ప్రేమ జంటకు మద్దతు: జర్నలిస్టు కాల్చివేత
కరాచీ: పెద్దలు వ్యతిరేకించిన ప్రేమ వివాహాన్ని సమర్థించిన జర్నలిస్టును వధువు బంధువులు తుపాకితో దారుణంగా కాల్చి చంపేశారు. పాకిస్థాన్ లోని పంజాబ్ ప్రావిన్స్ లో ఈ దారుణ సంఘటన చోటు చేసుకుందని స్థానిక పోలీసులు తెలిపారు.
యువతి పెద్దల అభిప్రాయాన్ని వ్యతిరేకించి ప్రేమించిన యువకుడిని వివాహం చేసుకుంది. ఇదే సమయంలో అజ్మల్ జోయిమా (30) అనే జర్నలిస్టు ప్రేమ జంటకు అండగా నిలిచాడు. ప్రేమికులకు రక్షణ కల్పించాలని జిల్లా అధికారులకు వినతి పత్రం సమర్పించాడు.
దీంతో యువతి కుటుంబ సభ్యులు అజ్మల్ ను టార్గెట్ చేసుకున్నారు. ఎలాగైనా అతనిని అంతం చెయ్యాలని నిర్ణయించారు. గురువారం రాత్రి లోద్రాన్ జిల్లాలో బైక్ లో ఇంటికి వెలుతున్న అజ్మల్ ను ముగ్గురు వ్యక్తులు తుపాకితో కాల్చి చంపారు. అజ్మల్ బైక్ లోనే వెలుతున్న అతని బంధువుకు తీవ్రగాయాలైనాయి.
అజ్మల్ హత్యను ఖండిస్తూ పంజాబ్ ప్రావిన్స్ లో జర్నలిస్టులు పెద్ద ఎత్తున నిరసనలు, ధర్నాలు నిర్వహించారు. హంతకులను వెంటనే అరెస్టు చెయ్యాలని డిమాండ్ చేశారు. పెద్దలను ఎదిరించి ప్రేమ వివాహం చేసుకున్న వారిని కాల్చి చంపడం పాకిస్తాన్ లో సర్వసాధారణం. అదే విధంగా ప్రేమ జంటకు మద్దతు ఇచ్చిన వారిని టార్గెట్ చేసుకుంటున్నారు.