దాడి జరిగితే టీవీలో చూస్తారు: మిత్రదేశంపై ట్రంప్ ఆగ్రహం
వాషింగ్టన్: రిపబ్లికన్ అమెరికా అధ్యక్ష అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్ మిత్ర దేశం జపాన్ పైన నోరు పారేసుకున్నాడు. ఆ దేశంతో బరాక్ ఒబామా ప్రభుత్వం కుదుర్చుకున్న ఒప్పందాన్ని ట్రంప్ అపహాస్యం చేశారు. ఆ ఒప్పందం ప్రకారం జపాన్ పైన దాడి జరిగితే ఆదుకోవడానికి అమెరికా పూర్తిస్థాయి సైనిక బలగాల్ని పంపించాలన్నారు.
అదే అమెరికా పైన దాడి జరిగితే మాత్రం ఆ దేశం ఏం చేయాల్సిన పని లేదని వాళ్లు హాయిగా ఇళ్లలో కూర్చుని జరిగేదంతా సోనీ టీవీలో చూస్తారని ట్రంప్ ఎద్దేవా చేశారు. అమెరికాపై దాడి జరిగితే వారు కేవలం టీవీల్లో చూస్తూ కాలక్షేపం చేస్తారన్నారు.
అమెరికాలోని లోవాలో జరిగిన సభలో ట్రంప్ మాట్లాడారు. నాటో సభ్య దేశాలైన జపాన్, దక్షిణ కొరియా లాంటి దేశాల భద్రతకు అమెరికా భారీ ఎత్తున ఖర్చు చేస్తున్నప్పటికీ ఆ దేశాలు అమెరికాకు ఎంతమాత్రం అండగా నిలబడటం లేదని ఆరోపించారు.
ఇప్పటికీ జపాన్లో అమెరికాకు చెందిన 47 వేల బలగాలున్నాయని చెప్పారు. ఈ ఖర్చు మొత్తాన్ని అమెరికానే భరిస్తోందన్నారు. ఇందులో ఒక్క పైసాను జపాన్ భరించడం లేదన్నారు. ఇప్పటికైనా జపాన్ తన వైఖరిని మార్చుకోవాలన్నారు. జపాన్తో పాటు దక్షిణ కొరియా, జర్మనీ, సౌదీ అరేబియా వంటి దేశాలకు అమెరికా రక్షణ కల్పిస్తోందని, అందుకయ్యే వ్యయాన్ని మాత్రం ఆ దేశాలు చెల్లించడం లేదన్నారు.
డెమోక్రటిక్ అధ్యక్ష అభ్యర్థి హిల్లరీ క్లింటన్ అవినీతి రాణి అని ట్రంప్ ఆరోపించారు. ఒకవేళ ఆమె అధ్యక్షురాలిగా ఎన్నికైతే, త్వరలోనే అమెరికా సర్వనాశనం అవుతుందన్నారు. హిల్లరీకి స్థిమితం లేదన్నారు. ప్రచారంలో చేసిన సరదా వ్యాఖ్యలపై మీడియా తప్పుడు కథనాలు ప్రచురిస్తోందని ఆగ్రహించారు.