ఐఎస్ఐఎస్ నెక్ట్స్ టార్గెట్ బ్రిటన్: ఇంటిలిజెన్స్
లండన్: బ్రిటన్ లో దాడులు చెయ్యడానికి ఇస్లామిక్ స్టేట్ (ఐఎస్ఐఎస్) ఉగ్రవాదులు ప్లాన్ చేస్తున్నారని, వీలైనంత త్వరగా ప్యారిస్ తరహాదాడులు చెయ్యాలని ఉగ్రవాద నాయకులు ఆదేశాలు జారీ చేశారని వెలుగు చూసింది.
బ్రిటన్ లో దాడులకు ఆ దేశానికి చెందిన ఇస్లామిక్ స్టేట్ జీహాదీలనే పంపించాలని ఉగ్రవాదులు నిర్ణయించారని టైజమ్ విశ్లేషకుడు పాల్ క్విక్ షాంక్ శుక్రవారం లండన్ లో చెప్పారు. ఇంటిలిజెన్స్ నుంచి తమకు ఈ సమాచారం వచ్చిందని అన్నారు.
సిరియాలో ఇస్లామిక్ స్టేట్ స్థావరాలపై బ్రిటన్ వైమానిక దాడులు చేస్తున్న విషయం తెలిసిందే. అందుకు కొన్ని వారాల్లో ప్యారిస్ తరహ దాడులు బ్రిటన్ లో చేసి ప్రతీకారం తీర్చుకోవాలని ఉగ్రవాదులు స్కెచ్ వేశారు.
ప్రస్తుతం సిరియాలో ఉంటూ జీహాదీ యుద్దం చేస్తున్న బ్రిటన్ జాతీయులను అందుకు ఉపయోగించుకోవాలని వారు నిర్ణయించారని సమాచారం. సీనియర్ యురోపియన్ కౌంటర్ టైజమ్ అధికారి ఒకరు ఇస్లామిక్ స్టేట్ కమ్యూనికేషన్ ను ట్రేస్ చెయ్యడం వలన ఈ విషయం బయటపడింది.
ఆయన ఇచ్చిన సమాచారంతోనే ఈ వివరాలు వెల్లడిస్తున్నామని పాల్ వివరించారు. అయితే ఉగ్రవాదులు ఏ ప్రాంతంలో దాడులు చెయ్యడానికి సిద్దం అయ్యారు, వాటి తీవ్రత ఎంతగా ఉంటుంది అనే విషయం తెలియడం లేదని చెప్పారు.
గత సంవత్సరంలోనే ఇస్లామిక్ స్టేట్ ఉగ్రవాదులు బ్రిటన్ లో దాడులు చెయ్యడానికి ప్రయత్నించారని, ఇంటిలిజెన్స్ వర్గాలు పసిగట్టి వెంటనే సమాచారం ఇవ్వడంతో వాటిని భగ్నం చేశామని వివరించారు.
బ్రిటన్ జాతీయులు దాదాపు 800 మంది ఇస్లామిక్ స్టేట్ లో చేరడానికి సిరియా వెళ్లారని, వారిలో సగం మంది తిరిగి స్వదేశానికి వచ్చారని పాల్ గుర్తు చేశారు. అయితే బ్రిటన్ లో ఉన్న ఆ సగం మంది మీద ఇప్పుడు నిఘా పెట్టవలసిన అవసరం ఉందని అభిప్రాయం వ్యక్తం చేశారు.
సిరియాలో ఇస్లామిక్ స్టేట్ స్వాధీనంలో ఉన్న చమురు క్షేత్రాలను లక్షంగా చేసుకుని బ్రిటన్ రాయల్ ఎయిర్ ఫోర్స్ అధికారులు దాడులు చేస్తున్నారు. మా లక్షాలను కచ్చితంగా తాము చేధించగలిగామని బ్రిటన్ ఎయిర్ పోర్స్ వర్గాలు అంటున్నాయి.