26/11 పేలుళ్ల సూత్రధారి హఫీజ్ సయీద్కు 31 ఏళ్ల జైలు శిక్ష విధించిన పాకిస్థాన్ కోర్టు
న్యూఢిల్లీ: మరో రెండు ఉగ్రవాద ఫైనాన్సింగ్ కేసుల్లో లష్కరే తోయిబా (ఎల్ఈటీ) సహ వ్యవస్థాపకుడు, జమాత్ ఉద్ దవా (జేయూడీ) చీఫ్ హఫీజ్ మహమ్మద్ సయీద్కు పాకిస్థాన్ యాంటీ టెర్రరిజం కోర్టు 31 ఏళ్ల జైలు శిక్ష విధించినట్లు పాక్ మీడియా పేర్కొంది. కోర్టు సయీద్కు రూ. 3,40,000 జరిమానా విధించింది. అంతేగాక, అతని ఆస్తులను కూడా జప్తు చేసింది.
హఫీజ్ సయీద్ నిర్మించిన మసీదు, మదర్సాను సీజ్ చేయనున్నట్లు నివేదికలు తెలిపాయి.
కనీసం 160 మంది మరణించిన 2008 ముంబై ఉగ్రవాద దాడులకు హఫీజ్ సయీద్ ప్రధాన సూత్రధారిగా వ్యవహరించిన విషయం తెలిసిందే. 70 ఏళ్ల వృద్ధుడు ఇప్పటికే ఇలాంటి ఐదు కేసుల్లో దోషిగా నిర్ధారించబడి 36 ఏళ్ల జైలు శిక్షకు గురయ్యాడు. మొత్తం 68 ఏళ్ల జైలు శిక్ష ఏకకాలంలో అమలు అవుతుంది.

హఫీజ్ సయీద్ ప్రస్తుతం లాహోర్లోని అత్యంత భద్రతతో కూడిన కోట్ లఖ్పత్ జైలులో ఉన్నారు. పంజాబ్ పోలీస్ కౌంటర్ టెర్రరిజం డిపార్ట్మెంట్ నమోదు చేసిన రెండు ఎఫ్ఐఆర్లలో సయీద్కు శుక్రవారం యాంటీ టెర్రరిజం కోర్టు (ఎటిసి) న్యాయమూర్తి ఎజాజ్ అహ్మద్ భుట్టార్ 32 సంవత్సరాల జైలు శిక్ష విధించారని కోర్టు అధికారి పిటిఐకి తెలిపారు.
యూఎన్ పేర్కొన్న ఉగ్రవాది అయిన సయీద్ తలపై యునైటెడ్ స్టేట్స్ నుంచి $10 మిలియన్ల బహుమతి ఉంది. యూఎస్ డిపార్ట్మెంట్ ఆఫ్ ట్రెజరీ సయీద్ను ప్రత్యేకంగా నియమించబడిన గ్లోబల్ టెర్రరిస్ట్గా పేర్కొంది. అతను డిసెంబర్ 2008లో యూఎన్ భద్రతా మండలి తీర్మానం 1267 క్రింద జాబితా చేయబడ్డాడు.
మనీలాండరింగ్, టెర్రర్ ఫైనాన్సింగ్ను అరికట్టడంలో విఫలమైనందుకు పాకిస్తాన్ 2018 నుంచి FATF గ్రే లిస్ట్లో ఉంది. టెర్రర్ ఫైనాన్సింగ్ కేసులో సయీద్ 2019 జూలైలో అరెస్టయ్యాడు. 2020లో, పాకిస్తాన్ ప్రభుత్వం JuD, ఫలాహ్-ఇ-ఇన్సానియత్ ఫౌండేషన్ (FIF)పై నిషేధాన్ని ప్రకటించింది.
అల్-అన్ఫాల్ ట్రస్ట్, దవతుల్ ఇర్షాద్ ట్రస్ట్, మువాజ్ బిన్ జబల్ ట్రస్ట్ మొదలైన లాభాపేక్షలేని సంస్థలు, ట్రస్టుల ద్వారా సేకరించిన భారీ నిధుల నుంచి JuD ఉగ్రవాదానికి నిధులు సమకూరుస్తోందని ఉగ్రవాద నిరోధక విభాగం ఆరోపించింది.












Click it and Unblock the Notifications