భారత టెక్కీని కిడ్నాప్ చేసిన లిబియా మిలీషియా
కోజికోడ్: కేరళకు చెందిన ఐటి ఇంజినీర్ లిబియాలో అపహరణకు గురయ్యారు. కాజీకోడ్ జిల్లాకు చెందిన రేగి జోసెఫ్ (43) ను లిబియా తిరుగుబాటు దళాలు లిబియా రాజధాని ట్రిపోలిలో మార్చి 31న కిడ్నాప్ చేశారు.
రాజధానికి సమీపంలో సోక్ అల్ జముయా కార్యాలయంలో విధులు నిర్వర్తిసుండగా దాడిచేసిన ప్రభుత్వ వ్యతిరేక దళాలు జోసెఫ్తో పాటు మరో ముగ్గురు ఇతర సహచరులను కిడ్నాప్ చేయడం ఆందోళన రేపింది. జోసెఫ్ ఆల్ దివాన్ కంపెనీలో ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇంజనీర్గా పనిచేస్తున్నారు.

భార్య, ముగ్గురు కుమార్తెలుతో గత రెండు సంవత్సరాలుగా జోసెఫ్ లిబియాలో నివసిస్తున్నారు. కాగా, భార్య స్థానిక టిఎంసి హాస్పిటల్లో నర్సుగా పనిచేస్తున్నారు. అయితే లిబియాలో ఉన్న తన కోడలు భారత రాయబార కార్యాలయాన్ని సంప్రదించినట్టు జోసెఫ్ తండ్రి తెలిపారు.
మరోవైపు కాజీకోడ్ ఎంపీ ఎంకె రాఘవన్ స్పందిస్తూ.. జోసెఫ్ కుటుంబానికి తగిన సహాయం చేస్తామన్నారు. ఈ కిడ్నాప్ వ్యవహారాన్ని కేరళ ముఖ్యమంత్రి ఊమెన్ చాందీ, కేంద్ర విదేశాంగ శాఖ మంత్రి సుష్మాస్వరాజ్ దృష్టికి తీసుకెళ్లనున్నట్టు తెలిపారు.