మరణించిన చిన్నారులతో ఇరాన్ స్పీకర్ 'శాంతి' ప్రయాణం!
అమెరికా-ఇరాన్ దేశాల మధ్య పాకిస్థాన్ వేదికగా జరుగుతున్న శాంతి చర్చలను ప్రపంచ దేశాలు ఆసక్తిగా గమనిస్తున్నాయి. ఈ క్రమంలో ఇరాన్ పార్లమెంట్ స్పీకర్ మొహమ్మద్ బాగేర్ ఖలీబాఫ్ తన పాకిస్థాన్ పర్యటనలో భాగంగా చేసిన ఓ పోస్ట్ ప్రస్తుతం అంతర్జాతీయంగా చర్చనీయాంశంగా మారింది. శాంతి చర్చల కోసం పాకిస్థాన్ వెళ్తున్న విమానంలో తన పక్కన ఉన్న సీట్లలో అమెరికా క్షిపణి దాడిలో మరణించిన నలుగురు చిన్నారుల ఫోటోలను ఉంచి.. వారు తన ప్రయాణ సహచరులు అని ఇరాన్ స్పీకర్ పేర్కొన్నారు.
ఇరాన్ స్పీకర్ వినూత్న నిరసన!
ఇరాన్ పార్లమెంట్ స్పీకర్ మొహమ్మద్ బాగేర్ ఖలీబాఫ్ సోషల్ మీడియా ప్లాట్ఫామ్ ఎక్స్ వేదికగా ఓ ఫోటోను షేర్ చేశారు. అందులో విమానంలోని నాలుగు సీట్లలో నలుగురు చిన్నారుల ఫోటోలు, వాటి పక్కనే స్కూల్ బ్యాగులు, పువ్వులు ఉంచారు. ఆ చిన్నారుల ఫోటోలను ఆయన ఎంతో ఉద్వేగంతో చూస్తున్నట్లు ఆ ఫోటో ఉంది. "శాంతి చర్చల నిమిత్తం పాకిస్థాన్ వెళ్తున్న ఈ ప్రయాణంలో వీరే నా తోటి సహచరులు" అని ఆయన ఆ ఫోటోకు క్యాప్షన్ రాసుకొచ్చారు.

అమెరికా దాడిపై నిరసనగా..
ఫిబ్రవరి 28న జరిగిన ఓ క్షిపణి దాడిలో ఓ దారుణం చోటుచేసుకుంది. ఒక పాఠశాల లక్ష్యంగా అమెరికా జరిపిన ఈ దాడిలో దాదాపు 165 మందికి పైగా ప్రాణాలు కోల్పోయారు. మరణించిన వారిలో మెజారిటీ సంఖ్యలో చిన్నారులే ఉన్నారు. యుద్ధం ప్రారంభమైన తొలి గంటల్లోనే ఈ ఘోరం జరగడం ప్రపంచవ్యాప్తంగా కలకలం రేపింది.
ఈ క్షిపణి దాడిపై అమెరికా మిలిటరీ ప్రాథమిక దర్యాప్తు చేపట్టింది. తప్పుడు ఇంటెలిజెన్స్ సమాచారం కారణంగానే పొరపాటున ఆ పాఠశాలపై బాంబు దాడి జరిగిందని దర్యాప్తు నివేదిక పేర్కొంది. ఉగ్రవాదుల స్థావరమని భావించి చేసిన ఈ దాడి చివరకు చిన్నారుల ప్రాణాలు తీయడంపై సర్వత్రా తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఖలీబాఫ్ తన నిరసనను ఈ వినూత్న రీతిలో వ్యక్తం చేస్తూ ప్రపంచం దృష్టిని మరోసారి ఈ మారణకాండ వైపు తిప్పారు.
همراهان من در این پرواز#Minab168 pic.twitter.com/xvXmDlSDiF
— محمدباقر قالیباف | MB Ghalibaf (@mb_ghalibaf) April 10, 2026












Click it and Unblock the Notifications