బుర్హాన్ ఎన్ కౌంటర్ పై నవాజ్ షరీఫ్ సంచలన వ్యాఖ్యలు..
ఇస్లామాబాద్ : సంచలనంగా మారిన బుర్హాన్ వని ఎన్ కౌంటర్ తో కశ్మీర్ లో చెలరేగిన ఆందోళనల్లో ఇప్పటిదాకా 21 మంది చనిపోయిన విషయం తెలిసిందే. కాగా దాదాపు 300 మందికి పైగా గాయపడగా, వారిలో కొంతమంది పరిస్థితి ఆందోళనకరంగానే ఉన్నట్టు తెలుస్తోంది. బుర్హాన్ వని ఎన్ కౌంటర్ తో కల్లోల కశ్మీరం మరోసారి ఉలికిపడింది.
కాగా, ఎప్పటిలాగే కశ్మీర్ ఆందోళనలపై స్పందించిన పాకిస్తాన్ అక్కడి పరిస్థితులను తమకు అనుకూల అవకాశంగా మార్చుకోవడానికి ప్రయత్నిస్తోంది. తాజాగా భారత్ కు వ్యతిరేకంగా పాక్ ప్రధాని నవాజ్ షరీఫ్ చేసిన వ్యాఖ్యలే ఇందుకు నిదర్శనం.
ఉగ్రవాది బుర్హాన్ ని యువనాయకుడు అంటూ నవాజ్ షరీఫ్ పొగడడం గమనార్హం. ఎన్ కౌంటర్ పై నవాజ్ షరీఫ్ స్పందిస్తూ.. కశ్మీరీ యువ నాయకుడు బుర్హాన్ చనిపోయాడన్న విషయం తెలుసుకుని తాను షాక్ గురైనట్టుగా చెప్పుకొచ్చారు. భారత భద్రతా బలగాలు, అర్దసైన్యం జరిపిన చట్ట వ్యతిరేక కాల్పుల్లో చనిపోయిన వారందరికీ సానుభూతి ప్రకటిస్తున్నట్టుగా తెలిపారు. కశ్మీరీల స్వయంపాలనా హక్కును ఐక్యరాజ్యసమితి మండలిలో తీర్మానం చేయాలని డిమాండ్ చేశారు.
పాక్ ప్రధాని కార్యాలయం నుంచి వెలువడిన అధికార ప్రకటనలో ఈ వ్యాఖ్యలు చేశారు నవాజ్ షరీఫ్. ఇదిలా ఉంటే, మరోవైపు ముంబై పేలుళ్ల సూత్రధారి, జమాత్ ఉల్ దవా చీఫ్ హఫీజ్ సయ్యద్ కూడా బుర్హాన్ ఎన్ కౌంటర్ పై వివాదస్పద వ్యాఖ్యలు చేశారు. ముజఫరాబాద్ సమీపంలో జరిగిన సంస్మరణ సభలో మాట్లాడిన హఫీజ్.. 'కశ్మీర్ ఆజాద్ కోసం ఒక్క బుర్హాన్ చనిపోతే, వేలమంది పుట్టుకొస్తారంటూ' వివాదస్పద వ్యాఖ్యలు చేశారు.
కాగా, పాకిస్తాన్ లోని విపక్షాల ఒత్తిడి మేరకే ప్రధాని నవాజ్ షరీఫ్ ఎన్ కౌంటర్ అనంతర పరిణామాలపై అధికారిక ప్రకటన విడుదల చేసినట్టు తెలుస్తోంది. అక్కడి విపక్ష నేత అయిన పీపుల్స్ చీఫ్ బిలావల్ భుట్టో.. నరేంద్ర మోడీ నవాజ్ షరీఫ్ ల స్నేహం కశ్మీర్ ను కోలుకోలేని దెబ్బ తీస్తోందంటూ ఆరోపించారు. ప్రపంచ ముస్లింలంతా ఆనందంగా రంజాన్ వేడుకలు జరుపుకుంటే, కశ్మీరీలు మాత్రం హింసాత్మక ఘటనలను చవి చూడాల్సి వస్తోందన్నారు.