బ్రిటన్: మంత్రి పదవికి ప్రీతిపటేల్ రాజీనామా, ఇజ్రాయిల్ ట్రిప్ ఎఫెక్టే!
లండన్: బ్రిటన్లో రాజకీయాల్లో కీలక వ్యక్తిగా ఎదిగిన 'భారత సంతతి ప్రజల ఛాంపియన్' ప్రీతి పటేల్ (45) అర్ధాంతరంగా ప్రధాని థెరిస్సా మే కేబినెట్ నుంచి వైదొలగారు. మంత్రి వర్గ సభ్యుల్లో సీనియర్ సహచరురాలిగా థెరిస్సాకు కుడి భుజంగా ఉన్న ఆమె తన వ్యవహారాల్లో పారదర్శకతను పాటించలేదన్న వివాదంలో చిక్కుకున్నారు.
అంతర్జాతీయ అభివృద్ధి విభాగ (డీఎఫ్ఐడీ) మంత్రిగా ఉన్న ప్రీతి పటేల్ తన విదేశీ పర్యటన సమయంలో ఇజ్రాయిల్ ప్రధాని, ఇతర రాజకీయ నేతలతో భేటీ అయిన విషయాన్ని ప్రధాని థెరిస్సాకు తెలియజేయకుండా రహస్యంగా ఉంచారన్నది ప్రధాన ఆరోపణ. ఈ వివాదం పెద్దదిగా మారటంతో ఆఫ్రికా పర్యటనలో ఉన్న ప్రీతిపటేల్ను ప్రధాని మే మధ్యంతరంగా వెనక్కి రప్పించారు.
ఈ నేపథ్యంలో బుధవారం ప్రధానిని కలిసిన ఆమె క్షమాపణలు చెప్పటంతో పాటు మంత్రి పదవికి రాజీనామా చేశారు. కన్సర్వేటివ్ పార్టీలో ప్రీతి పటేల్ స్వల్పకాలంలోనే ఉన్నతిని సాధించారు. ఆ పార్టీ తరఫున భవిష్యత్తులో ప్రధాని మంత్రి అభ్యర్థి కాగలరన్న అంచనాలు కూడా రావడం గమనార్హం.