విషమించిన మాజీ ప్రధాని ఆరోగ్యం.. పాకిస్తాన్ సుప్రీంకోర్టు సంచలన తీర్పు!
పాకిస్తాన్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ ఆరోగ్య పరిస్థితి విషమించినట్లు వార్తలు వస్తున్నాయి. గత ఏడాది ఆగస్టు నుంచి రావల్పిండిలోని తీవ్రమైన అడియాలా జైలులో నిర్బంధంలో ఉన్న ఆయన ఆరోగ్యం బాగా క్షీణించిందన్న న్యూస్ ఆ దేశంలో పెద్ద అలజడినే సృష్టించాయి. ఈ నేపథ్యంలో పాకిస్తాన్ అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు మంగళవారం కీలక ఆదేశాలు జారీ చేసింది. ఇమ్రాన్ ఖాన్ను జైలు నుంచి వెంటనే ఇస్లామాబాద్లోని ప్రముఖ షిఫా ఇంటర్నేషనల్ ఆసుపత్రికి తరలించి, అత్యున్నత స్థాయి వైద్య నిపుణులతో సమగ్ర వైద్య పరీక్షలు నిర్వహించాలని స్పష్టం చేసింది.
జస్టిస్ షాహిద్ వహీద్ నేతృత్వంలోని ముగ్గురు సభ్యుల ధర్మాసనం ఇమ్రాన్ ఖాన్ పిటిషన్పై విచారణ జరిపి ఈ సంచలన తీర్పునిచ్చింది. వైద్య పరీక్షల కోసం ప్రత్యేకంగా ఒక వైద్య బోర్డును ఏర్పాటు చేయాలని, అందులో ఇమ్రాన్ వ్యక్తిగత వైద్యుడితో పాటు ఆయన సోదరి ఉజ్మా ఖాన్ను భాగస్వామ్యం చేయాలని కోర్టు సూచించింది. అంతేకాకుండా, రాజకీయ ఖైదీల పట్ల జైలు యాజమాన్యం వ్యవహరిస్తున్న తీరుపై అసంతృప్తి వ్యక్తం చేసిన కోర్టు.. ప్రతివారం కుటుంబ సభ్యులు ఇమ్రాన్ను కలవడానికి అనుమతించాలని స్పష్టం చేసింది. అయితే, వైద్య నివేదికలను మీడియాకు వెల్లడించి దీనిని రాజకీయం చేయవద్దని న్యాయవాదులు, కుటుంబ సభ్యులకు ఆంక్షలు విధించింది.

ఆందోళనకరంగా రక్తపోటు, గుండె వేగం!
ఇమ్రాన్ ఖాన్ శారీరక, మానసిక ఆరోగ్యం క్షీణించడంపై పాకిస్తాన్ మాజీ అధ్యక్షుడు ఆరిఫ్ అల్వీ తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. అత్యంత కఠినమైన ఏకాంత నిర్బంధం వల్ల ఇమ్రాన్ తీవ్రమైన ఆందోళనకు గురవుతున్నారని, ఆయన రక్తపోటు పెరిగిపోవడమే కాకుండా గుండె వేగం నిమిషానికి 54కి పడిపోయిందని సామాజిక మాధ్యమాల వేదికగా ఆందోళన వ్యక్తం చేశారు. మరోవైపు, గత ఏడు నెలలుగా తమ తండ్రిని కలవడానికి గానీ, ఆయన ఆరోగ్య పరిస్థితి తెలుసుకోవడానికి గానీ అధికారులు అనుమతించడం లేదని ఇమ్రాన్ కుమారులు సులైమాన్, ఖాసిమ్లు అంతర్జాతీయ మీడియాతో ఆవేదన వ్యక్తం చేశారు.
దేశవ్యాప్తంగా పోటెత్తిన నిరసనలు!
ఇమ్రాన్ ఖాన్ పట్ల ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరును నిరసిస్తూ ఆయన మద్దతుదారులు, పాకిస్తాన్ తెహ్రీక్-ఏ-ఇన్సాఫ్ కార్యకర్తలు దేశవ్యాప్తంగా పెద్దఎత్తున వీధుల్లోకి వచ్చి ఆందోళనలు బాట పట్టారు. ఇమ్రాన్ ఖాన్తో పాటు ఆయన భార్య బుష్రా బీబీని వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేస్తున్నారు. 2022లో అవిశ్వాస తీర్మానం ద్వారా అధికారంలోంచి దిగిపోయినప్పటి నుంచి ఇమ్రాన్ ఖాన్పై రాజకీయ కక్షసాధింపు చర్యలు జరుగుతున్నాయని, ప్రతిపక్షాలను అణచివేసేందుకు సైన్యం అండతో ప్రభుత్వం తీవ్ర యత్నాలు చేస్తోందని పీటీఐ నేతలు మండిపడుతున్నారు.














Click it and Unblock the Notifications