it and Unblock the Notifications