కశ్మీర్ షాక్ నుంచి తేరుకోని పాక్..రోజుకో తుగ్లక్ నిర్ణయం: రైలు నిలిపివేత
జమ్మూ కశ్మీర్లో ఆర్టికల్ 370 రద్దు చేసి ఆ రాష్ట్రాన్ని విభజిస్తూ భారత ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంపై పాక్ కుటిల చాణక్యతను ప్రదర్శిస్తున్న సంగతి తెలిసిందే. ఇందులో భాగంగా ఇప్పటికే పాకిస్తాన్లోని భారత దౌత్యాధికారిని వెనక్కు పంపివేశారు. ఆ తర్వాత ఢిల్లీ లాహోర్ బస్సు సర్వీసును రద్దు చేశారు. తాజాగా సంఝౌతా ఎక్స్ప్రెస్ను కూడా శాశ్వతంగా రద్దు చేస్తూ ఇమ్రాన్ ఖాన్ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు అక్కడి మీడియా కథనాలను ప్రసారం చేసింది.
జమ్మూ కశ్మీర్పై భారత ప్రభుత్వం తీసుకున్న నిర్ణయానికి నిరసనగా పాక్ ప్రభుత్వం సంఝౌతా ఎక్స్ప్రెస్ను నిలిపివేస్తున్నట్లు పాక్ మీడియా వరుస కథనాలను ప్రసారం చేస్తోంది . అంతేకాదు పాకిస్తాన్ రైల్వేశాఖ మంత్రి కూడా అధికారికంగా ప్రకటించారు.అయితే భారత ప్రభుత్వానికి ఎలాంటి సమాచారం ఇవ్వకుండానే పాక్ ప్రభుత్వం సంఝౌతా ఎక్స్ప్రెస్ను నిలిపివేస్తూ నిర్ణయం తీసుకుంది. దీంతో పంజాబ్లోని వాఘా అట్టారీ సరిహద్దుల్లో ప్రయాణికులు ఇబ్బందులు పడుతున్నారు. సంఝౌతా ఎక్స్ప్రెస్ నడిపేందుకు పాకిస్తాన్ నుంచి డ్రైవర్, గార్డును అట్టారీ అంతర్జాతీయ రైల్వే స్టేషన్కు పంపకూడదని ప్రభుత్వం నిర్ణయించింది.
సంఝౌతా ఎక్స్ప్రెస్ను భారత్కు పంపాల్సిన బాధ్యత పాకిస్తాన్దే అని అట్టారీ రైల్వే స్టేషన్ సూపరింటెండెంట్ అరవింద్ కుమార్ తెలిపారు. అయితే గురువారం మాత్రం పాకిస్తాన్ రైలును పంపలేదని చెప్పారు. సంఝౌతా ఎక్స్ప్రెస్ను తిరిగి భారత్కు తీసుకెళ్లేందుకు డ్రైవర్ను గార్డును పంపాలని సమాచారం పంపినట్లు సూపరింటెండెంట్ తెలిపారు. అయితే భద్రతాకారణాల దృష్ట్యా రైలును నిలిపివేస్తున్నట్లు పాకిస్తాన్ మరో సారి తన కుటిల బుద్ధిని బయటపెట్టింది. ఇదిలా ఉంటే పాకిస్తాన్లోని భారత హైకమిషనర్ అజయ్ బిసారియాను బహిష్కరించింది పాక్. పాకిస్తాన్ ప్రధాని ఇమ్రాన్ఖాన్ నేతృత్వంలో జరిగిన ఉన్నతస్థాయి సమావేశం అనంతరం ఈ నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఢిల్లీలో పాక్ దౌత్యాధికారిని వెనక్కు రప్పిస్తున్నామని చెప్పిన పాక్ విదేశాంగ మంత్రి ఖురేషీ... పాక్లోని భారత దౌత్యాధికారిని కూడా వెనక్కు పంపుతామని తెగేసి చెప్పారు.