Miss World 2026: విశ్వసుందరిగా జోహైరీ మోలా.. 75 ఏళ్ల చరిత్రకు సాక్ష్యంగా
అందాల భామల అసలైన ప్రతిభకు వేదికైన ప్రపంచ ప్రసిద్ధ 'మిస్ వరల్డ్ 2026' పోటీలు అంగరంగ వైభవంగా ముగిశాయి. వియత్నాంలోని ఎంతో సముద్ర తీర ప్రాంతమైన 'న్హా ట్రాంగ్' నగరంలో శనివారం రాత్రి జరిగిన 73వ ఎడిషన్ గ్రాండ్ ఫినాలేలో ప్రపంచం నలుమూలల నుంచి వచ్చిన భామల సవాళ్లను అధిగమిస్తూ డొమినికన్ రిపబ్లిక్ కి చెందిన జోహైరీ మోలా అత్యంత ప్రతిష్టాత్మకమైన విశ్వసుందరి కిరీటాన్ని దక్కించుకున్నారు.
110 దేశాల సుందరీమణులు పోటీపడిన ఈ హోరాహోరీ పోరులో స్పెయిన్ కు చెందిన ఎలిజబెత్ రైన్స్ మొదటి రన్నరప్గా, మలేషియాకు చెందిన తానూషియా శెట్టి రెండో రన్నరప్గా నిలిచారు. గత ఏడాది విజేత థాయిలాండ్కు చెందిన ఒపాల్ సుచాత చువాంగ్శ్రీ చేతుల మీదుగా మోలా ఈ కిరీటాన్ని అందుకున్నారు.

అందంలోనే కాదు.. చదువు, సామాజిక సేవలోనూ ఆమె సత్తా!
కేవలం గ్లామర్ లోనే కాకుండా వృత్తిపరంగా, సామాజికంగా కూడా జోహైరీ మోలా ఎంతో ప్రత్యేకమైన గుర్తింపు పొందారు. బిజినెస్ మేనేజ్మెంట్లో డిగ్రీ పూర్తి చేసిన మోలా.. ఒక ప్రొఫెషనల్ మోడల్గానే కాక, విద్యావేత్తగా, సామాజిక వేత్తగా కూడా రాణిస్తున్నారు. పేద, బలహీన వర్గాల పిల్లలకు ఉచితంగా ఇంగ్లీష్ విద్యను అందించే లక్ష్యంతో 'వాయిసెస్ ఆఫ్ టుమారో' అనే స్వచ్ఛంద సంస్థను స్థాపించి ఎంతోమంది జీవితాల్లో వెలుగులు నింపారు.
అంతేకాకుండా ప్రముఖ మీడియా ఛానెల్లో కరస్పాండెంట్గా పనిచేస్తూ సామాజిక అంశాలపై గళం విప్పారు. "మన పురోగతికి ఒకప్పుడు మనకు అవసరమైన అవకాశాన్ని.. మరొకరికి అందించడమే మనం ఇచ్చే అతిపెద్ద కానుక" అనేదే తన జీవిత సూత్రమని చెప్పే మోలా, ఇప్పుడు మిస్ వరల్డ్ కిరీటంతో ప్రపంచ వేదికపై తన ఆలోచనలను చాటనున్నారు.
టాప్ 40లో నిలిచిన భారత సుందరి నికితా పోర్వాల్
ఈ ప్రతిష్టాత్మక పోటీల్లో భారతదేశం తరఫున మధ్యప్రదేశ్లోని ఉజ్జయినికి చెందిన నటి, థియేటర్ ఆర్టిస్ట్ నికితా పోర్వాల్ ప్రాతినిధ్యం వహించారు. ఫెమినా మిస్ ఇండియా వరల్డ్ 2024 విజేతగా నిలిచిన నికితా.. అంతర్జాతీయ వేదికపై తన ప్రతిభతో టాప్ 40 ఫైనలిస్టుల జాబితాలో స్థానం సంపాదించుకున్నారు.
ఫినాలే ఈవెంట్లో ప్రముఖ డిజైనర్ భవనా రావు రూపొందించిన బ్లష్-పింక్ గావున్లో నికితా మెరిసిపోయారు. ప్రతిష్టాత్మక 'డాన్సెస్ ఆఫ్ ది వరల్డ్' విభాగంలో మీనాక్షి అమ్మవారి విశిష్టతను ప్రతిబింబించే నృత్య ప్రదర్శనతో భారతీయ సంస్కృతి, సాంప్రదాయాల గొప్పదనాన్ని ప్రపంచానికి చాటిచెప్పారు.
75 ఏళ్ల చరిత్రకు సాక్ష్యంగా మిస్ వరల్డ్ వేడుకలు
ఈసారి జరిగిన 73వ మిస్ వరల్డ్ పోటీలకు మరో చారిత్రక ప్రాధాన్యం కూడా ఉంది. 1951లో లండన్లో ప్రారంభమైన ఈ అందాల పోటీల ప్రయాణం 2026 నాటికి సరిగ్గా 75 ఏళ్లు పూర్తి చేసుకుంది. దాంతో ఈ వజ్రోత్సవ ముగింపు వేడుకలను నిర్వాహకులు ఎంతో ఘనంగా నిర్వహించారు. ప్రస్తుత మిస్టర్ వరల్డ్ డానీ మెజా, 2016 మిస్ వరల్డ్ స్టెఫానీ డెల్ వాలే ఈ గ్రాండ్ ఫినాలేకి వ్యాఖ్యాతలుగా వ్యవహరించి, కార్యక్రమాన్ని మరింత కలర్ఫుల్గా నడిపించారు.














Click it and Unblock the Notifications