Afghanistan : పంజ్ షీర్ తాలిబన్ విక్టరీ సీక్రెట్ ఇదే- అసలు నిజం బయటపెట్టిన రెసిస్టెన్స్ గ్రూప్
ఆప్ఘనిస్తాన్ లో పరిణామాలు వేగంగా మారిపోతున్నాయి. ప్రజా ప్రభుత్వం స్ధానంలో ఆధికారాన్ని హస్తగతం చేసుకున్న తాలిబన్లు.. అక్కడ ప్రభుత్వ ఏర్పాటుకు కోసం ప్రయత్నాలు చేస్తున్న తరుణంలో నిన్నటివరకూ పంజ్ షీర్ లోయ వారిని కంటిమీద కునుకు లేకుండా చేసింది. దీంతో పంజ్ షీర్ లో హోరాహోరీ పోరు సాగించినా తాలిబన్లు దాదాపు వెయ్యి మంది ఫైటర్లను కోల్పోయారు.
సీన్ కట్ చేస్తే ఇవాళ పంజ్ షీర్ ను స్వాధీనం చేసుకున్నట్లు తాలిబన్లు సంచలన ప్రకటన చేశారు. నిన్న మొన్నటి వరకూ పంజ్ షీర్ లో రెసిస్టెన్స్ ఫ్రంట్ ప్రతిఘటన ఎదుర్కొంటూ పోరు సాగించిన తాలిబన్లకు పంజ్ షీర్ అంత సులువుగా దక్కుతుందని ఎవరూ భావించలేదు. ఎందుకంటే పంజ్ షీర్ సింహాల తెగువ అలాంటిది. కానీ ఉన్నపళంగా పంజ్ షీర్ ను తాలిబన్లు ఎలా చేజిక్కించుకోగలిగారన్న ప్రశ్నలు తలెత్తాయి.
వంజ్ షీర్ ను తాలిబన్లు స్వాధీనం చేసుకోవడం వెనుక అసలు కారణాన్ని రెస్టిస్టెన్స్ ఫ్రంట్ ఇవాళ బయటపెట్టింది. తాలిబన్లు పంజ్ షీర్ తో తమ విజయం ప్రకటించుకున్న కొద్ది గంటల్లోనే రెసిస్టెన్స్ ఫ్రంట్ నేత అహ్మద్ మసౌద్... పాకిస్తాన్ జోక్యం వల్లే ఇది సాధ్యమైనందని వెల్లడించారు. పాకిస్తాన్ జోక్యం చేసుకుని తాలిబన్లకు సాయం చేయడం వల్లే పంజ్ షీర్ తమ చేజారిందని ఆయన తెలిపారు. ఆయుధ సంపత్తి కలిగిన పాకిస్తాన్ అక్కడ అడుగు మోపకపోతే తాలిబన్లపై తమదే పైచేయి అయ్యేదని మసౌద్ పేర్కొన్నారు.
పంజ్ షీర్ లో పాకిస్తాన్ దళాలతో కలిసి తాలిబన్లు చేసిన బాంబుదాడుల్లో రెసిస్టెన్స్ ఫ్రంట్ కీలక నేత ఫహీమ్ దస్తీ ప్రాణాలు కోల్పోయారు. అలాగే ఫ్రంట్ బలగాలకు కూడా భారీ ఎదురుదెబ్బలు తగిలాయి. వీరిలో చాలా మంది ప్రాణాలు పొగొట్టుకున్నారు. ఆప్ఘనిస్తాన్ లో తాలిబన్ల ప్రభుత్వ ఏర్పాటుకు అడ్డంకిగా ఉన్న పంజ్ షీర్ ను వారికి అందించేందుకు మిత్రదేశం పాకిస్తాన్ పూర్తిగా సహకరించినట్లు తాజా పరిణామాలు స్పష్టం చేస్తున్నాయి. ఆఫ్ఘనిస్తాన్ పై పాకిస్తాన్ పట్టుకు కూడా ఇదే నిదర్శమని విశ్లేషకులు భావిస్తున్నారు.