యుద్ధానికి సిద్ధం కండి, గెలవాల్సిందే: చైనా ఆర్మీకి అధ్యక్షుడు జీ జింపింగ్
బీజింగ్: చైనా అధ్యక్షుడు షి జిన్పింగ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. చైనా జాతీయ భద్రతలో అనిశ్చితి పెరుగుతోందని.. సైన్యం భవిష్యత్తులో జరిగే పోరాటాలను గెలిచేందుకు సామర్థ్యాలను, యుద్ధ సన్నద్ధతను పెంచుకునేందుకు పూర్తి శక్తియుక్తులను ధారపోయాలని పిలుపునిచ్చారు. మూడోసారి మిలటరీ కమిషన్ అధిపతిగా బాధ్యతలు జిన్పింగ్ తీసుకున్నారు.
ఈ క్రమంలో సీపీసీకి వ్యూహాత్మక మద్దతునిచ్చే సీఎంసీలోని జాయింట్ ఆపరేషన్స్ కమాండ్ సెంటర్ను తనిఖీ చేశారు. ఈ సందర్భంగా సైన్యంలోని 20 లక్షల మందిని ఉద్దేశించి జిన్పింగ్ మార్గనిర్దేశనం చేశారు. శతాబ్దంలో ఎన్నడూ చూడని మార్పులకు ప్రపంచం లోనవుతోందన్నారు. చైనా జాతీయ భద్రత అస్థిరత, అనిశ్చితిని ఎదుర్కొంటోందని, దాని సైనిక లక్ష్యాలు కూడా కఠినతరంగా మారాయన్నారు.
ఈ నేపథ్యంలో పోరాటాలకు సిద్దంగా ఉండేందుకు అన్ని వనరులను వినియోగించుకోవడంతోపాటు యుద్ధాల్లో గెలిచే సామర్థ్యాలను పెంచుకోవాలని ఆర్మీకి జింపింగ్ పిలుపునిచ్చారు. యుద్ధానికి సిద్ధం కావాలని, అందులో గెలిచి తీరాలని అన్నారు. ముఖ్యంగా 2027 నాటికి ప్రపంచస్థాయి సైనిక శక్తిగా ఎదగాలని పెట్టుకున్న లక్ష్యంపై సైనికాధికారులు దృష్టి సారించాలని జిన్పింగ్ నిర్దేశించారు. ఈ మేరకు అధికారిక మీడియా వెల్లడించింది.
అక్టోబర్ నెలలో కమ్యూనిస్టు పార్టీ ఆఫ్ చైనాలో సెంట్రల్ కమిటీకి ఎన్నిక ద్వారా జింపింగ్ మూడోసారి చైనా అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టారు. దీంతో సీపీసీ జనరల్ సెక్రటరీతోపాటు సెంట్రల్ మిలటరీ కమిషన్, పీపుల్స్ లిబరేషన్ ఆర్మీల బాధ్యతలను కూడా ఆయన చేపట్టారు.
కాగా, గత నెలలో పార్టీ కాంగ్రెస్లో తన ప్రసంగంలోకూడా జింపింగ్.. "స్థానిక యుద్ధాలలో విజయం" లక్ష్యంగా పెట్టుకున్నారు. "అన్ని అంశాలలో శిక్షణ, యుద్ధానికి సన్నద్ధతను మెరుగుపరచండి. పోరాడి గెలిచే సైన్యం సామర్థ్యాన్ని మెరుగుపరచండి' అని చైనా ఆర్మీకి పిలుపునిచ్చారు.