Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

మహమ్మద్ సిరాజ్: హైదరాబాద్ క్రికెటర్‌పై ఆస్ట్రేలియాలో మళ్లీ జాత్యహంకార వ్యాఖ్యలు

విదేశాల్లో క్రికెట్‌ ఆడేవారికి కొన్నిసార్లు చేదు అనుభవాలు ఎదురవుతుంటాయి. ఆస్ట్రేలియాతో సిడ్నీలో టెస్టు మ్యాచ్ ఆడుతున్న భారత క్రికెట్ జట్టులో కొందరికి తాజాగా ఇలాంటి అనుభవం ఎదురైంది.

శనివారం రెండో టెస్టు మ్యాచ్‌ను చూడటానికి వచ్చిన వారిలో కొందరు ఫీల్డింగ్ చేస్తున్న భారత క్రీడాకారులైన మహమ్మద్ సిరాజ్, జస్‌ప్రీత్ బూమ్రాలపై వివక్ష పూరిత వ్యాఖ్యలు చేశారు.

ఈ విషయాన్ని ఐసీసీ మ్యాచ్ రిఫరీ డేవిడ్ బూన్ దృష్టికి సిరాజ్, బూమ్రా తీసుకెళ్లారు. మరోవైపు ఈ విషయంపై అంపైర్లు పాల్ రీఫిల్, పాల్ విల్సన్‌లతో రహనే, అశ్విన్‌లు మాట్లాడారు.

సిరాజ్

అయితే ఆదివారం మ్యాచ్ చూడటానికి వచ్చినవారు కూడా ఇలానే జాత్యహంకార వ్యాఖ్యలు చేయడంతో.. అంపైర్ పాల్ రీఫిల్ దృష్టికి మరోసారి సిరాజ్ ఈ విషయాన్ని తీసుకెళ్లారు.

ఈ ఘటన జరిగిన వెంటనే వ్యాఖ్యలు చేసిన ఆడియెన్స్ వైపు పోలీసులను పంపించారు. ఈ సారి దాదాపు 10 నిమిషాలపాటు మ్యాచ్ ఆగిపోయింది.

ఈ విషయంపై భారత క్రికెట్ జట్టుకు క్రికెట్ ఆస్ట్రేలియా క్షమాపణలు చెప్పింది.

''సిడ్నీలో క్రికెట్ ఆడుతున్న భారత జట్టుపై కొందరు ప్రేక్షకులు జాత్యహంకార వ్యాఖ్యలు చేసినట్లు మా దృష్టికి వచ్చింది. ఇలాంటి వ్యాఖ్యలను సహించేది లేదు’’అని క్రికెట్ ఆస్ట్రేలియా ఒక ట్వీట్ చేసింది.

https://twitter.com/CricketAus/status/1348137519364276226

ఆస్ట్రేలియాలో ఇలాంటి వ్యాఖ్యలు ఎవరు చేసినా సహించబోయేది లేదని క్రికెట్ ఆస్ట్రేలియా ఇంటిగ్రిటీ అండ్ సెక్యూరిటీ విభాగం అధిపతి సీన్ కెరోల్ చెప్పారు.

''ఇలాంటి వివక్ష పూరిత వ్యాఖ్యలను మేం తీవ్రంగా ఖండిస్తున్నాం. ఇలాంటివి మరోసారి జరిగితే తీవ్రమైన చర్యలు ఉంటాయి’’అని ఆయన అన్నారు.

ఈ అంశంపై ఐసీసీ విచారణ చేపడుతుందని క్రికెట్ ఆస్ట్రేలియా స్పష్టంచేసింది. నిందితుల్ని గుర్తించి కఠిన చర్యలు తీసుకుంటామని తెలిపింది. వారిపై నిషేధం విధంచడంతోపాటు పోలీసులకూ అప్పగించే అవకాశముందని తెలిపింది.

2018-19ల్లో బ్యాక్సింగ్ పోటీలకు భారత జట్టు వెళ్లినప్పుడు ఇలాంటి అనుభవమే ఎదురైంది. మెల్‌బోర్న్‌లో మ్యాచ్ చూడటానికి వచ్చిన కొందరు అతిగా ప్రవర్తించారు.

తాజా ఘటన మంకీగేట్ వివాదాన్ని గుర్తుచేస్తోంది.

ఇదే గ్రౌండ్‌లో 13ఏళ్ల క్రితం జరిగిన వివాదమిది. ఇక్కడకు టెస్టు మ్యాచ్ ఆడటానికి వచ్చిన భారత క్రీడాకారుడు హర్‌బజన్ సింగ్ తనను మంకీ అని దూషించారని ఆనాడు ఆండ్రూ సైమండ్స్ ఆరోపించారు.

ఈ ఘటన తర్వాత హర్‌బజన్‌పై మూడు మ్యాచ్‌లు ఆడకుండా నిషేధం విధించారు. భారత క్రిడాకారుల పర్యటన కూడా రద్దుచేసుకునే పరిస్థితులు వచ్చాయి.

