కరోనా మహమ్మారి తీవ్రత తగ్గలేదు: కేసులు పెరుగుతున్నాయని డబ్ల్యూహెచ్ఓ హెచ్చరిక
జెనీవా: ప్రపంచ ఆరోగ్య సంస్థ(డబ్ల్యూహెచ్ఓ) కరోనా వైరస్ వేరియంట్ ఒమిక్రాన్ వ్యాప్తిపై మరోసారి హెచ్చరికలు జారీ చేసింది. ప్రపంచ వ్యాప్తంగా ఒమిక్రాన్ వ్యాప్తి ఇంకా ప్రమాదకరంగానే ఉందని, స్వల్ప విరామం తర్వాత మళ్లీ కేసులు పెరుగుతున్నాయని పేర్కొంది. ముఖ్యంగా కరోనా నిబంధనలు తొలగించిన ప్రాంతాల్లోనే ఎక్కువ కేసులు నమోదవుతున్నాయని తెలిపింది.
చైనా, అమెరికా సహా కొన్ని దేశాల్లో కరోనా ఉధృతి మళ్లీ పెరుగుతున్న నేపథ్యంలో ప్రపంచ ఆరోగ్య సంస్థ ఎపిడెమిలాజిస్ట్ మరియా వాన్ ఖెర్ఱోవ్ ఈ మేరకు స్పందించారు. ప్రస్తుతం ఒమిక్రాన్ వేరియంట్ వ్యాప్తి ఇంకా తీవ్ర స్థాయిలోనే ఉందని చెప్పారు. ఇటీవల కొన్ని వారాలపాటు కరోనా కేసులు క్రమంగా తగ్గినప్పటికీ.. తాజాగా పలు దేశాల్లో పెరుగుతున్నాయని వెల్లడించారు. పరీక్షలు తగ్గినప్పటికీ.. కేసులు పెరుగుతూనే ఉన్నాయని ట్విట్టర్ వేదికగా పేర్కొన్నారు.
ప్రపంచ ఆరోగ్య సంస్థ గణాంకాల ప్రకారం.. మార్చి 7-13 మధ్య ప్రపంచ వ్యాప్తంగా కొత్త కేసులు 8 శాతం పెరిగాయి. అత్యధికంగా దక్షిణ కొరియా, వియత్నాం, జర్మనీ దేశాల్లో ఈ పెరుగుదల కనిపించింది. వ్యాక్సినేషన్ రేటు ఎక్కువగా ఉందని కొన్ని ప్రాంతాల్లో కోవిడ్ నిబంధనలను ఎత్తివేశారు. దీంతో ఆయా ప్రాంతాల్లో కేసులు పెరుగుతున్నాయని డబ్ల్యూహెచ్ఓ ఎపిడెమిలాజిస్ట్ తెలిపారు. వ్యాక్సిన్ల వల్ల వ్యాధి తీవ్రత, ప్రాణాపాయ ముప్పు తప్పుతుందే తప్ప.. వైరస్ వ్యాప్తి తగ్గబోదని స్పష్టం చేశారు.
We @WHO recognise the tremendous desire to move on from #COVID19, the difficulties to keep fighting & the enormous toll this has taken on our lives.
— Maria Van Kerkhove (@mvankerkhove) March 15, 2022
However, the pandemic will end with our actions & we have the power to take the death and devastation out of COVID.
Short🧵
కరోనావైరస్ సవాళ్లను ఎదుర్కోవడంలో దేశాలను బట్టి భిన్నమైన పరిస్థితులు ఉండొచ్చని, అయితే మహమ్మారి మాత్రం ఇంకా అంతం కాలేదని తేల్చి చెప్పారు. దీనిపై మనమంతా అప్రమత్తంగా ఉండాలన్నారు. అంతేగాక, టెస్టులు, జీనోమ్ సీక్వెన్సింగ్, వ్యాన్సినేషన్ ప్రక్రియను వేగవంతం చేయాలన్నారు. కరోనా మహమ్మారి అంతం మనచేతుల్లోనే ఉందని, అందుకు తగిన జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. చైనాతోపాటు అమెరికాలోనూ కరోనా కేసులు భారీగా పెరుగుతున్న విషయం తెలిసిందే. చైనాలో ఏకంగా పలు నగరాల్లో లాక్ డౌన్ ప్రకటించారు. సుమారు 3 కోట్ల మంది లాక్ డౌన్ నిర్బంధంలోనే ఉండటం గమనార్హం. ఈ క్రమంలోనే డబ్ల్యూహెచ్ఓ హెచ్చరికలు చేసింది.