ప్రస్తుతం కరోనావైరస్ వ్యాప్తి నడుమ కేవలం కొద్ది మంది ప్రేక్షకులనే చూడటానికి అనుమతిస్తున్నారు. దీంతో సీసీటీవీ ఫుటేజీ పరిశీలించి ప్రేక్షకులపై తేలిగ్గా చర్యలు తీసుకునేందుకు అవకాశముంది.

జోఫ్రా ఆర్చర్ కూడా బాధితుడే

గతేడాది న్యూజీలాండ్ పర్యటనకు వచ్చిన ఇంగ్లండ్ క్రీడాకారుడు జోఫ్రా ఆర్చర్‌కు ఇలాంటి అనుభవమే ఎదురైంది. తను ఫీల్డ్‌లోకి అడుగు పెడుతున్నప్పుడు ఓ ప్రేక్షకుడు జాత్యహంకార వ్యాఖ్యలు చేశాడు.

దీంతో 2022 వరకు దేశీయ, అంతర్జాతీయ క్రికెట్‌ మ్యాచ్‌లు చూసేందుకు రాకుండా ఆ ప్రేక్షకుడిపై న్యూజీలాండ్ క్రికెట్ బోర్డు నిషేధం విధించింది.

గత కొన్నేళ్లుగా ఐపీఎల్ లాంటి టోర్నమెంట్ల వల్ల విదేశీ క్రీడాకారులతో సాన్నిహిత్యం పెరుగుతోంది. దీంతో క్రీడాకారుల మధ్య ఇలాంటి వివక్ష పూరిత వ్యాఖ్యలు తగ్గుతున్నాయి.

కానీ మ్యాచ్‌లు చూడటానికి వచ్చేవారు మాత్రం కొన్నిసార్లు ఇలాంటి వ్యాఖ్యలు చేస్తూనే ఉన్నారు.

మానసిక ఒత్తిడి

క్రీడాకారులపై మానసిక ఒత్తిడి పెంచేందుకు ఇలాంటి వ్యూహాలు అనుసరించడం ఎప్పటినుంచో మనం చూస్తున్నాం. ఎందుకంటే ఇలాంటి వ్యాఖ్యలతో క్రీడాకారుల ఏకాగ్రత దెబ్బతింటుంది.

ఆస్ట్రేలియా క్రీడాకారుడు డారెన్ లీమ్యాన్ 2002లో శ్రీలంక పర్యటనలో ఉన్నప్పుడు ఇలాంటి వ్యాఖ్యలు చేశారు. దీంతో ఆయనపై ఐదు మ్యాచ్‌ల నిషేధం విధించారు.

డారెన్ తన తప్పును అంగీకరించారు. అంతేకాదు తన జీవితంలో చేసిన అతిపెద్ద తప్పు అదేనని ఆయన అన్నారు. మరోవైపు 2019లో దక్షిణాఫ్రికా పర్యటనకు వచ్చిన పాక్ జట్టు కూడా ఇలాంటి ఆరోపణలే ఎదుర్కొంది. ఓ దక్షిణాఫ్రికా క్రికెటర్‌పై జాత్యహంకార వ్యాఖ్యలు చేసినట్లు పాక్ కెప్టెన్ సర్ఫరాజ్ ఖాన్ ఆరోపణలు ఎదుర్కొన్నారు.

హింస కూడా చెలరేగింది..

ఇటీవల అమెరికాలో నల్లజాతీయుడు జార్జ్ ఫ్లాయిడ్ హత్య అనంతరం జాత్యహంకార చర్యలపై ప్రపంచ వ్యాప్తంగా చర్చ జరిగింది. సమాజానికి సరైన అవగాహన కల్పించడం ద్వారా ఇలాంటి ఘటనలను అడ్డుకోవచ్చు.

భారత్ విషయానికి వస్తే.. ఇక్కడ ప్రేక్షకులు, క్రీడాకారులు కూడా కొన్నిసార్లు విదేశీ క్రీడాకారులపై వ్యాఖ్యలు చేశారు.

కొన్నేళ్ల క్రితం ఐపీఎల్ ఆడటానికి వచ్చిన వెస్ట్ ఇండీస్ క్రికెటర్ డారెన్ సామి ఇలాంటి వ్యాఖ్యలను ఎదుర్కొన్నారు. ఐపీఎల్ సన్‌రైజర్స్ టీంలో ఆడేటప్పుడు కొందరు క్రీడాకారులు తనను కాలూ అని ఎగతాళి చేశారని ఆరోపించారు. ''మొదట కాలూ అంటే గుర్రమని అనుకున్నాను. కానీ తర్వాత దాని అసలు అర్థం తెలిసింది’’అని ఆయన చెప్పారు.

హాకీ క్రీడాకారుడు వసుదేవన్ భాస్కరన్, బాక్సర్ సరితా దేవి, బ్యాడ్మింటన్ క్రీడాకారిణి జ్వాలా గుత్తా కూడా ఇలాంటి వివక్షను ఎదుర్కొన్నట్లు గతంలో తెలిపారు. ఇవేకాదు బస్సులు, ట్రైన్‌లలో ప్రయాణించేటప్పుడు చాలా మంది తమపై వివక్ష పూరిత వ్యాఖ్యలు చేశారని, దూషించారని ఫిర్యాదులు నమోదయ్యాయి.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+